विवेचन सारांश
మహాభారత యుద్ధ సేనల వైశిష్ట్యం

ID: 3220
तेलुगू - తెలుగు
ఆదివారం, 02 జూలై 2023
అధ్యాయము 1: అర్జున విషాద యోగము
1/3 (శ్లోకము 1-16)
వివేచకులు: గీత విదూషి సౌ.వందనా వర్ణేకర్ గారు


అనేక జలధారలు సమ్మేళనం జరిగినప్పుడు ప్రవాహం ఎలా పెరిగిపోతుందో అలానే, గీతా ప్రేమికులు ఆనందమయి యాత్రలో కలిసినప్పుడు ఆ గీతా ప్రేమికుల సంగమం ద్వారా ఆ ప్రేమ పెరుగుతూ ఉంటుంది. గురువందనం, సరస్వతీ ప్రార్ధనతో సంప్రదాయ అనుసారంగా ప్రథమ అధ్యాయం పూర్వార్ధం వివేచన సత్రం మొదలైంది. 

 ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् । 

अद्वैतामृतवर्षिणीं भगवतीम्-अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्- गीते भवद्वेषिणीम् ॥ १॥ 

नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।

येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः ॥ २॥

భగవద్గీత అర్జునుడికి భగవంతుడైన నారాయణుడిచే స్వయంగా బోధించబడినది. మహాభారతం మధ్యలో బోధింపబడ్డ భగవద్గీతను సనాతన ఋషి వ్యాసుడు రచించాడు. ఓ దివ్య మాతా, మాపై అద్వైత అమృతాన్ని కురిపించే మాతా, ఓ పద్దెనిమిది అధ్యాయాల మాతా, నేను నిన్ను ధ్యానిస్తున్నాను. భగవద్గీత సంసారం వల్ల కలిగే భ్రాంతిని నశింప చేస్తుంది. ఇలా గీతా గొప్పతనాన్ని మననం చేసుకుంటూ గీత ధ్యాన శ్లోకం పఠనం తో వివేచన సత్రం ప్రారంభమైనది. విశేషమేమిటంటే ఈ ప్రథమ అధ్యాయంలో భగవంతుని ఉపదేశం మనకు ఇంకా ప్రాప్తించదు. అయితే గీతా మహత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రథమ అధ్యాయాన్ని బాగా అవగతం చేసుకోవాలి. గురుదేవుని సూచన ఏమిటంటే వేదాల సారం మహాభారతంలో ఉంటుంది. అలాగే మహాభారతం యొక్క సారం భగవద్గీతలో ఇమిడి ఉంటుంది. మరియు అర్జునుని మనోభావాలను అర్థం చేసుకుంటూ పఠనం చేయాలి. శ్లోక పఠనం మనసుకి ఊరట కలిగిస్తుంది. సంస్కృతం ఎంతో శక్తివంతమైన భాష. గీత లో చెప్పబడిన 700 శ్లోకాలలో జీవన సారం ఇమిడి ఉంది అని. ఆశయంలో మహోన్నతమైనది ఆకృతిలో బహు చిన్నది అని జ్ఞానేశ్వరిలో చెప్పారు జ్ఞానేశ్వర్ మహారాజ్. సుమారు 5000 సంవత్సరాలు లేదా అంతకన్నా ముందు ఈ జ్ఞాన ధార స్వయంగా పరమాత్ముని నోటి వెంట నుంచి ప్రవహించింది. అప్పటి భౌగోళిక పరిస్థితులు ఇప్పటికన్నా వేరు.  మునుపటితో చూసుకుంటే ఇప్పుడు వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందాము. కాని మనిషి యొక్క మానసిక ప్రవృత్తి మాత్రం మారలేదు. అందుకని భగవద్గీత ఇప్పుడు కూడా మనందరికీ చక్కగా వర్తించే మనో వైజ్ఞానిక గ్రంథము.  

मलिनिर्चमोनं पुंसां जलस्नानं दिने दिने ।

सकृद्गीतामृतस्नानं संसारमलनाशनम् ॥

అనగా…నీళ్లలో స్నానం చేయడం ద్వారా రోజూ తనను తాను శుభ్రపరుచుకోవచ్చు, కాని భగవద్గీతలోని పవిత్ర గంగా జలంలో ఒక్కసారైనా స్నానం చేస్తే, అతనికి భౌతిక జీవితంలోని మలినం పూర్తిగా నశిస్తుంది. బాహ్య ప్రక్షాళన స్నానంతో అవుతుంది. కాని అంతర ప్రక్షాళన గీతామృతంతో మాత్రమే సాధ్యమవుతుంది.  

లోకమాన్య బాలగంగాధర్ తిలక్, భగవద్గీత సంపూర్ణ భారతీయ వాంగ్మయానికి కోహినూరు వజ్రం లాంటిది అన్నారు.

మనమందరం జీవితంలో సుఖాన్ని వెతుక్కుంటూ దుఃఖంలో పడతాం. సుఖాన్వేషణలో దుఃఖాన్ని ఎదుర్కొంటాం. సుఖాన్వేషణలో ఎంతగా పడతామంటే మరణం తప్పదని తెలిసినా ఆ విషయం మనల్ని భయభీతులను చేస్తుంది.  భగవద్గీత దుఃఖమయమైన ఈ సంసార సాగరం నుంచి మనల్ని బయట పడవేయడానికి సహకరిస్తుంది.


1.1

ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సమవేతా యుయుత్సవః ৷
మామకాః(ఫ్) పాణ్డవాశ్చైవ, కిమకుర్వత సఞ్జయ॥1.1॥

ధృతరాష్ట్రుడు పలికెను - ఓ సంజయా! యుద్ధసన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండు పుత్రులును ఏమి చేసిరి?

ప్రప్రధమంగా ధృతరాష్ట్రుని నోటి నుండి వెలువడిన మాటలతో గీతా శుభారంభం అవుతుంది. ధృతరాష్ట్రుడు కౌరవులకు పిత్రుడు మరియు అంధుడు. తన తమ్ముడైన పాండు రాజుకి చెందిన కురు రాజ్యాన్ని పాండు రాజకుమారులకు తిరిగి ఇవ్వకుండా చేజిక్కించుకున్నాడు. పిదప, కౌరవులైన ధృతరాష్ట్ర పుత్రులు కపటంతో జూదమాడి వారి రాజ్యాన్ని వశం చేసుకున్నారు. శకుని తండ్రి ఎముకలతో తయారు చేసుకున్న మాయ పావులతో జూద మాడారు. కపట జూదంలో ఓడిన పాండవులు తమ రాజ్యం సర్వస్వం కోల్పోయి 12 సంవత్సరాల వనవాసం పూర్తి చేశారు. వనవాసం మరియు ఆజ్ఞాతవాసం పూర్తి అయిన తర్వాత తమ ఇంద్రప్రస్థ రాజ్యం తిరిగి ఇవ్వమని కోరారు. అయితే కౌరవులు దీనికి నిరాకరించారు. చివరికి పాండవులు దూతను పంపి పంచ పాండవులకి పంచ గ్రామాలుఅయినా ఇవ్వమని అడిగారు. దుర్యోధనుడు సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అని స్పష్టం చేశాడు. ఫలితంగా మహాభారత సంగ్రామానికి నాంది పలికారు.  అంధుడైన ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో జరిగే విషయాలను అప్పటికప్పుడు తెలుసుకోవాలని కాంక్ష కలిగింది. వేద వ్యాసుడు సంజయునికి దివ్యదృష్టి ప్రసాదించి యుద్ధభూమిలో జరిగే సంఘటనలను వీక్షించే అదృష్టాన్ని కలిగించాడు. తన సారధి అయిన సంజయునికి అలా దివ్యదృష్టి ప్రాప్తి కలిగింది. 

ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతున్నవి అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు. ఆ ధర్మ భూమిలో యుద్ధానికి సన్నద్ధమై ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఏమి చేయుచున్నారు? మనిషి ఈ శరీరాన్ని తానే అనుకుంటాడు. అందువలన దేహం మీద మక్కువ ఉంటుంది. ప్రతిఫలంగా నాది, ఇతరులది అనే భేదభావం కలుగుతుంది. అలాగే ధృతరాష్ట్రునికి కూడా తన పుత్రుల మీద ఎంతో మమకారం. అందుకనే నా పుత్రులు అని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. కురుక్షేత్రము అనగా కర్మ జరిగే క్షేత్రము అని కూడా మరొక అర్థం వస్తుంది.

నిత్యజీవితంలో చేయవలసిన, చేసే కర్మలన్నీ ఎంతో సంఘర్షణతోనే కూడి ఉంటాయి. . మరాఠా రాణి అహల్యా దేవి హోల్కర్కికి భగవద్గీత నేర్పించడం కోసం ఒక పండితుడిని నియమించారు. రాజ్యాన్ని పరిపాలించే క్షత్రియులకి ఇలా ధర్మ గ్రంథమైన భగవద్గీత సముపార్జన ఒక ఆనవాయితీ. ఎందువలనంటే భగవద్గీత వారికి నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా ఉత్తమ అధికారిగా రాజ్య పాలక నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది.  అహల్యా దేవికి క్షేత్రే మరియు ధర్మ, ప్రప్రథమంగా ఉన్న ఈ రెండిటి పదాలలోనే మొత్తం భగవద్గీత అర్థం ఇమిడి ఉంది అని అనిపించింది. ఎవరి క్షేత్రంలో అనగా వారి రంగంలో ధర్మం అనుసరించడం ఎవరికి వారి ప్రధాన కర్తవ్యం.

1.2

సఞ్జయ ఉవాచ
దృష్ట్వా తు పాణ్డవానీకం(వ్ఁ) , వ్యూఢం(న్) దుర్యోధనస్తదా
ఆచార్యముపసఙ్గమ్య, రాజా వచనమబ్రవీత్॥1.2॥

సంజయుడు పల్కెను - ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను .

సంజయుడు ఇలా పలికాడు. ఎంతో పకడ్బందీగా రచించిన పాండవ సైన్యాన్ని చూసి రాజు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఇలా అన్నాడు. ఇక్కడ రాజు అనగా దుర్యోధనుడు. దుర్యోధనుడు యువరాజైనా, అతనిని రాజు అని దృతరాష్ట్రుడిని సంతోష పెట్టడం కోసం సంబోధించాడు. 

సంజయుడు ధృతరాష్ట్రునికి చాలా నమ్మకమైన సలహాదారుడు అయినా అతని మనసు సాత్వికమైనది, ధర్మాన్ని అనుసరించేది.  దుర్యోధనుడు మహల్ లో అల్లరిగా అత్యంత గారాబంలో పెరిగాడు. రాజు గారి కోటలో అన్ని వసతులతో, సుఖాలతో విలాసవంతంగా పెరిగినా కూడా, అతనిలో లోభం ఎక్కువ, పరుల రాజ్యం కోసం దురాశ. అది చేజిక్కించుకోవడం కోసం కపటమైన పనులు చేశాడు. ఇతరులకు కష్టం కలిగించాడు. పాండవులు వనములలో కందమూలాలు తింటూ ఋషుల సాంగత్యంలో సాత్వికంగా పెరిగారు. చిన్నతనంలో సంగ్రహించిన విలువలు చాలా బలంగా లోతుగా అలవడుతాయి. అందుకే వారి మనస్తత్వాలలో చాలా వ్యత్యాసం.

1.3

పశ్యైతాం(మ్) పాణ్డుపుత్రాణామ్, ఆచార్య మహతీం(ఞ్) చమూమ్ ৷
వ్యూఢాం(న్) ద్రుపదపుత్రేణ, తవ శిష్యేణ ధీమతా॥1.3॥

ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు.

తన గురువు గారైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి తమ శిష్యుడు,  ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుని చే వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డ సైన్యాన్ని వీక్షించమని ప్రేరేపిస్తున్నాడు. అవహేళనగా మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడి ఈర్ష్య, అసూయలతో కూడిన మనస్తత్వం ఇక్కడ కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి దృష్టద్యుమ్నుని, అందులోనూ తమ శిష్యుడు అని ద్రోణాచార్యులకు ఎత్తి చూపించడంలో ఒక కారణం ఉంది. దృష్టద్యుమ్నుడు కారణజన్ముడు, ద్రోణాచార్యులను వధించడం కోసమై యజ్ఞంలో జన్మించినవాడు.

ధ్రుష్టద్యుమ్నుడి తండ్రి ద్రుపద రాజు, ద్రోణాచార్యులు చిన్నతనంలో మంచి మిత్రులు. ఒకే గురుకులంలో చదివారు. ద్రోణాచార్యుల కుటుంబం వారి ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండేది.  ద్రోణాచార్యుల వారికి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పక తనను సంప్రదించాలని, తాను తప్పక సహాయం చేయగలనని  చిన్నతనంలో ద్రుపద మహారాజు మాట ఇచ్చారు. ద్రోణాచార్యుల పెళ్లి అయిన తర్వాత వారికి అశ్వత్థామ అని బాలుడు జన్మించాడు. ఇంకా వారి ఆర్థిక పరిస్థితి అలాగే ఉండేది. చిన్న పిల్లవాడికి గోధుమ పిండి నీళ్లలో కలిపి అదే పాలలాగా తాగించేవారు. ఒకసారి అశ్వత్థామ సంపన్నుల ఇంటికి వెళ్ళినప్పుడు నిజమైన పాలు తాగి అప్పటినుంచి అదే కావాలని గొడవ చేసేవాడు. పేదరికంలో తనయుడు, భార్య కృపి బాధ చూడలేక ద్రోణాచార్యులు, ద్రుపద మహారాజు మాట గుర్తుకు వచ్చి సహాయం కోరుదామని వెళ్లారు.  ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల వారికి సహాయం చేయకపోగా వారిని సభ నుంచి వెళ్లగొట్టారు. ద్రోణాచార్యులు ఆ అవమానం భరించలేక పోయారు. కౌరవ పాండవుల విద్యాభ్యాసం తర్వాత గురుదక్షిణగా ద్రుపద మహారాజుని ఓడించి తీసుకురమ్మని అడిగారు. భీమార్జునులు ఆ పని మీద వెళ్లగా, అర్జునుడు ద్రుపద మహారాజుని ఓడించి బందీగా తెచ్చి గురుదక్షిణగా సమర్పించాడు. తిరిగి వెళ్ళిన ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలంగా ద్రోణాచార్యుల వధ కొరకై దృష్టద్యుమ్నుడు జన్మించాడు. దృష్టద్యుమ్నుడి విద్యాభ్యాసం కొరకు మహారాజు అతడిని ద్రోణాచార్యుల వద్దకు పంపారు. మరి మిమ్మల్ని వధించడం కోసం పుట్టిన వాడని తెలిసీ అతనికి ధనుర్విద్య మర్మాలన్నీ నేర్పారు కదా అని దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారిని ఇప్పుడు పరిహసిస్తున్నాడు.  

1.4

అత్ర శూరా మహేష్వాసా, భీమార్జునసమా యుధి ৷
యుయుధానో విరాటశ్చ, ద్రుపదశ్చ మహారథః॥1.4॥

ఈ సేనలో ధనుర్ధారులైన గొప్పయోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథియైన ద్రుపదమహారాజు భీమార్జునసమానులు.

1.4 writeup

1.5

ధృష్టకేతుశ్చేకితానః(ఖ్), కాశిరాజశ్చ వీర్యవాన్ ৷
పురుజిత్కున్తిభోజశ్చ, శైబ్యశ్చ నరపుఙ్గవః॥1.5॥

ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు (భీమార్జునసమానులు).

1.5 writeup

1.6

యుధామన్యుశ్చ విక్రాన్త, ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ৷
సౌభద్రో ద్రౌపదేయాశ్చ, సర్వ ఏవ మహారథాః॥1.6॥

పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపదియొక్క ఐదుగురు పుత్రులును కలరు. వీరందరును మహారథులు. (శౌర్యమున భీమార్జునసమానులు).

దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని ఇంకా వర్ణిస్తున్నాడు. ఎంతోమంది శూరులు, ధనుర్దారులు, భీమార్జునులకు సరి సమానమైన యుద్ధ వీరులు ఉన్నారు.  యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. శిశుపాలుని కుమారుడు ధృష్టకేతుడు , వారి మిత్రుడు చేకితానుడు, వీరుడైన కాశీరాజు, కుంతి మాత సోదరులైన పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శిబి దేశ రాజు శైబ్యుడు, వీరందరూ ఉత్తమ వీరులే. మహా పరాక్రమవంతులైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు,  వీరు అర్జునుడి రథానికి ఇరువైపులా రక్షణగా నిలుచుని ఉన్నారు. ఇంకా సుభద్రా పుత్రుడు, మరియు ద్రౌపదీ పుత్రులైన, ప్రతి వింధ్య, శ్రుత సోమ, శ్రుత కర్మ, శతానిక మరియు శ్రుతసేన ఉన్నారు. వీరందరూ శ్రేష్టమైన మహారథులు. ఒక్క మహారథి పదివేల మంది సాధారణ యోధుల శక్తితో సమానం.

1.7

అస్మాకం(న్) తు విశిష్టా యే, తాన్నిబోధ ద్విజోత్తమ ৷
నాయకా మమ సైన్యస్య, సఞ్జ్ఞార్థం(న్) తాన్బ్రవీమి తే॥1.7॥

ఓ బ్రాహ్మణోత్తమా! మన పక్షముననున్న ప్రధానయోధులను గూడ గమనింపుడు. మీ యెఱుకకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను.

ద్విజులలో ఉత్తమమైన ద్రోణాచార్యా ! మన పక్షంలో ఉన్న విశిష్టమైన వీరులను, సేనా నాయకులను కూడా తెలుసుకోండి. సైన్యాధ్యక్షులైన మీరు తెలుసుకొనుటకై పేర్కొంటున్నాను.

1.8

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితిఞ్జయః ৷
అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తథైవ చ॥1.8॥

మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు.

స్వయంగా మీరు, భీష్మ పితామహులు, కర్ణుడు, గురువులైన కృపాచార్యులు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమ దత్తుని కుమారుడు వీరందరూ యుద్ధములలో ఎప్పుడూ విజయాలు సాధించే వారే. వికర్ణుడు కౌరవులలో సజ్జనుడు, కపట జూదంలో  వదిన ద్రౌపదిని పణంగా పెడుతున్నప్పుడు అడ్డుకున్నాడు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఇంతటి ఘోరం నేను చూడలేనంటూ సభ నుంచి నిష్క్రమించాడు. అత్యంత పరాక్రమవంతుడైన భీమసేనుడు రెండుసార్లు మాత్రమే శోకించినట్టు చెప్తారు. అజ్ఞాతవాసంలో సైరంద్రి వేషంలో ఉన్న ద్రౌపదిని చెరపట్టబోయిన కీచకుని విషయం తెలిసినప్పుడు. ఆ తర్వాత మహాభారత సంగ్రామంలో వికర్ణుడు మరణించినప్పుడు. వికర్ణుడు అంతటి సజ్జనుడు.

1.9

అన్యే చ బహవః(శ్) శూరా, మదర్థే త్యక్తజీవితాః ৷
నానాశస్త్రప్రహరణాః(స్), సర్వే యుద్ధవిశారదాః॥1.9॥

ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యమునందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానాశస్త్రాస్త్రధారులు. నాకొరకు తమ ప్రాణముల నొడ్డియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నవారు.

ఇంకా ఎంతోమంది శూరులు పరాక్రమవంతులు నా కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు . వారు అనేక ఆయుధములు చేపట్టిన వారు, యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు.

1.10

అపర్యాప్తం(న్) తదస్మాకం(మ్), బలం(మ్) భీష్మాభిరక్షితమ్ ৷
పర్యాప్తం(న్) త్విదమేతేషాం(మ్), బలం(మ్) భీమాభిరక్షితమ్॥1.10॥

భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగానున్న మనసైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము.

ఇంకా దుర్యోధనుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. మన సైన్యం అపరిమితమైనది. అంతకు మించిన విషయం ఏమిటంటే ఈ అపరిమితమైన సైన్యం భీష్మ పితామహుల రక్షణలో ఉంది. కాని భీముడుచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. పాండవ సైన్యానికి సేనాధ్యక్షుడు ధ్రుష్టద్యుమ్నుడైనప్పటికీ, దుర్యోధనుడు మాత్రం భీముడి పేరుని ప్రస్తావిస్తున్నాడు. ఎందువలనంటే తనకి బద్ధ శత్రువైన భీముడి పరిరక్షణయే కనిపిస్తుంది. అందుకే భీముడి బలాన్ని అంచనా వేస్తున్నాడు. ఇక్కడ బీరాలు పలుకుతున్నా, వాస్తవికంగా దుర్యోధనుడి మనసులోని ఒక రకమైన ఆందోళన ప్రస్ఫుటమవుతుంది.

1.11

అయనేషు చ సర్వేషు, యథాభాగమవస్థితాః ৷
భీష్మమేవాభిరక్షన్తు, భవన్తః.(స్) సర్వ ఏవ హి॥1.11॥

కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు.

అందరూ ఎవరికివారు నియమింపబడిన స్థానాల్లోకి వెళ్ళండి. భీష్మ పితామహులను నలువైపుల నుంచి రక్షించండి. ఇలా వ్యూహ రచన ప్రకారం అందరూ సేన పరిరక్షణ చేయాలని పిలుపునిచ్చాడు.

1.12

తస్య సఞ్జనయన్హర్షం(ఙ్) , కురువృద్ధః(ఫ్) పితామహః
సింహనాదం(వ్ఁ) వినద్యోచ్చైః(శ్) , శఙ్ఖం(న్) దధ్మౌ ప్రతాపవాన్॥1.12॥

కురువృద్ధుడును, ప్రతాపశాలియును ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపఱచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమొనర్చి, తన శంఖమును పూరించెను.

ఇలా కొద్దిగా ఆందోళన చెందుతూ సేనాధ్యక్షులనందరినీ పురమాయిస్తున్న దుర్యోధనునకి హర్షం కలిగించే విధంగా కురువృద్ధుడైన భీష్మ పితామహులు, సింహ గర్జన లాంటి శబ్దం చేసి వెనువెంటనే తన శంఖాన్ని పూరించాడు. ప్రతాపవంతుడైన భీష్మ పితామహులు తన మనుమడైన దుర్యోధనుని వ్యాకులతని అర్థం చేసుకొని తనకు విశ్వాసం కలిగేలా శంఖం పూరించాడు. శంఖాన్ని పూరించడం వల్ల వీరులకు తమ కర్తవ్యం స్పురణ అవుతుంది. శంఖనాదం యుద్ధ ప్రారంభానికి సంకేతం.

1.13

తతః(శ్) శఙ్ఖాశ్చ భేర్యశ్చ, పణవానకగోముఖాః ৷
సహసైవాభ్యహన్యన్త, స శబ్దస్తుములో౽భవత్॥1.13॥

మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.

శంఖాలు, నగారాలు, భేరీలు, ఢంకాలు, కొమ్ముతో చేసిన వాయిద్యాలు మొదలైనవి అన్ని ఒక్కసారిగా మోగడం ప్రారంభించాయి. ఇన్ని శబ్దాలు ఒక్కసారిగా మోగడంతో యుద్ధ వాతావరణం నెలకొన్నది.

1.14

తతః(శ్) శ్వేతైర్హయైర్యుక్తే, మహతి స్యన్దనే స్థితౌ ৷
మాధవః(ఫ్) పాణ్డవశ్చైవ, దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః॥1.14॥

తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి.

ఈ దివ్య రథం మరియు గాండీవం , కాండవ వన దహనం తర్వాత అర్జునునికి అగ్నిదేవుని ప్రసాదంగా లభించినవి. శ్రీకృష్ణుడు అర్జునుని తన మధ్య ప్రీతి ఎల్లప్పుడూ ఉండేలా అనుగ్రహించమని కోరాడు. 9 ఎద్దుల బండ్లలో పట్టగలిగేన్ని శస్త్రాలు, అస్త్రాలు అర్జునుని ఒక దివ్య రథంలో ఇమిడిపోగలవు. ఈ దివ్య రథంపై హనుమంతుడు విరాజిల్లుతున్న జెండా ఎగురుతోంది. నాలుగు శ్వేత అశ్వాలతో కూడి, సాక్షాత్తు భగవంతుడే సారధిగా, ఉన్న దివ్య రథంపై ఆసీనుడైన అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు తమ తమ శంఖాలను పూరించారు.

1.15

పాఞ్చజన్యం(మ్) హృషీకేశో, దేవదత్తం(న్) ధనఞ్జయః ৷
పౌణ్డ్రం(న్) దధ్మౌ మహాశఙ్ఖం(మ్), భీమకర్మా వృకోదరః॥1.15॥

శ్రీకృష్ణుడు ‘పాంచజన్యము’ ను, అర్జునుడు ‘దేవదత్త(శంఖ)ము’ ను పూరించిరి. అరివీరభయంకరుడైన భీముడు “పౌండ్రము” అను మహాశంఖమును పూరించెను.


1.16

అనన్తవిజయం(మ్) రాజా, కున్తీపుత్రో యుధిష్ఠిరః ৷
నకులః(స్) సహదేవశ్చ, సుఘోషమణిపుష్పకౌ॥1.16॥

కుంతీపుత్రుడును, రాజును ఐన యుధిష్ఠిరుడు 'అనంతవిజయము' అను శంఖమును, నకులసహదేవులు 'సుఘోష' 'మణిపుష్పకము'లను శంఖములను పూరించిరి.

శ్రీకృష్ణుడు పాంచ జన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని, ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మరియు మణిపుష్పక అనే శంఖాలను పూరించారు. పాండవ సైన్యంలో మిగతా మహారధులు కూడా వారి శంఖాలను పూరించారు. కురుక్షేత్ర సంగ్రామ నిర్ణయం జరిగిన తర్వాత అర్జునుడు మరియు దుర్యోధనుడు ఇరువురు తమ బావ శ్రీకృష్ణుడి సహాయం అర్థించడం కోసం వెళ్లారు. ఆ సమయానికి  శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడు. తను రాజు కదా పాదాల దగ్గర కూర్చోవడమా అని అహంకారంతో వెళ్లి తల దగ్గర ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అర్జునుడు బావ మీద ప్రీతితో తన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. శ్రీకృష్ణుని నిద్ర లేవగానే అర్జునుడిని చూసి, ఎప్పుడు వచ్చితివి, ఏమి పని మీద వచ్చితివి అని క్షేమ సమాచారాలు కనుక్కునేటప్పుడు దుర్యోధనుడు ముందుకు వచ్చి, బావా నేను కూడా చాలా సేపు నుంచి వేచి ఉన్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు నేను నిద్ర లేవగానే మొదటగా అర్జునుని చూశాను అందుకని అర్జునుని ఏమి సహాయం కావాలో మొదటగా కోరుకొమ్మంటున్నాను అన్నాడు. కాని దుర్యోధనుడు, బావ నేను అంతకన్నా ముందు వచ్చి కూర్చున్నాను, అని వాదించాడు. అలా చూసుకున్నా కుటుంబంలో మొదటగా చిన్నవాడికి అవకాశం ఇవ్వాలి, అని అర్జునుడికి ఇచ్చాడు. అస్త్రశాస్త్రాలతో కూడిన నారాయణి సేన ఒక అక్షౌహిణి లేదా ఏ శస్త్రం చేపట్టని నేను. ఈ రెండిటిలో ఏది కావాలో కోరుకొమ్మన్నాడు. ఒక అక్షౌహిణి అనగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల మంది సైనికులు ఉంటారు అర్జునుడు నిస్సంకోచంగా శ్రీకృష్ణుడిని తన వైపుగా ఉండమని ప్రార్థించాడు. ఎక్కడ ఒక అక్షౌహిణి సైన్యం కావాలంటాడో అని లోపల మదన పడుతున్న దుర్యోధనుడికి ఎంతో ఉపశమనం కలిగింది. అలా అర్జునుడు తన జీవన రథ సారధ్యాన్ని భగవానుడైన శ్రీకృష్ణుడికి అప్పగించాడు.  ఇంతటితో ఈనాటి వివేచన సత్రం ముగిసినది. తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైనది. 

ప్రశ్నోత్తరాలు

ప్రశ్న: సాత్యకి ఎవరు? అతని పేరు ఎక్కడ రాలేదే? 

సమాధానం: మహావీరుడైన యుయుధానుడికి మరొక పేరు సాత్యకి. ధనుర్విద్యలో అర్జునుని శిష్యుడు.

ప్రశ్న: గురు పూర్ణిమ గురించి చెప్పండి? ఇది టీచర్స్ కి సంబంధించినదా?

సమాధానం: శిక్షకునికి, గురువుకి ఎంతో వ్యత్యాసం ఉంది. శిక్షకుడు లౌకిక జ్ఞానం అందిస్తాడు. గురువు అలౌకిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి మనకు మార్గదర్శనం చేస్తాడు. సమర్పిత భావంతో గురు చరణములకు మనల్ని అర్పించుకుంటేనే మనకు మార్గదర్శనం సులువు అవుతుంది. ఇవాళ వ్యాస పూర్ణిమ. వ్యాస ఉచ్చిష్టం జగత్ సర్వం అనగా మనకు లభించిన సర్వ వేదములు, వ్యాసుడి ఎంగిలి గా లభించినవే.

ప్రశ్న: అక్షౌహిణి గురించి మళ్ళీ చెప్పండి?
సమాధానం: ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870ఏనుగులు, 65,610 horses గుర్రాలు and 109,350 సైనికులు. అనగా మొత్తం 218,700 సేన.

జయ శ్రీకృష్ణ