विवेचन सारांश
పరమాత్మ ప్రాప్తికి రాజ మార్గము.

ID: 2802
तेलुगू - తెలుగు
ఆదివారం, 07 మే 2023
అధ్యాయము 9: రాజవిద్యా రాజగుహ్య యోగము
3/3 (శ్లోకము 22-34)
వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/


సంప్రదాయానుసారముగా శ్రీకృష్ణ ప్రార్ధన , సరస్వతీ ప్రార్ధన మరియు దీప  ప్రజ్వలనముతో కార్యక్రమం ప్రారంభమైనది. శ్రీ శ్రీనివాస్ జీ   వర్ణేకర్ గారు  శ్రీకృష్ణ ప్రార్ధన, గురు వందన మరియు గీతా ప్రార్థనా శ్లోకములతో వివేచనా సత్రమును మొదలు పెట్టినారు. నవమోధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగములో శ్రీకృష్ణుడు  తన విభూతి ఐశ్వర్యములను గురించి  విపులంగా వివరించాడు. సర్వభూతములు తనయందు ఉన్నాయని కాని తాను వాటిలో లేనని అన్నాడు. తన అధ్యక్షతలో ప్రకృతి ఈ విశ్వాన్ని అంతటినీ నడిపిస్తుందని చెప్పాడు. మహాత్ములైన భక్తులు తనని ఏ విధంగా సేవిస్తారో చెప్పాడు. ఈ అఖండ విశ్వానికి తానే మాతా,పిత, ధాతయని చెప్పాడు. గతి, ప్రభువు, భర్త, సాక్షి ,ప్రభవము ,ప్రళయము అన్నీ తానే అని చెప్పాడు. తన ఉష్ణ ప్రభావంతో జలాన్ని ఎలా తపింపజేసి వర్షంగా  ఏ విధంగా  మారుస్తాడో చెప్పాడు. కాని ఈ విషయాలు తెలుసుకోలేని వారు  పరమాత్ముని చేరుకోవడానికి ప్రయత్నించక స్వర్గ ప్రాప్తికై వివిధ యజ్ఞాలు ఎలా ఆచరిస్తారో వివరించాడు. ఆ విధంగా యజ్ఞాలు ఆచరించిన వారు  పుణ్య సంపదలు క్షీణించాక తిరిగి మర్త్యలోకానికి రావాల్సిందే.  ఇలా రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. పరమాత్మను పొందడం అంటే శాశ్వతమైన సచ్చిదానంద సుఖాన్ని పొందడం. మరి పరమాత్మను చేరుకునే విధానం ఎటువంటిది? దాన్ని తర్వాత శ్లోకంలో భగవంతుడు వివరిస్తాడు

9.22

అనన్యాశ్చిన్తయన్తో మాం(య్ఁ) , యే జనాః(ఫ్) పర్యుపాసతే
తేషాం(న్) నిత్యాభియుక్తానాం(య్ఁ) , యోగక్షేమం(వ్ఁ) వహామ్యహమ్॥9.22॥

పరమేశ్వరుడనైన నన్ను నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (అప్రాప్త వస్తుప్రాప్తిని 'యోగము' అనియందురు. ప్రాప్తించిన వస్తురక్షణమును 'క్షేమము' అని యందురు.)

9.22 
అనన్య భావముతో నన్నే చింతన చేసేవారి యోగక్షేమములు నేనే వహిస్తానని పరమాత్ముడు చెప్తున్నాడు. అనన్య అంటే న.. అన్య... కేవలము పరమాత్మనే కావాలన్న ఆర్తితో ఆయనని సేవించడం. ఒక ఉదాహరణ చెప్పారు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. రోజూ వాడి తండ్రి పెందలాడే బయటకి వెళ్లి రాత్రి ఆలస్యంగా వస్తాడు. తండ్రి వచ్చే సమయానికి ఆ పిల్లవాడు నిద్రపోయి ఉంటాడు. ఒక రోజు తండ్రి ఆ పిల్లవాడి కోసం బొమ్మలు తెచ్చాడు. కాని ఆ పిల్లవాడేమో 'నాకు బొమ్మలు వద్దు నాన్నే కావాలి' అన్నాడు. మనం కూడా అలాగే 'పరమాత్ముడు తప్ప వేరేది వద్దు 'అన్న భావనతో ఆయనని భజించాలి. నిత్య అభియుక్త... చక్కగా పరమాత్ముడితో ఎప్పుడూ కూడా ఉండేవారు అని అర్థం. మనం కూడా పరమాత్ముడిని ప్రార్థిస్తాము. మనకేదైనా  పని కావాలంటే, ఏదైనా కోరికలు తీరాలంటే అప్పుడు మనకి దేవుడు గుర్తొస్తాడు.ఒక భార్య భర్తని ఒక రోజు సినిమాకి తీసుకు వెళ్ళమని అడిగింది. భర్తేమో 'సినిమాకు తీసుకెళ్లడానికి సమస్య లేదు. కాని అక్కడ  బండికి పార్కింగ్ దొరకడం కష్టం' అంటాడు. 'మీకు తప్పకుండా పార్కింగ్ దొరుకుతుంది, నేను దేవుడిని ప్రార్థిస్తాను' . అంటుందామె. అలాగే వాళ్ళు వెళ్ళగానే ఒక పార్కింగ్ దొరుకుతుంది. ఆమె దేవుడితో 'దేవుడా మాకు పార్కింగ్ దొరికింది. నీ సహాయం అవసరం లేదు' అంటుంది. ఇలాంటి భక్తి అనన్య భక్తి కాదు. యోగం అంటే... అప్రాప్తస్య ప్రాప్తిః.   క్షేమం  అంటే ప్రాప్తించిన దాని యొక్క  రక్షణ. భారతీయ జీవిత బీమా సంస్థ వారి బోధ వాక్యం ' యోగక్షేమం వహామ్యహం'. మీరు ప్రీమియం సరిగా కడితే మీ యోగక్షేమం మేం చూస్తామని 'అంటారు వారు. కాని పరమాత్ముడికి కావలసిన ప్రీమియం ఒక్కటే....  అనన్యమైన భక్తి.

9.23

యే ౽ప్యన్యదేవతా భక్తా, యజన్తే శ్రద్ధయాన్వితాః
తే౽పి మామేవ కౌన్తేయ, యజన్త్యవిధిపూర్వకమ్।।23।।

ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధిపూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.

9.23 
జనులు అనేక దేవతలని పూజిస్తారు. కాని అవన్నీ పరమాత్ముని రూపాలే అన్న సంగతి మరిచిపోతారు.  విఘ్నాలు కలగకుండా  గణపతిని, చదువుల కోసం సరస్వతిని, సంపద కోసం లక్ష్మీదేవిని, ఆరోగ్యం, బలం కోసం హనుమంతుని.. ఇలా అనేక దేవతలని పూజిస్తూ ఉంటారు. అది కూడా శ్రద్ధతో పూజిస్తారు. గణపతికి దూర్వా,  మోదకములు సమర్పిస్తారు. శివుడికి బిల్వపత్రాలు ,విష్ణువు కి తులసి మాలలు ఇలా  ...ఎంతో నిష్టగానే పూజిస్తారు. అందులో తప్పులేదు. మనం ఒక ఫ్లాట్ అమ్మాలనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్తాము. ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. కాని మనం ఏ పని కోసం వెళ్తామో ఆ పనికి సంబంధించిన శాఖకే వెళ్తాము. కాని ఈ వివిధ దేవతలు ఒకే పరమాత్ముడి రూపాలన్న జ్ఞానం మనకి ఉండాలి. కొంతమంది నేను దుర్గను పూజిస్తాను ...కాని లక్ష్మిని పూజించను అంటారు. ఇది వారి అజ్ఞానం. నీళ్లు మన ఇంటి ట్యాంక్ లో ఉంటాయి, కొళాయిలో ఉంటాయి. నదిలో, సరస్సులో, సముద్రంలో ఎన్నో రకాలుగా ఉంటాయి.  నీరు ఎక్కడున్నా దాని తత్వం ఒక్కటే. H2O... రెండు అణువుల   ఉదజని,  ఒక అణువు ప్రాణవాయువు అంతే. ఈ విషయం తెలియని జనులు అజ్ఞానంతో అన్య దేవతలని పూజిస్తారు. కాని ఆ పూజలన్నీ పరమాత్ముడికే చెందుతాయి.

9.24

అహం(మ్) హి సర్వయజ్ఞానాం(మ్), భోక్తా చ ప్రభురేవ చ
న తు మామభిజానన్తి, తత్త్వేనాతశ్చ్యవన్తి తే।।24।।

ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎఱుంగరు. కావున పతనమగుదురు. అనగా పునర్జన్మను పొందుదురు.

9.24 
సకల యజ్ఞములకు భోక్తా మరియు ప్రభువు కూడా పరమాత్ముడే. అందుకే అన్నారు..' సర్వదేవ నమస్కారం కేశవం  ప్రతి  గచ్చతి'. నదులన్నీ ఏ విధంగా సాగరాన్ని చేరుతాయో, విశ్వంలోని అన్ని  యజ్ఞములు   భగవంతుడిని చేరుతాయి. ఇక్కడ మనం భగవద్గీత బోధిస్తున్నది శ్రీకృష్ణుడి రూపంలో   ఘనీభవించిన పరమాత్మ  స్వరూపమే అని గ్రహించాలి. ఒకే శరీరంలో వివిధమైన అవయవాలు ఉన్నాయి. చెవి, నోరు, నాలుక ,కళ్ళు, ముక్కు , చేతులు,కాళ్లు ఇలా. మనం చక్కటి సంగీతాన్ని వినాలంటే నాలుకని ఉపయోగించలేము. చెవితోనే వినాలి.  కాని సుఖాన్ని అనుభవించేది మాత్రం  మనసే. అదేవిధంగా అన్ని యజ్ఞాలకి భోక్త... ప్రభువు  భగవంతుడే.

9.25

యాన్తి దేవవ్రతా దేవాన్, పితౄన్యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా, యాన్తి మద్యాజినో౽పి మామ్।।25।।

దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు.

9.25 
 దేవతలని అర్చించే వారు దేవతలని చేరుకుంటారు. పితృదేవతలని ఉపాసించేవారు పితృదేవతలనే పొందుతారు. భూతాలను ఆరాధించేవారు.. అంటే ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. భూతాలు అంటే పంచభూతాలు.. ప్రకృతి. వీటిని ఆరాధించే వారు కొంతమంది ఉంటారు. ఎవరు దేనిని ఉపాసిస్తారో వారు దానినే పొందుతారు. మరికొంతమంది భూతప్రేతాలని  ఉపాసించే వారు ఉంటారు. వారు  వాటినే పొందుతారు. ఎవరు పరమాత్ముని ఉపాసిస్తారో వారు పరమాత్ముడినే పొందుతారు. వారికి పునర్జన్మ ఉండదు.

9.26

పత్రం(మ్) పుష్పం(మ్) ఫలం(న్) తోయం(య్ఁ) , యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం(మ్) భక్త్యుపహృతమ్, అశ్నామి ప్రయతాత్మనః॥9.26॥

నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమునుగాని, ఫలమునుగాని, జలమునుగాని, నేను ప్రత్యక్షముగా (స్వయముగా) ప్రీతితో ఆరగింతును.

9.26 
 ఒక ఆకైనా ,పువ్వైనా, పండైనా... నీరైనా సరే.. భక్తి పూర్వకంగా అర్పించినప్పుడు పరమాత్ముడు దానిని ప్రీతితో స్వీకరిస్తాడు. భక్త్యా... భక్తి భావం ముఖ్యం. మనసులో భక్తి భావం లేకుండా దేవుడిని పిలిస్తే...
मनी नाही भाव म्हणे देवा मला पाव l
 देव अशाने भेटायचा नाही रे l
 देव बाजारचा भाजीपाला नाही रे ll
 అలాంటి వారిని కలవడానికి దేవుడు రాడు. దేవుడు బజారులో అమ్మే కూరగాయలంత చౌక కాదు.
మనమైతే మనకి దొరికే కానుకలలో presentation చూస్తాము. కానీ పరమాత్మ intention  చూస్తాడు. అశ్నామి.. అంటే స్వీకరిస్తాను అని అర్థం. జ్ఞానేశ్వర్ మహారాజ్ అంటారు.
पत्र पुष्प फळ l हे भक्तीसाठी निमित्त मात्र केवळ l
पण अनन्य भक्ती साधन ll
మనం పత్రం ,పుష్పం, ఫలం ఏది ఇచ్చినా అది కేవలం నిమిత్తం మాత్రమే. పరమాత్ముడు చూసేది కేవలం మనసులో ఉన్న పవిత్రమైన భక్తి భావం మాత్రమే. మనం  ఇది అర్పించేందుకు కూడా    తీరికనే లేదంటాము. మన పనులలో మనము చాలా బిజీగా ఉన్నామని అంటాము. అటువంటప్పుడు ఇంకా దేవుడికి ఏం అర్పించగలమో చూద్దాము.

9.27

యత్కరోషి యదశ్నాసి, యజ్జుహోషి దదాసి యత్
యత్తపస్యసి కౌన్తేయ, తత్కురుష్వ మదర్పణమ్।।27।।

ఓ కౌంతేయా! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపుము.

9.27 
శ్రీకృష్ణుడు అంటున్నాడు..' మీరు చేసే ఏ పనినైనా నాకు సమర్పించండి' . ప్రపంచంలో అనేక రకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఒక డాక్టరు ప్రజల  రోగాలకు చికిత్స చేస్తాడు. ఒక ఇంజనీరు అనేక కట్టడాలని నిర్మిస్తాడు. ఒక ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు నేర్పించి  భావి పౌరులని తయారు చేస్తాడు. ఒక గుమాస్తా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఒక గృహిణి వంట చేసి ఇంట్లోని సభ్యులందరి  బాగోగులు చూస్తుంది. ఏ పనైనా సరే అది పరమాత్మునికి సమర్పించి చేయాలి. అదేవిధంగా మనం ఏం భుజించినా అది పరమాత్మునికే అర్పించి భుజించాలి.
वदनी कवळ घेता नाम घ्या श्रीहरीचे l
सहज हवन होते नाम घेता फुकाचे l
  जीवन करी जीवित्वा अन्न हे पूर्णब्रह्म l
 उदरभरण नोहे जाणीजे यज्ञ कर्म ll
మన ఉదరంలో  జఠరాగ్ని రూపంలో ఉన్న పరమాత్ముడి కోసం తింటున్నామని తింటే .. అన్నము పూర్ణ బ్రహ్మ అనే భావంతో తింటే..  అది కడుపు నింపుకోవడం కాక ఒక యజ్ఞం అవుతుంది.  15వ  అధ్యాయంలో పరమాత్ముడు చెప్పాడు.
 "అహం వైశ్వానరో భూత్వా  ప్రాణి నాం దేహమాశ్రితః ।
 ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం."।।
 అన్ని ప్రాణులలో   వైశ్వానరుడి  రూపంలో ఉండి  అన్నాన్ని నాలుగు విధాలుగా జీర్ణం చేస్తున్నది తానేనని.
అదేవిధంగా ఏ హోమం చేసినా, తపస్సు చేసినా దాన్ని పరమాత్ముడికే అర్పించాలి. మన కర్తవ్య నిర్వహణ కోసం శరీరాన్ని తపింప చేయడం ఒక తపస్సు. పొద్దున్నే లేచి ఈ ప్రార్థనని మనసులో అనుకోండి.

 
कर प्रणाम तेरे चरणो मे
लगता हूँ अब तेरे काज
 पालन करनेको आज्ञा तव  
 मै नियुक्त होता हूँ आज ll
పరమాత్మునికి  చరణాలకు ప్రణామాలు అర్పించి ఆయన అనుజ్ఞతో ఆయన కోసమే మనం ఆయన పనులే చేస్తున్నామన్న పవిత్ర భావన మనసులో రానీయండి. ఇక పాపపుణ్యాలంటూ మనకి ఉండనే ఉండవు. ఇక రోజంతా చేసిన పనులన్నీ ఒకసారి సమీక్షించుకుని 'దేవుడా నీకోసమే ఈ పనులన్నీ చేశాను'  అని ఆయనకి అప్పగించి, 'రేపు తిరిగి నీ పనులు చేయడానికి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను'.. 'సర్వం కృష్ణార్పణం' అని కళ్ళు మూసుకుంటే ఎంత హాయిగా నిద్ర వస్తుంది! భగవంతుడికి అర్పించి పనులు చేయడం వల్ల మనం పాపకర్మలు చేయాలన్నా చేయలేము. మనలో ఉన్న పరమాత్ముడు అటువంటి పనులను మన చేత చేయించడు.

9.28

శుభాశుభఫలైరేవం(మ్), మోక్ష్యసే కర్మబన్ధనైః
సన్న్యాసయోగయుక్తాత్మా, విముక్తో మాముపైష్యసి।।28।।

ఈ విధముగా సన్న్యాసయోగమునందు స్థిరచిత్తుడవై. అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు.

9.28 
శుభ, అశుభ ఫలముల నుండి, కర్మబంధము నుండి మోక్షం లభిస్తుంది. మనం మామూలుగా మంచి పనులు చేసినప్పుడు 'ఈ పని నేను చేశాను 'అని గొప్పగా చెప్పుకుంటాం.  అంటే మనమే కర్తలమని చాటుకుంటాము. అదే ఒక పని సరిగా జరగనప్పుడు ' దేవుడు ఎందుకిలా చేశాడు' అని వాపోతాము. ఒక పని శుభమైనా, అశుభమైనా  దాని కర్తృత్వాన్ని పరమాత్ముడికే సమర్పించాలి. అప్పుడు దాని ఫలితం మనకి అంటదు. మంచి పనుల కర్తృత్వాన్ని మనం తీసుకున్నా  వాటి పుణ్యఫలం అనుభవించడానికి మనం తిరిగి పుట్టవలసి వస్తుంది. అన్ని భగవంతుడికే వదిలేసినప్పుడు కర్మబంధనం నుండి ముక్తి కలుగుతుంది. సన్యాస యోగం.. న్యాసం అంటే త్యాగం. చక్కగా చేసిన త్యాగం సన్యాసం. యోగం అంటే పరమాత్ముడిని చేరడం. మామ్ ఉపైశ్యసి... నన్నే పొందుతావు. పరమాత్మ ప్రాప్తికి వేరే ఏమీ చేయక్కర్లేదు. మనం చేసే కర్మలను..  భగవంతుడు మనకిచ్చిన కర్తవ్యం గా భావించి  వాటిని ఆచరిస్తూ.. అన్నిటినీ ఆయనకి సమర్పిస్తే చాలు.

9.29

సమో౽హం(మ్) సర్వభూతేషు, న మే ద్వేష్యో౽స్తి న ప్రియః
యే భజన్తి తు మాం(మ్) భక్త్యా, మయి తే తేషు చాప్యహమ్।।29।।

నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును.

9.29 
పరమాత్ముడు సర్వభూతములందు సమ భావంతో ఉంటాడు. అతడికి ఎవరి మీద ద్వేషం కానీ, ప్రేమ కానీ ఉండవు. కాని ఎవరైతే నిర్మల భక్తితో నిరంతరము అతనిని భజిస్తారో వారి హృదయంలో అతడు ఉంటాడు. అతడి హృదయంలో కూడా వారు ఉంటారు. ఉదాహరణకి ఒక తల్లికి పిల్లలందరూ సమానమే. కాని ఏ పిల్లవాడు ఆమె మాట ఎప్పుడూ వింటాడో, ఆమె చెప్పిన పనులు చక్కగా చేస్తాడో అతడి పట్ల  ఆమెకి అనురాగం ఉంటుంది. ఇదే విధంగా ఒక కార్యాలయంలో తనకి అనుగుణంగా నడుచుకుని, సమర్థవంతంగా పనిచేసే ఉద్యోగి పట్ల అధికారికి కొంత సదభిప్రాయం ఉంటుంది. పరమాత్మ ప్రాప్తికి ఇది రాజ విద్య. చలికాలంలో మండుతున్న నెగడు దగ్గర చలికాచుకుంటాము. నెగడుకు దూరంగా ఉండి నాకు వెచ్చదనం రాలేదంటే సరిపోతుందా? ఉష్ణత కావాలంటే నెగడుకు దగ్గరగా రావాలి. మనం పది అడుగులు పరమాత్మ వైపుగా వేస్తే ఆయన ఇరవై  అడుగులు వేసుకుని మన దగ్గరికి వస్తాడు. మన పట్ల అంత కరుణ ఆయనకి.

9.30

అపి చేత్సుదురాచారో, భజతే మామనన్యభాక్
సాధురేవ స మన్తవ్యః (స్), సమ్యగ్వ్యవసితో హి సః।।30।।

మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో ఆతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మఱియొకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు.

9.30 writeup

9.31

క్షిప్రం(మ్) భవతి ధర్మాత్మా, శశ్వచ్ఛాన్తిం(న్) నిగచ్ఛతి
కౌన్తేయ ప్రతిజానీహి, న మే భక్తః(ఫ్) ప్రణశ్యతి।।31।।

కౌంతేయా! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును. శాశ్వతమైన పరమశాంతిని పొందును. 'నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు' అను విషయమును నిశ్చయముగా ఎఱుంగుము.

9.30, 31 
దురాచారుడైనా సరే.. పశ్చాత్తాపముతో ..అనుతాపముతో భగవంతుడిని శరణు వేడినప్పుడు,   అతడిని సాధువైన వాడిగానే భావించాలి. ఎందుకంటే అతడు పరమాత్మ శరణ్యమే సరైనదని  తెలుసుకున్నాడు కనుక. అతడు శీఘ్రంగానే ధర్మాత్ముడు అవుతాడు. ఒక వైద్యుడి వద్ద చాలామంది రోగులు O.P.D లో కూర్చుని ఉన్నారు.. అనుకుందాము. కాని ఒక యాక్సిడెంట్ అయి వచ్చిన రోగిని అతడు వెంటనే చూస్తాడు. అదేవిధంగా దురాచారుడైన మనుషుడు భగవంతుడిని శరణు వేడినప్పుడు  పరమాత్ముడు అతడికి అభయహస్తం ఇచ్చి కాపాడుతాడు. 'నది మూలాన్ని ఋషి కులాన్ని' చూడకూడదని అంటారు. ఎందుకంటే సన్నటి పాయగా పుట్టిన నది ఎంతో విశాలమై సముద్రాన్ని చేరుతుంది.  అదేవిధంగా  రామనామ స్మరణతో వాల్మీకి మహర్షి రామాయణ  కావ్యాన్ని రచించాడు. అందుకే ఐదవ అధ్యాయంలో పరమాత్ముడు అంటాడు 
ప్రయత్నాద్యత  మానస్తు  యోగీ సంశుద్ధ  కిల్బిషః।
 అనేక జన్మ సంసిద్ధః   తతోయాతి పరాంగతిమ్।।
యోగ దీక్షతో చేసిన ప్రయత్నం వల్ల పాపాలన్నిటి నుండి విడివిడి  శుద్ధుడై అనేక జన్మల అభ్యాసం చేత యోగసంసిద్ధిని పొంది పరమాత్మను చేరుకుంటాడు.
 ఇదే విధంగా ఏడవ అధ్యాయంలో 
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
 అనేక జన్మల తరువాతనే జ్ఞానవంతులు నన్ను శరణు వేడుతారు. ఈ శ్లోకంలో పరమాత్ముడు ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్తున్నాడు.. నన్ను నమ్మిన నా అనన్య భక్తులెన్నటికీ నా నుండి వేరు కాలేరు. నన్ను శరణు జొచ్చిన వారు శాశ్వతమైన శాంతిని పొందుతారు.   భగవంతుడితో ' విభక్తుడు 'కాని వాడు భక్తుడు. అందుకే అన్నారు కదా  '  ఎన్ని పురాణముల ఎంత వెతికినా శ్రీహరి దాసులు చెడరెన్నడును' అని!

9.32

మాం(మ్) హి పార్థ వ్యపాశ్రిత్య, యే౽పి స్యుః(ఫ్) పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః(స్), తే౽పి యాన్తి పరాం(ఙ్) గతిమ్।।32।।

ఓ అర్జునా! స్త్రీ, వైశ్య, శూద్రులును, అట్లే చండాలాదిపాపయోనిజులును నన్ను శరణుపొంది పరమగతినే పొందుదురు

9.32 
వ్యపాశ్రిత్య... అంటే పరిపూర్ణ శరణాగతి. స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా పరిపూర్ణ శరణాగతితో, భక్తి భావంతో పరమాత్ముడిని సేవించినప్పుడు వారు పరమగతిని పొందగలరు. మామూలుగా స్త్రీలు  భావ ప్రధానులై ఉంటారు. గృహ విషయాలతో వారికి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. వైశ్యులు ఆర్థిక వ్యవహారాలని చూడడం వల్లనూ,  శూద్రులు అనేక విధములైన కార్యములలో నిమగ్నులై ఉండడం వలననూ వారు పరమాత్మ సేవకై  సమయాన్ని  కేటాయించలేరు. కాని వారు కూడా అనన్య భక్తి భావంతో వారు చేసే పనిని భగవంతుడికి అర్పిస్తూ, నిత్యం భగవన్ నామ స్మరణతో ఉన్నప్పుడు, వారు పరమాత్మ ప్రాప్తిని పొందగలుగుతారు. ఇవి కేవలం పనుల కోసం ఏర్పరచిన వర్ణాలని గ్రహించాలి. ఒక కర్మాగారం ఉందనుకుందాం. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి
1. పరిశోధన మరియు అభివృద్ధి విభాగము( బ్రాహ్మణులు)
2. పరిపాలన విభాగము ( క్షత్రియులు)
3. ఆర్థిక విభాగము    ( వైశ్యులు)
4. కార్మిక విభాగము ( శూద్రులు)
కర్మాగారం సరిగా నడవాలంటే అందరూ ముఖ్యమే. వారు చేసే పనిని బట్టి విభాగాలు ఏర్పడ్డాయి. ఒక గృహిణి రొట్టెలు చేస్తున్నప్పుడు ఇది పరమాత్ముడి కోసం చేస్తున్నానన్న భావంతో చేస్తే ( కుటుంబ సభ్యులందరిలో ఉన్నది పరమాత్ముడే గనుక) ఆ రొట్టెలు ఎంతో మృదువుగా రుచిగా తయారవుతాయి. నిర్మలమైన అనన్య భక్తి భావన ముఖ్యం. ఏ పని అయినా అంతే. ఛత్రపతి శివాజీ   విశాల భారత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కాని 'ఈ సామ్రాజ్యము పరమాత్ముడి ఇచ్ఛ 'అని అన్నాడు. అటువంటి భావన ముఖ్యం. అందుకే 18వ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఇదే భావాన్ని సంజయుడు పలికిస్తాడు. 
యత్ర యోగేశ్వరః కృష్ణః  యత్ర పార్థో ధనుర్ధరః ।
 తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువా నీతిర్మమతిర్మమ।।
యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో ,ధనుర్ధారియైన అర్జునుడు ఎక్కడ ఉంటాడో  సంపద ,విజయము, వైభవము, స్థిరమైన నీతి ఉంటాయి.

9.33

కిం(మ్) పునర్బ్రాహ్మణాః(ఫ్) పుణ్యా, భక్తా రాజర్షయస్తథా
అనిత్యమసుఖం(ల్ఁ) లోకమ్, ఇమ(మ్) ప్రాప్య భజస్వ మామ్।।33।।

ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులును, రాజర్షులును, భక్తులును నన్ను శరణుపొందినచో వారు పరమపదమునుచేరుదురని చెప్పవలసిన పనియేలేదు. ఈ మానవశరీరము క్షణభంగురము. సుఖరహితము. ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది - నిరంతరము నన్నే భజింపుము.

9.33 
ఇక పుణ్యవంతులైన బ్రాహ్మణులు,  రాజర్షులు  నన్నే పొందుతారు. కాని వారు చేయవలసింది కూడా  అనన్య భక్తితో పరమాత్ముడిని శరణు వేడడమే.  అనిత్యము, అశాశ్వతము అయిన లోకంలో  జన్మించడం వలన  కేవలం పరమాత్ముడిని భజించడం తోడనే ఆయన ప్రాప్తి మనకు దొరుకుతుంది. భజన అనే  పదం ' భజ్ 'ధాతువుతో పుట్టింది. అంటే సేవ అని అర్థము. పరమాత్ముడికి సేవ చేయాలంటే ఎలా చేయాలి? సర్వ భూతములందును  పరమాత్మ స్థితుడై ఉన్నాడు. ఆర్తులకు, దీనులకు చేసే సేవయే పరమాత్మ సేవ. ఆ సేవ అహంకారంతో కాక  'వీరిలో ఉన్న పరమాత్మ ని నేను ఈ విధంగా సేవిస్తున్నాను' అన్న వినమ్ర భావంతో చేయాలి. మనం 12వ అధ్యాయంలో భక్తుడి యొక్క లక్షణాలను చదివేటప్పుడు ' సర్వభూత హితేరతా' అని చదువుకున్నాము. స్వామి వివేకానంద అంటారు, " అజ్ఞానులు ఎవరిని మనిషి అంటారో ..నేను ఆ పరమాత్మ సేవకుడిని".

9.34

మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ మాం(న్) నమస్కురు
మామేవైష్యసి యుక్త్వైవమ్, ఆత్మానం(మ్) మత్పరాయణః।।34।।

నా యందే నీ మనస్సును లగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నన్నే పూజింపుము. నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి, మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు.

9.34
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. "  నీ మనసును నాకే ఇచ్చేసేయ్. నా భక్తుడివికా. నీవు చేసిన ప్రతి పనిని నాకే అర్పించు. నన్నే పూజించు. అప్పుడు  నీవు నన్నే పొందుతావు'.  మత్పరాయణ... అంటే పరమాత్ముడు తప్ప వేరే ఎవరూ,  ఏది అక్కర్లేదన్నంత తత్పరత.   ఆ విధంగా మనసును భగవంతునికి  అర్పించినప్పుడు మనం సచ్చిదానంద రూపమైన మోక్షాన్ని పొందుతాము. ఈ మోక్షం కూడా నాలుగు అంచెలుగా ఉంటుంది. సాలోక్యము( భగవంతుడిని సర్వత్రా దర్శించడం) సాన్నిధ్యం,( భగవంతుడికి దగ్గరగా మనగలగడం), సారూప్యము( భగవంతుడితో ఏకరూపం అవడం),  సాయుజ్యము( భగవంతుడికి భక్తుడికి భేదమే లేకపోవడం). ఇది భగవద్గీత మధ్యలో ఉన్న శ్లోకం. ఈ శ్లోకం తిరిగి 18 వ అధ్యాయంలో కేవలం కొంతవరకు మూడవ చరణం మరియు నాలుగవ చరణం మార్పుతో మనం చూస్తాం
మన్మనా భవ మద్భక్తో, మద్యాజీ మాం(న్) నమస్కురు।
మామేవైష్యసి  సత్యంతే ప్రతిజానీహి ప్రియోసిమే।।34।।
భగవంతుడికి కావలసింది అనన్యమైన, నిర్మలమైన భక్తి మాత్రమే.   జ్ఞాన యోగము, కర్మయోగము అన్ని భక్తిలోనే విలీనం అయిపోతాయి. భక్తి సర్వ శ్రేష్టమైనది. ఈ గుహ్యతమ జ్ఞానాన్ని  ఈ అధ్యాయంలో భగవంతుడు  రాజవిద్యగా మనకి అనుగ్రహించాడు.  మనం కూడా ఈ గీతా పరివార్ లో
'గీతా సేవి' గా సేవలను అందించి భగవత్ సేవా భాగ్యాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. 'ఓం తత్ సత్'  అని ఆయన అనుగ్రహించిన ఈ జ్ఞానాన్ని, ఈ వివేచనను ఆయన చరణాలకి   అర్పిస్తూ వివేచనని ముగించారు.
 
 తదుపరి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైంది.
 ప్రశ్న:  నేను చూసే దాన్ని నిజమని అనుకుంటాను. మరి మనకి కళ్ళకి కనిపించే ఈ ప్రపంచమంతా సత్యమేనా?
జవాబు: దేశ కాలాలను  అనుసరించి  మార్పు చెందనిది సత్యమనబడుతుంది. ఈ మొత్తం ప్రపంచమంతా పరివర్తన   చెందుతూనే ఉంటుంది.  ఒక ఆంగ్ల కవి 'you can't wash your hands in the same river '  అన్నాడు. శాశ్వత సచ్చిదానంద రూపమైన పరబ్రహ్మ మాత్రమే సత్యం. కాని ఈ సత్యం, అసత్యం అయిన ప్రపంచం ( సదసచ్చాహమర్జున) రెండు తానేనని పరమాత్ముడు  ఈ అధ్యాయంలో చెప్పాడు.  అవ్యయుడు, అవినాశి అయిన పరమాత్ముడిని సేవించడమే మనం చేయదగిన పని.
 ప్రశ్న:'యజ్జుహోషి 'అంటే అర్థం ఏమిటి?
 జవాబు:  ఏదైతే హోమం చేస్తామో అది.
 ప్రశ్న:  మోక్షంలో నాలుగు అంచెలు ఏవి?
జవాబు: సాలోక్యము... భగవంతుడిని  సర్వత్ర దర్శించగలగడం. సాన్నిధ్యం.. భగవంతుడికి దగ్గరగా వెళ్లగలడం. సారూప్యం.. భగవంతుడితో ఏకరూపం అవడం.సాయుజ్యము.. భగవంతుడికి భక్తుడికి భేదమే లేకపోవడం.
ప్రశ్నోత్తరాల తర్వాత ప్రార్థనతో కార్యక్రమం ముగిసింది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ) యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమో౽ధ్యాయః

ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన రాజవిద్యారాజగుహ్యయోగము సమాప్తమైనది