विवेचन सारांश
ముక్తి సాధనకై కర్మయోగ మార్గము.

ID: 3261
तेलुगू - తెలుగు
శనివారం, 08 జూలై 2023
అధ్యాయము 3: కర్మ యోగము
3/4 (శ్లోకము 25-32)
వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/


పరంపరానుసారంగా దీప ప్రజ్వలనతో ఈరోజు మూడవ అధ్యాయం మూడవ భాగం వివేచన ప్రారంభమైనది. సుందరము, సరళముగా వివేచనను చెప్పడానికి గీతా పరివార్ లోని పేరు మోసిన ప్రశిక్షకులు శ్రీ శ్రీనివాస్ జీ వార్నేకర్ గారిని సాదరంగా ఆహ్వానించారు. అందరికీ సాదర నమస్కారము, గురు ప్రార్ధన, శ్రీకృష్ణ ప్రార్ధన, భారతమాతకు నమస్కరించి, గీతా మహాత్యము చెప్పి ఆపై శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ చరణములకు నమస్కరించి, గీతా సాధకులు మరియు ప్రేమికులకు సాధరంగా నమస్కరించి శ్రీ వార్నేకర్ గారు ఈరోజు వివేచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవద్గీతలో అత్యంత మహాత్వపూర్వమైన కర్మయోగ మనబడే మూడో అధ్యాయం గురించి చర్చించుకుంటున్నాము. "జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ..." అంటూ అర్జునుడు అడిగిన ప్రశ్నను చూసాము. రెండవ అధ్యాయంలో భగవంతుడు అర్జునునికి జ్ఞానం యొక్క మహత్యం మరియు కర్మ యొక్క మహత్యము రెండూ చెప్పాడు. ఇది విన్న అర్జునుని మనసు గందరగోళమునకు గురియై, కర్మ కన్నా జ్ఞానము శ్రేష్ఠమైనప్పుడు యుద్ధము లాంటి ఘోర కర్మను చేయడానికి భగవంతుడు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అని తలచి ఈ ప్రశ్నను అడుగుతాడు. నీవు రెండు వైపులా మాట్లాడటం వల్ల ముందు నుంచే ఆందోళన పడుతున్న నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది, “తదేకం వద నిశ్చిత్య ...” నీవు ఏదో ఒక ఖచ్చితమైన మాట చెప్పమని కోరగా భగవంతుడు ఈ రెండు మార్గాలు కూడా ఒకే గమ్యం వైపు తీసుకుని వెళతాయి, కాని ఎవరి యోగ్యత ప్రకారం వారు తమ మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది అని చెబుతాడు. ఇది చెబుతూ భగవంతుడు కర్మయోగం యొక్క మహత్యం, కర్మలు ఏ విధంగా చేయాలి, మన దైనిక కర్మలను నిర్వహిస్తూ వాటిని కర్మయోగముగా ఎలా పరివర్తన చేయాలి మొదలైనవి అర్జునునికి చెప్పాడు. ఇంకా, ఏ పని చేయకుండా ఎవరూ ఒక్క క్షణం కూడా ఉండలేరు, మరి అలాంటప్పుడు మన విహిత మరియు విధిత కర్మలనే ఎందుకు చేయకూడదు, ఈ సృష్టి చక్రానికి ఉపయుక్తకరమైన కర్మలనే ఎందుకు చేయకూడదు, సృష్టి చక్రానికి ఉపయుక్తకరమైన కర్మలు చేయనివారు పాపిష్టివారు మరియు వారి జీవితం వ్యర్థం అని భగవంతుడు చెప్పాడు. ఈ చిన్న చిన్న పనులన్నీ మన కర్తవ్య కర్మలుగా చేయడం వల్ల పరమసిద్ధిని కూడా సాధించవచ్చునని, ఈ విధంగా చాలామంది పరమసిద్ధిని సాధించారని, “కర్మణైవ హి సంసిద్ధిమ్, ఆస్థితా జనకాదయః ...” అంటూ ఒక రాజుని ఉదాహరిస్తూ భగవంతుడు చెప్పాడు. ఒక సన్యాసి, యోగి సాధించగలిగిన పరమసిద్ధిని తన కర్తవ్య కర్మల ద్యారా ఒక రాజు కూడా సాధించగలడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తరువాత అర్జునునికి శ్రేష్టులు చేయవలసిన కర్మల గురించి భగవంతుడు చెప్పాడు. జీవితంలో అన్నీ సాధించిన తర్వాత కూడా శ్రేష్ఠులు తమ కర్తవ్య కర్మలను చేస్తూనే ఉండాలి, ఎందుకంటే వారిని అనుసరించి కర్మలను చేసేవారు చాలామంది ఉంటారు, “యద్యదాచరతి శ్రేష్ఠః(స్), తత్తదేవేతరో జనః ...”, ఇంట్లో పెద్దవారు తమ కర్మలను చేసినట్లే పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. పెద్దవారు అబద్ధాలు చెబితే పిల్లలు కూడా అలాగే చేస్తారు, పెద్దలు మంచి పనులు చేస్తే వాటిని చూసి పిల్లలు కూడా అలాగే చేస్తారు. అందుకే మిగతా వారి ముందు మంచి ఉదాహరణగా శ్రేష్ఠులు, జేస్టులు వారికి ఆవశ్యకత లేనప్పటికీ మంచి పనులు చేస్తూనే ఉండాలి. “న మే పార్థాస్తి కర్తవ్యం(న్), త్రిషు లోకేషు కిఞ్చన ...” ఈ ముల్లోకములలో నేను చేయవలసిన పనులేమియు లేనప్పటికీ, ప్రాప్తించవలసినవి ఏమీ లేనప్పటికీ అన్ని కర్మలు చేస్తూనే ఉంటాను. యజ్ఞం దగ్గర ఎంగిలాకులు తీయడం దగ్గర నుంచి, గోవులను కాయడం దగ్గరనుంచి, యుద్ధ భూమిలో అర్జునునికి కళ్ళాలను చేతబట్టి రథసారథ్యం చేయడం దగ్గర నుంచి, సాయంత్రం యుద్ధ విరామం తర్వాత ఆ రథాశ్వాలకు స్నానం చేయించడం, వాటి గాయాలకు చికిత్స చేయడం లాంటి పనులన్నీ భగవంతుడు స్వయంగా చేసేవాడు. ఎందుకు చేసేవాడు? చేయవలసిన ఆవశ్యకత ఏమి ఉన్నది? “నానవాప్తమవాప్తవ్యం(వ్ఁ) , వర్త ఏవ చ కర్మణి ...” నాకు ప్రాప్తించనిది అంటూ ఏమీ లేనప్పటికీ కర్తవ్య రూపంలో నా ముందుకు వచ్చిన ప్రతి కర్మను నేను ఆచరిస్తాను అని భగవంతుడు చెబుతున్నాడు. ఎందుకంటే “యది హ్యహం(న్) న వర్తేయం(ఞ్), జాతు కర్మణ్యతన్ద్రితః మమ వర్త్మానువర్తన్తే, మనుష్యాః(ఫ్) పార్థ సర్వశః”, ఈ విశ్వం యొక్క సృష్టికర్త, సంరక్షకుడు, భరించేవాడు, పోషించేవాడు, చివరికి తనలోనే ఈ సంసారం మొత్తాన్ని విలీనం చేసుకునేవాడు అయిన పరమాత్మ అలా చేయనట్లయితే ఏమి జరుగుతుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మనకు తెలుసు. మనల్ని ఈ భూమి ధారణ చేసినది, ఈ భూమి సూర్యుని గురుత్వాకర్షణ శక్తిలో ఉన్నది, ఇలాంటి అనంతమైన సూర్యులు, చంద్రులు, పాలపుంతలను ధారణ చేసిన వాడు భగవంతుడు. భగవంతుడు ఒక్క క్షణమైన తన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే ఏమవుతుందో ఊహించుకోండి. ఈ విశ్వ నిర్మాణం మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే భగవంతుడు శ్రద్ధతో తన పనులను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ విశ్వమంతా నియమానుసారంగానే నడుస్తోంది. నేను నా కర్తవ్య కర్మలను నిర్వహించనట్లయితే మిగతా వారు కూడా అలాగే చేస్తారు. నాకు ఆవశ్యకత లేనప్పటికీ మిగతా వారి ముందు ఉదాహరణగా ఉండటానికి నేను అన్ని పనులను చేస్తున్నాను అని భగవంతుడు చెబుతున్నాడు. “ఉత్సీదేయురిమే లోకా, న కుర్యాం(ఙ్) కర్మ చేదహమ్ సఙ్కరస్య చ కర్తా స్యామ్, ఉపహన్యామిమాః(ఫ్) ప్రజాః” నేను నా పనులను చేయనట్లయితే ఈ లోకాలు నాశనం అయిపోతాయి, బ్రష్టు పట్టి పోతాయి, సాఫీగా జరుగదు. వీరిని సంకరం చేసి నాశనం చేసిన వానిగా నేను చెప్పబడుతాను. ఈ సంసారాన్నంతటిని సృష్టించినవాడే దానిపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అంతా నాశనం అయిపోయిందని అందరూ అంటారు. అందుకే నా పనిని నేను శ్రద్ధతో చేస్తుంటాను అని భగవంతుడు చెబుతున్నాడు.4వ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా “ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుని రూపంలో అవతరించాడు. ధర్మం అంటే భగవద్గీతలో ముఖ్య రూపంలో కర్తవ్యం అని వస్తుంది. స్వధర్మం అని చెప్పినప్పుడు అది మన కర్తవ్యం. ప్రతి జీవి జన్మించినప్పుడే తన కర్తవ్యం నిర్దేశింపబడుతుంది, దానిని నిర్వహించమని గుర్తు చేయడానికి, ఈ విధంగా చేయమని చెప్పటానికి భగవంతుడు అవతరించి తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తుంటాడు. ఐదువేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ భగవద్గీత ఈరోజు కూడా అంతే ఉపయుక్తమైనది, అంతే శ్రద్ధతో చదువబడుతోంది, ఆచరించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే భగవంతుడే స్వయంగా చేసి చూపించి తరువాత దానిని చెప్పాడు. జీవితాన్ని ఎలా సాగించాలి, కర్మలను ఏ విధంగా చేయాలన్నది భగవంతుడు స్వయంగా ఆచరించి దానిని మిగతా వారికి చెప్పాడు. స్వయంగా చేసిన వారు చెప్పినప్పుడు మిగతా వారికి అది ప్రమాణంగా అనిపించి, వారికి కూడా అదే విధంగా చేయాలని అనిపిస్తుంది. వారి మాటలకు విలువ ఉంటుంది. అందుకే భగవద్గీత ఈరోజు కూడా ఎంతో ఉపయుక్తమైనది. ఈశ్లోకం గురించి జ్ఞానేశ్వర్ మహారాజ్ రాస్తూ నేను నా ఆత్మానందంలో నిమగ్నమై సంతోషంగా ఉంటానని భగవంతుడు చెప్పి ఉంటే మిగతా సంసారం అంతా బ్రష్టు పట్టి నశించిపోతుంది అంటారు.


3.25

సక్తాః(ఖ్) కర్మణ్యవిద్వాంసో, యథా కుర్వన్తి భారత
కుర్యాద్విద్వాంస్తథాసక్తః(శ్), చికీర్షుర్లోకసఙ్గ్రహమ్॥25॥

ఓ భారతా! (అర్జునా!) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను.

3.25 వివేచన :- ఎలాంటి కర్మలు చేయాలన్నది భగవంతుడు చెబుతున్నాడు. అజ్ఞానులు తమ జీవిత యాత్రను సాగించడానికి, పొందాలనుకున్నదానికై విషయాలపై ఆసక్తితో కర్మలను చేస్తూ ఉంటారు. విషయ ప్రాప్తికై వారు శ్రద్ధతో పని చేస్తారు. ఇందులో ఏ విధమైన తప్పులేదు. వారు ఆసక్తితో ఎంత శ్రద్ధగా పనులు చేస్తారో, అంతే శ్రద్ధతో విధ్వాంసులు కూడా ఆసక్తి లేకుండా తమ కర్మలను చేయవలెను. మానవ దేహం ప్రాప్తించినందుకు నాకు ఆవశ్యకత లేకపోయినా, సమాజ హితానికై, పరోపకారానికై మంచి కర్మలను చేయడం నా కర్తవ్యం అని భావించి కర్మలను చేయవలెను. వీరి పనులు మిగిలిన వారికి మార్గదర్శకమవుతాయి. అజ్ఞానులు తమ కొరకై శ్రద్ధతో చేసుకునే పనులను నిరుత్సాహపరచకుండా, విద్వాంసులు తమ కర్తవ్య కర్మలను అంతే శ్రద్ధతో చేయాలని భగవంతుడు చెబుతున్నాడు. కోరికలను తీర్చుకోవడానికి మనుషులు ఎలా పనులు చేస్తారో గొప్పవారు కూడా ఏ కోరికలు లేకుండానే మంచి పనులు చేయాలి. మనం సాధువులం కాదు, కాని సాధుత్వం వరకు చేరుకోవచ్చును. మనం సామాన్య మనుషులమే అయినప్పటికీ మన ధ్యేయం ఏమిటన్నది ముఖ్యం. మనుష్య జన్మ లభించిన తరువాత మనం మన ధ్యేయాన్ని నిశ్చయించుకోవడం ముఖ్యం. నరుడి నుంచి నారాయణుడిగా మారటం మనుషుల సర్వోత్కృష్ట ధ్యేయం కావచ్చును. సజ్జనులు ఆ అవస్థను చేరుకునే వరకు ప్రయత్నించవచ్చును. జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పిందేమంటే స్వయంగా సన్మార్గంలో ప్రయాణిస్తూ, సత్కర్మలు చేస్తూ, ఈ విశ్వానికి ప్రమాణంగా నిలిచేవారు, అంతరంగంలో ఏ కోరికలు లేకుండా, నేను స్వర్గానికి వెళ్లాలన్న కోరిక కూడా లేకుండా రోజుకి కనీసం ఒక కర్తవ్య కర్మనైనా చేయగలమా అన్నది ఆలోచించాలి. తన స్వార్థం లేకుండా ఏ చిన్న కార్యమైనా సమాజ హితానికి, పరులహితానికి, లోకహితానికి, సృష్టిహితానికి, ఊరు హితానికి, విశ్వహితానికి చేయాలి. ఇది లోకులకు మార్గదర్శకం అవుతుంది.

3.26

న బుద్ధిభేదం(ఞ్) జనయేద్, అజ్ఞానాం(ఙ్) కర్మసఙ్గినామ్
జోషయేత్సర్వకర్మాణి, విద్వాన్యుక్తః(స్) సమాచరన్॥26॥

పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానుల  బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్తకర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను.

3.26 వివేచన:- 

ఇతరులలో బుద్ధి బేదం కలిగించ రాదు. నేను భగవద్గీతను చదివి జ్ఞానినయ్యాను పనులన్నీ కూడా ఏ కోరికలు లేకుండా అనాసక్తితో చేయవలెను, నీవేమిటి కోరికలను తీర్చుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నావు, అలా చేయరాదు అని ఇతరులను విమర్శించరాదు. ఎవరైనా పనులు చేస్తుంటే వారిలో బుద్ధి బేదం కలిగించరాదు. వారు ఫలాసక్తితో పనులు చేస్తుంటే వారిని చేయనీయాలి. వారికి వేరే విధంగా నేర్పించడానికి ప్రయత్నం చేయరాదు. మనం ఎంతో భాగ్యశాలులు అవడం వల్ల ఈ విషయం తెలుసుకోగలుగుతున్నాము. భగవద్గీతను ఎవరికి చెప్పాలన్నది భగవంతుడే స్వయంగా 18వ అధ్యాయంలో చెప్పాడు. భగవంతుడి కృప ఉన్నవారికి, యోగ్యత ఉన్నవారికి మాత్రమే భగవద్గీతను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఎంతో కొంత తెలుసుకొని జ్ఞానులమని తలచి ఇతరులను నీవు శరీరం కాదు ఆత్మవని, ఈ శరీరానికై ఎందుకింత శ్రమిస్తున్నావని చెప్పవలసిన ఆవశ్యకత లేదు. భగవద్గీతలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అన్నీ అందరికీ సరిపోకపోవచ్చును. మనకు సరియైనదేదో మనం చూసుకోవాలి. మందుల దుకాణంలో ఎన్నో రకాల మందులు ఉంటాయి కాని మనం మాత్రం వైద్యుడు చెప్పిన మందులు మాత్రమే తీసుకుంటాం. అర్జునుని మనసులో కూడా ఇలాంటి ప్రశ్న జనించినది. జ్ఞానము అంత శ్రేష్ఠమైనచో ఆ మార్గాన్ని వదిలిపెట్టి యుద్దం లాంటి ఘోర కర్మలు ఎందుకు చేయాలి అని. భగవంతుడు ఎవరి యోగ్యత ప్రకారం వారు చేయాలని చెప్పాడు. జ్ఞానమార్గంలో నడవటానికి యోగ్యత ఉండాలి. అలాంటి యోగ్యత ఉన్నవారు మిగిలిన వారిని ఫలాసక్తి లేకుండా, అలాంటి పనులు చేయకుండా ఉండాలని బుద్ధి భేదం కలిగించరాదు. మంచి పనులు చేయమని మాత్రమే చెప్పాలి. మంచి పనులు స్వయంగా శ్రద్ధతో ఆచరిస్తూ ఇతరులను చేయడానికి ప్రేరేపించాలి. మంచి కార్యములు ద్వారా వారి కోరికలు తీరినా ఆ పనులను చేయడానికి వారిని ప్రేరేపించాలి.


3.27

ప్రకృతేః(ఖ్) క్రియమాణాని, గుణైః(ఖ్) కర్మాణి సర్వశః
అహఙ్కారవిమూఢాత్మా, కర్తాహమితి మన్యతే॥27॥

వాస్తవముగా కర్మలన్నియును అన్నివిధముల ప్రకృతిగుణములద్వారానే చేయబడుచుండును అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణముగల అజ్ఞాని) 'ఈ కర్మలకు నేనే కర్తను' అని భావించును.

3.27 వివేచన:- ఇక్కడి నుంచి భగవంతుడు విషయం మార్చి కొంచెం జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. మనం కర్మలు చేసినప్పుడు వాస్తవానికి ఎవరు చేస్తున్నారు? మనం కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నాలికతో రుచి చూస్తాము అయితే ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారో కూడా తెలుసుకో అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ప్రకృతి గుణముల ద్వారా కర్మలు చేయబడుతున్నవి. ప్రకృతి అంటే ఏమిటి దాని గుణములేమిటి అన్నది మనము 14వ అధ్యాయంలో తెలుసుకున్నాము. సత్వ, రజ మరియు తమ అనే మూడు గుణములు ప్రకృతి కలిగి ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఈ గుణముల కారణంగానే ప్రకృతిలో అన్ని పనులు జరుగుతాయి. మన గురించి మనం తెలుసుకోవడం, నేనెవరన్నది తెలుసుకోవడం భగవద్గీత అంతిమ ధ్యేయమని చెబుతారు. నేనెవరన్నది తెలుసుకోవడాన్ని ఆత్మ జ్ఞానం అంటారు. నేనెవరు? ఇది నా శరీరం, నా శరీరంలో నేనుంటాను, ఈ శరీరానికి నేనే అధిపతిని అని చెప్పుకోవచ్చును. ఈ శరీరం ప్రకృతితో నిర్మించబడినది. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి అనబడే పంచభూతాలతో మన శరీరం నిర్మించబడినది. దేహత్యాగం తరువాత ఈ శరీరం చివరకు మరలా ఆ పంచభూతములలోనే కలిసిపోతుంది. కర్మలన్నీ వాస్తవానికి ఈ శరీరం చే చేయబడతాయి. మనం కాళ్లతో నడుస్తాము. కళ్ళతో చూస్తాము. కళ్ళతో చూసే పని ఈ శరీరానిది. శరీరము ద్వారా పనులు జరుగుతాయి, ఈ శరీరము ప్రకృతితో నిర్మించబడినది మరియు ప్రకృతి గుణముల ద్వారా ఈ కార్యములు చేయబడుతున్నాయి. ఏ సమయంలో ఏ కార్యం చేయడానికి ప్రేరేపింపబడతామన్నది గుణములపై ఆధారపడి ఉంటుంది. సత్వగుణము ప్రభలముగా ఉన్నప్పుడు జ్ఞాన సమపార్థనపై మక్కువ పెరుగుతుంది. భగవద్గీత చదవాలన్న కోరిక పెరుగుతుంది. రజో గుణము ప్రభలముగా ఉన్నప్పుడు కోరికలపై ఆసక్తితో పనులు చేయటానికి తాపత్రయపడుతుంటారు. పగలంతా పనిచేసి అలసిపోయిన తరువాత రాత్రి నిద్ర తమోగుణ ప్రభావంతో వస్తుంది. ఈ మూడు గుణముల ప్రభావంతో, మూడు గుణముల కారణంగా పనులన్నీ జరుగుతున్నాయి. నా స్వరూపము ఆత్మ రూపము. నాదని చెప్పబడే ఈ శరీరం నుంచి నేను వేరు. నేను జీవాత్మను, ఆత్మ తత్వాన్ని. ఇప్పటికైతే నా గురించి నాకు తెలియదు కాని ఈ పనులన్నీ శరీరము ద్వారా జరుగుతున్నవన్నది మరియు నేను శరీరాన్ని కాదని నాకు తెలుసు. నేను నా శరీరం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ నేను ఆ శరీరాన్ని కాదు. ఇది నా చెయ్యి, కాని నా చెయ్యి నేను కాదు. ఇవి నా కళ్ళు, కాని నేను కళ్ళు కాదు. పనులవుతున్నది మాత్రం శరీరము ద్వారా అయితే మరి నేను దీనిని చేసినట్లా? ఈ కర్మకు కర్త ఈ శరీరము మరియు ప్రకృతి. కాని మనం ఏం చెబుతున్నాం "అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే" అహంకారం కారణంగా నేనే ఈ శరీరమని ద్రుఢ భావంవల్ల నేనే చేస్తున్నాను, నేను చేయడం వల్లే ఈ పనులన్నీ జరుగుతున్నాయి, ఎవరూ చేయడం లేదు అన్నీ నేనే చేయవలసి వస్తోంది అనే భావం కలుగుతుంది. భగవంతుడు చెప్పేదేమంటే ప్రకృతి ద్వారా ఈ కర్మలన్నీ జరుగుచున్నవి వీటికి నీవు కర్తవు కావు అని. ఈ మాటలను అర్థం చేసుకోవాలి. అహంకారంతో విమూఢమైన ఆత్మ ఇవన్నీ నేనే చేస్తున్నానని భావిస్తుంది. నేను మీతో మాట్లాడుతున్నాను అన్న వాఖ్య ప్రయోగం తప్పా? ఇది సరియైనదే. అహం, నేను అన్నది వేర్వేరు స్థాయిలలో ఉంటుంది. ఒక శరీర స్థాయిలో నేను అని చెబుతాను. ఇది జ్ఞాన పరిపక్వత లేనప్పుడు చెప్పిన నేను అనే పదానికి అర్థము. నా శరీరము, నేను లాంటివి వ్యవహార స్థాయిలో సరియైనవే. ఈ అపరిపక్వత అంత త్వరగా పోదు ఎందుకంటే అహంకారము పోవడానికి అన్నిటికన్నా ఎక్కువ సమయం పడుతుంది. అన్నిటి నుంచి ముక్తుడైన తరువాత ఒక మనిషి నాకు అన్ని పోయినవి అహంకారం కూడా పోయినది అని చెబుతాడు. ఇలా చెప్పడమే అహంకారానికి నిదర్శనం. అహంకారం అంత తేలికగా పోదు. ఈ అహంకారము సమాప్తమైనప్పుడు మాత్రమే మనిషి తనను తాను నిజంగా తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ సంత్ కబీర్ దాస్ చెప్పిన దోహే (పద్యం) ఈ విధంగా ఉంటుంది:
जब मैं था तब हरि नहीं अब हरि है मैं नाहीं ।
प्रेम गली अति सांकरी जामें दो न समाहीं ॥
దీని భావం - నేను ఉన్నప్పుడు హరి లేడు, ఈ భక్తి మార్గము అత్యంత సంక్లిష్టమైనది, ఇక్కడ ఇద్దరు వెళ్లలేరు, నేనైనా వెళ్లగలను లేదా హరి అయినా వెళ్లగలడు. నేను అనే భావన ఉన్నంత వరకు హరి దర్శనం దొరకదు. అహం, నేను అనే భావన తొలగిపోవడానికి ఇది అర్థం చేసుకోవటం చాలా అవసరం, ఈ కర్మలన్నిటికీ కర్తను నేనా అన్నది. కర్మలన్నీ ఈ శరీరము ద్వారా జరుగుచున్నవి. కర్తవ్య కర్మలన్నియు ఈ శరీరం ద్వారానే జరుగుచున్నవి. మరి మనం ఈ శరీరం గురించి ఎందుకు ఆలోచించాలి. అందుకే చెప్పబడింది ఏమంటే “శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం” - ధర్మసాధనకై కర్తవ్య కర్మలను ఆచరించడానికి సాధనం ఈ శరీరము. ఈ శరీరము మన సాధనము, మన వాహనము. దీని కారణంగానే మనం పనులను చేయగలము. అందుకే పని సరిగా చేయాలంటే మన శరీరము సరిగా ఉండాలి. శరీరానికి ఉన్న మహత్వత కారణంగా దానిని సరిగా ఉంచడానికి కూడా ప్రయాస చేయాలి. కాని అంతరంగంలో ఈ శరీరము ప్రకృతిదని, నేను ఈ కర్మలకు కర్తను కాదని తెలుసుకోవాలి. కర్మలను చేసే శక్తి పరమాత్మది, కర్మలను చేసేది ఈ ప్రకృతి మరి ఇందులో నేనెక్కడున్నాను. కాని అహంకారము వలన ఇలా జరగదు. దేహాత్మ బుద్ధి అనగా నేను దేహాన్ని అనే అహంకారము అంత సులువుగా పోదు అందువల్లనే మనకు అలా అనిపిస్తుంది.

3.28

తత్త్వవిత్తు మహాబాహో, గుణకర్మవిభాగయోః।
గుణా గుణేషు వర్తన్త, ఇతి మత్వా న సజ్జతే॥28॥

కాని, ఓ మహాబాహూ! (అర్జునా!) గుణవిభాగ తత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి, వాటియందు ఆసక్తుడు కాడు.

3.28 వివేచన:- తత్వవిత్తు, తత్వవేత్త, తత్వ జ్ఞాని అనగా తత్వాన్ని తెలుసుకున్నవారు. తత్ అనగా అది, మనం వెతుకుతున్నది. నేనెవరిని, ఆత్మతత్వం ఎవరు ఎలా ఉంటుంది అన్నది తెలియదు. అందుకే అని చెప్పబడింది. తత్ శబ్దం పరమాత్మకై కూడా ఉపయోగిస్తారు. త్వం అంటే దాని భావం. తత్వం అంటే అది, దాని యొక్క భావం అని అర్థం. భావం అంటే భావన అని. బాలునికి బాల్యం, వృద్ధునికి వృద్ధాప్యం, మాతకు మాతృత్వం లాగ. మాతయే మాతృత్వం గురించి తెలుసుకోగలుగుతుంది. అలాగే తత్వంతో ఏకరూపత సాధించినప్పుడే మనుషులు దానిని అర్థం చేసుకోగలుగుతారు. నరుడు నారాయణుడైనప్పుడు తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. మన మునులందరూ తత్వజ్ఞులు. చూడటానికి మనుషులు దేహంతో కనిపించిన వారు పరమాత్మతో ఏకరూపులై ఉంటారు. తత్వ జ్ఞానులు గుణ, కర్మ, ప్రకృతి గుణములు వాటి వల్ల కలిగే కర్మల విభాగములను తెలుసుకోగలుగుతారు. ఈ గుణముల ద్వారా వివిధ రకమైన కర్మలు జరుగును. గుణములను మరియు కర్మలను ఈ తత్వవేత్తలు బాగా తెలుసుకుంటారు. గుణా గుణేషు వర్తంత - ఈ గుణములన్నియు వాటి పనులవి చేసుకుంటున్నాయి, మధ్యలో నేనెక్కడున్నాను? నేనెక్కడ లేను ఈ పనులన్నీ గుణముల వల్లనే జరుగుతున్నాయి. 14వ అధ్యాయంలో మనం గుణాతీతుల లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇవి మునుల లక్షణాలు. వీరు గుణములు వాటి పని అవి చేసుకుంటున్నాయి నేను మధ్యలో ఎక్కడా లేను అన్న భావనలో ఉంటారు. పెద్ద పెద్ద సత్కర్మలు చేస్తూ ఉంటారు అయినా కాని వీటికి నేను కర్తను కాదని చెబుతుంటారు. కర్తృత్వం త్యాగం అయిపోతుంది. ఈ మాటను అనుకుని, తెలుసుకుని, అర్థం చేసుకుని వారు దానిపైనే చిక్కుకుని ఉండరు. మనం చిక్కుకుంటాం, మనం ఏదైనా చేసేమంటే దాని ప్రతిఫలం కోసం చూస్తాము. మనం మంచి పని చేస్తే దానికి కనీసం పొగడ్తయినా కావాలనుకుంటాం. ఇక్కడ తత్వవేత్తల గురించి మనం తెలుసుకున్నాం. మనలాంటి సామాన్య మనుషులకు ఏమి తెలుసు ...

3.29

ప్రకృతేర్గుణసమ్మూఢాః(స్), సజ్జన్తే గుణకర్మసు తానకృత్స్నవిదో మన్దాన్, కృత్స్నవిన్న విచాలయేత్॥29॥

ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడిజ్ఞానముగల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు (ఊగిసలాటకు) గురి చేయరాదు.

3.29 వివేచన:- మనం దేహాత్మ బుద్ధితో ఎందుకు ఉన్నాము ప్రకృతి గుణముల కారణముగా సమ్మూఢులైన మనము గుణముల మాయలో చిక్కుకుని ఉన్నాము. అన్నీ మనమే చేస్తున్నట్టు మనకనిపిస్తుంది. గుణముల సమ్మోహములో మనము ఉంటాము. సజ్జన్తే గుణకర్మసు - అంటే మనము గుణములు, కర్మలలో చిక్కుకుని ఉంటాము. ఈ మూడు గుణములు మనుష్యులను బంధించి ఉంచుతాయి. ముందు మనం బంధనములు గురించి తెలుసుకున్నట్లయితే వాటి నుంచి విముక్తి చెంది మోక్ష ప్రాప్తికై ప్రయత్నించవచ్చును. ఈ గుణముల బంధనములలో మనము ఉన్నాము, మనం వాటితోపాటు ఉండవలసినదే. ఎందుకంటే శరీరం ప్రకృతిది మరియు ప్రకృతి త్రిగుణాత్మకమైనది. ఈ గుణములతో పాటు ఉంటూ వాటి నుంచి విముక్తి ఎలా పొందాలన్నది క్రమంగా తెలుసుకోవాలి. ఇది తత్వవేత్తలకు తెలుసు కాని మనకు తెలియదు. అందుకే భగవంతుడు చెబుతున్నాడు – “తానకృత్స్నవిదో మన్దాన్, కృత్స్నవిన్న విచాలయేత్” అని. కృత్స్న అంటే సంపూర్ణంగా, విదో అంటే తెలిసినవారు అని అర్థము. సంపూర్ణ జ్ఞానులు సామాన్యులను ఈ విషయాలలో విచలితులను చేయరాదు, మరియు వారి కర్మలను వారిని చేసుకోనివ్వాలి. ఇంతే కాకుండా వారిని మంచి కర్మలు చేయడానికి ప్రోత్సాహించాలి. సామాన్యులు తమ ఆపేక్షకై చేసే మంచి కర్మలను కూడా ప్రోత్సహించాలి. తల్లి తన కొడుకుకి బాగా చదివితే ఐస్ క్రీమ్ కొనిస్తానని ఆశ చూపిస్తుంది. ఐస్ క్రీమ్ కోసం చదివినా ఆ బాలుని చదువుకోనివ్వాలి. నెమ్మదిగా ఆ బాలునికి చదువుకోవటం అలవాటై, దానిని కర్తవ్య కర్మగా భావించి ఐస్ క్రీమ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా చదువుకుంటాడు. మనం పిల్లల్ని గుడికి తీసుకు వెళ్ళడానికి మంచి ప్రసాదం ఆశ చూపిస్తుంటాం. ప్రసాదం పై ఆశతో బాలుడు గుడికి వస్తాడు. నెమ్మదిగా అతనికి గుడిపై ప్రేమ నిర్మితమై ఏ విధమైన ఆపేక్ష లేకుండా తనంతటతానే రావడం ప్రారంభిస్తాడు. అందుకే మొదట్లో ఎవరైనా ఆపేక్షతో చేస్తున్నా గాని, అన్నీ తెలుసున్నవారు వారిని విచలితులను చేయకుండా ఆ కర్మలను ప్రోత్సహించాలి. మరి ఎటువంటి కర్మలను చేయాలి అన్నదానిపై అత్యంత మహత్వపూర్వకమైన శ్లోకం దీని తర్వాత వస్తుంది ...

3.30

మయి సర్వాణి కర్మాణి, సన్న్యస్యాధ్యాత్మచేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా, యుధ్యస్వ విగతజ్వరః॥30॥

అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తమును ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశా మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము.

3.30 వివేచన:- ఈ శ్లోకం కర్మయోగానికి సారంగా చెప్పుకోవచ్చును. కర్మయోగము, భక్తి యోగము రెండూ ఈ శ్లోకంలో కలిసిపోతున్నాయి. గీతను చదవండి, చదివించండి, జీవితంలో ఆచరించండి అని పూజ్య స్వామీజీ గీతాపరివార్ కోసము చెప్పారు. చదివించడం వల్ల స్వయంగా మనకు గీత ఇంకా బాగా వస్తుంది. చదవడం, చదివించడం వల్ల కూడా మనకు లాభం వస్తుంది. గీతను ఆచరణలో ఎలా పెట్టాలి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. దీనికి సమాధానం ఈ శ్లోకంలో లభిస్తుంది. ఈ శ్లోకాన్ని మనుష్యులు ఆచరణలోకి తీసుకువచ్చినట్లయితే అది మొత్తం భగవద్గీతను ఆచరణలోకి తీసుకువచ్చిన దానికి సమానము. సన్యస్య అనే పదం న్యాస అనే పదం నుంచి వచ్చింది. న్యాస అంటే త్యాగం అని అర్థం. సన్యస్య అంటే మంచిగా త్యాగం చేయటం అని అర్థం. దేనిని త్యాగం చేయాలి? ఎక్కడా భగవంతుడు సన్యాసం తీసుకోమని చెప్పటం లేదు. “మయి సర్వాణి కర్మాణి, సన్న్యస్యా” - అంటే నీవు చేసే అన్ని కర్మలను నాకు అర్పించమని భగవంతుడు చెబుతున్నాడు. నీవు రోజంతా చేసే పనులన్నీ కూడా నాకు అర్పించమని భగవంతుడికి చెబుతున్నాడు. మనం భగవంతునికి పూలు, కుంకుమ సమర్పించినట్లుగానే కర్మలను కూడా అర్పించాలి. ఒక్కొక్క కర్మను భగవంతునికి ఒక్కొక్క పువ్వుగా అర్పించాలి. కర్మయే పూజ అంటే అర్థం ఏమిటి? జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పినట్లుగా భగవంతునికి అన్నిటికన్నా ప్రీతిపాత్రమైన పూజ ఏదంటే స్వకర్మలను పూలగా భగవంతునికి అర్పించడం. దీని కొరకు మనం ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. కర్మలను చేసేముందు భగవంతునికి నమస్కరించుకొని ఆ కర్మలను చేయడం ముగించిన తర్వాత భగవంతుడా నీ కోసం చేసిన కర్మలను నీకు అర్పిస్తున్నానని ప్రార్థిస్తే చాలు. ఏ పని అంటే, భగవంతుడు, సర్వాణి కర్మాణి - మనం చేసే అన్ని కర్మలు అర్పించమని చెబుతున్నాడు. ఇది అత్యంత మహత్వపూర్వమైనది. ఎలా చేయాలి? ప్రార్థన శిబిరంలో పూజ్య స్వామీజీ ఒక సుందర ప్రార్ధనను చెప్పారు - ఉదయమే లేచి భగవంతుడా నేను మీ కార్యములను చేయుటకై నియుక్తుడైనాను అని ప్రార్ధన చేయవలెను. భగవంతుడా నీవెక్కడున్నావు, నీవు సర్వత్రుడవైతే నాలో కూడా ఉన్నావు. కర్మలు చేస్తుండగా మధ్యలో నేను మీకోసమే చేస్తున్నట్టు మర్చిపోకుండా నా అంతరంగంలో ఉండి నన్ను మధ్య మధ్యలో జాగృతి పరుస్తుండు. నా మనసు చాలా చంచలమైనది అది అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది, దాని కళ్ళాలను నీవు పట్టుకొని నియంత్రిస్తూ ఉండు. అంతర్యామి మనలోనే ఉన్నది. మనసుకు అప్పుడప్పుడు చెడు ఆలోచనలు వస్తుంటాయి. పాపపు ఆలోచనలు మనసులో వచ్చినప్పుడు అంతర్యామి మనలోనే ఉన్నదని తెలిస్తే మనసు దానంతట అదే కుదుటపడి శ్రద్ధతో కర్తవ్య కర్మలను నిర్వహిస్తుంది. కర్మలను ప్రారంభించే ముందు ప్రార్థనతో మొదలుపెట్టి ప్రతి కర్మ పూర్తయిన తర్వాత దానిని భగవంతునికి అర్పించాలి. శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీరామార్పణమస్తు, శ్రీ శివార్పణమస్తు, శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు అంటూ మనకి నచ్చిన భగవంతుని రూపానికి అర్పించాలి. అర్పించిన తర్వాత ఆ కర్మ మనది కాదు. ఈ విధంగా మనం ఆ కర్మబంధనము నుంచి విముక్తులైపోతాము. రెండవ మహత్వపూర్ణమైన విషయమేమిటంటే నేను భగవంతునికి పని చేస్తున్నానన్న భావన ఉన్నప్పుడు ఆ పనులు ఇంకా శ్రద్ధతో చేయగలుగుతాను. భగవంతుని కార్యముగా తలచినప్పుడు చెడు పనులు వాటి అంతటవే ఇంద్రియములచే నిగ్రహించబడతాయి. చిత్తమును పరమాత్మ పై ఉంచి భగవంతుని కొరకే కర్మలు చేస్తున్న భావనను జాగ్రుతపరచి ఉంచాలి. అలాగే పనులు చేస్తూ వాటిని భగవంతునికి అర్పిస్తూ ఉండాలి. ఇంకా “నిరాశీర్నిర్మమో భూత్వా, యుధ్యస్వ విగతజ్వరః” అని భగవంతుడు చెబుతున్నాడు. భగవంతునికి అర్పించిన కర్మలపై ఏ విధమైన అపేక్ష ఉండరాదు. ఆ కర్మలు ఇంక నావి కాదన్న భావన ఉండాలి. ఈ విధంగా యుద్దం లాంటి కర్మలు కూడా నీది కాదు భగవంతునిది అన్న భావనతో చెయ్యి. ఇక్కడ యుద్ధం చేయడం అనేది అర్జునునికి కర్తవ్య కర్మ. యోధునికి యుద్ధమే కర్తవ్య కర్మ. నీ కర్తవ్య కర్మను నీవు నిర్వహించు. మన దేశ సరిహద్దులలో కాపలా కాసే సైనికులకు శత్రువులు ఎదురుపడినప్పుడు వారిపై గన్ పేల్చడం వారి కర్తవ్య కర్మ. విగతజ్వరః - దాని గురించి సందేహించవద్దు. కోపంతో కాకుండా, శాంత చిత్తంతో కర్తవ్య కర్మగా ఈ బాణాన్ని వేస్తున్నానని భావించి యుద్ధం చేయి అర్జునా అని భగవంతుడు చెబుతున్నాడు. నాకు అర్పిస్తున్నట్టుగా చెయ్యి. భగవద్గీతలో ఇంతటి ఆచరణాత్మకమైన శ్లోకము మనం ఆచరించి చూడాలి. దీన్ని ఆచరించిన తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో స్వయంగా అనుభూతి పొందగలుగుతాం. భగవద్గీత యోగ శాస్త్రము, అనుభూతి కలిగించే శాస్త్రము. ఇది ఎవరో చెబితే రాదు. స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. రేపు పొద్దుటే లేచి భగవంతునికి ప్రార్థించి ఒక్కొక్క కర్మ నీకోసమే చేస్తున్నానని భావించి కర్మలను భగవంతునికి అర్పించినట్లయితే దాని అనుభూతి మనకు తెలుస్తుంది. అదే పనిని ఇంకా శ్రద్ధతో మనం చేయగలుగుతాం మరియు ఆ కార్యం పూర్తవుతూనే దాన్ని భగవంతునికి అర్పిస్తూ ఉండాలి. అర్పించడం మర్చిపోయినట్లయితే సాయంత్రం నిద్రించే ముందు భగవంతుడా నేను నీకు ప్రార్థనను చేసి నీ కర్మలను చేయుటకు ఉపక్రమించాను కాని మరచిపోవటం వల్ల వాటిని నీకు వెంటనే అర్పించలేకపోయాను, వీటన్నిటిని ఇప్పుడు నీకు అర్పిస్తున్నాను శ్రీకృష్ణార్పణమస్తు లేదా ఏ భగవంతుని రూపానికి అర్పించాలనుకుంటున్నారో ఆ భగవంతుని పేరు మీదుగా అర్పించాలి. దాని ఆలోచన నుంచి మన ముక్తులమైపోతాము. ఆ కర్మ ఫలితం ఏమిటి అన్న దానిపై మనకు ఏ విధమైన చింతా ఉండదు. ఆ తరువాత రాత్రి నిద్ర ఎలా పడుతుందో చూడండి. ఇది అన్నిటికన్నా మొదటి అనుభవం. గీతను ఆచరణలో ఎలా పెట్టాలన్న దానిపై భగవంతుడు చెప్పిన సుందరమైన శ్లోకం ఇది. నేను చేశాను నాది అన్న భావన ఎక్కడా మనసులో రాకూడదు. భగవంతుని కార్యమును భగవంతుని కోసమే చేసి, దాన్ని అర్పిస్తూనే దాని గురించి మర్చిపోవాలి. ఆ కర్మ యుద్దం లాంటిదైతే యుద్ధం చెయ్యి. నీ కర్తవ్యం ఏదైతే అది చెయ్యి.

3.31

యే మే మతమిదం(న్) నిత్యమ్, అనుతిష్ఠన్తి మానవాః
శ్రద్ధావన్తో౽నసూయన్తో, ముచ్యన్తే తే౽పి కర్మభిః॥31॥

దోషదృష్టి లేకుండ శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు.

3.31 వివేచన:-యే - ఎవరైతే, మే మతమ్ - ఎలా కర్మలు చేయాలి అని నేను చేసిన ఈ ఉపదేశాన్ని, అనసూయంతః - ఇందులో ఏ దోషము చూడకుండా, కాస్త అటు ఇటు చేస్తే ఏమవుతుంది, భగవంతుడికి అర్పించకపోతే ఏమవుతుంది లాంటి ఆలోచనలు చేయకుండా, శ్రద్ధావన్త - భగవంతుడు చెప్పిన మాటపై శ్రద్ధ ఉంచి, అనుతిష్ఠన్తి - అనుసరిస్తారో, ఆచరిస్తారో, ముచ్యన్తే తే౽పి కర్మభిః - వారందరూ కూడా కర్మల బంధనముల నుంచి ముక్తులైపోతారు. తరువాత వారికి కర్మలాచరించవలసిన ఆవశ్యకత ఉండదు అయినా గాని వారు కర్మలను లోకహితార్ధమై చేస్తూనే ఉంటారు. పరమాత్మ ప్రాప్తించిన తర్వాత కూడా వారి భక్తి అలానే ఉంటుంది. తుకారాం జీ మహారాజ్ కి పాండురంగ దర్శనం అయినదని చెప్పరు, తుకారామే పాండురంగడు అయిపోయాడు అని చెబుతారు. ఆయనతో ఏకరూపుడు అయిపోయాడు. ఏకరూపులైన వారు ఏమి చేస్తారు? ఏకరూపులైన తరువాత కూడా తుకారం భజనలు చేస్తూనే ఉంన్నారు. కర్మబంధనాలనుంచి ముక్తి పొందిన తరువాత కూడా కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మబంధనాలలో ఉండి భజన చేయడంలోనూ, ముక్తిని సాధించిన తరువాత భజన చేయడంలోనూ తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది. కాని దీనిని అందరూ అనుసరించరని భగవంతుని తెలుసు అందుకే ...

3.32

యే త్వేతదభ్యసూయన్తో, నానుతిష్ఠన్తి మే మతమ్
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్, విద్ధి నష్టానచేతసః॥32॥

కాని నాయందు దోషారోపణ చేయుచు, నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్తజ్ఞాన విషయముల యందును మోహితులై (విపరీత జ్ఞానోపహతులై) భ్రష్టులై, కష్టనష్టముల పాలయ్యదరని ఎఱుంగుము.

3.32 వివేచన :- కానీ కొందరు అసూయతో దోషములను చూస్తూ, ఇలా చేస్తే ఏమన్నా అవుతుందా, ఏమీ కాదు లాంటి మాటలు చెబుతూ దీనిని అనుసరించరు. వారందరూ జ్ఞానములో మూడులైపోతారు. మూర్ఖులు, అజ్ఞానులు అయిపోతారు. దీనిని తెలుసుకొని ఇటువంటి వాటి వైపు ధ్యాస పోనివ్వకు. అజ్ఞానులవైపు ఆలోచించకుండా నేను చెప్పిన విధంగా కర్మలను ఆచరిస్తుండు. పూజ్య స్వామీజీ ఒక మహత్వపూర్ణమైన వాఖ్యమును చెప్పారు. జీవితంలో సఫలులు కావాలంటే "మయి సర్వాణి కర్మాణి, సన్న్యస్యాధ్యాత్మచేతసా" అన్నది ఒక రాజమార్గము. ఈ శ్లోకాన్ని ఆచరణలోకి తెస్తే మనిషికి విజయం తథ్యం. నిశ్చయంగా ముక్తులవగలరు. "యత్ర యోగే᳚శ్వరః(ఖ్) కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః । తత్ర శ్రీర్విజయో భూతిః(ర్), ధ్రువా నీతిర్మతిర్మమ" (18.78) - వారికి విజయము నిశ్చయము. ఎవరైతే అసూయతో దోషములు వెతుకుతూ, ఈ కర్మలు ఆచరించరో వారిని వదిలిపెట్టు. వారి జీవితం వ్యర్థం, వారికి చెప్పటం వ్యర్థం అని భావించు. జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పేదేమంటే శవం చేతిలో రత్నాలు పెడితే దానిలో ఏమైనా మార్పు వస్తుందా, అలాగే రత్నాల లాంటి భగవంతుని మాటలను పెడచెవిన పెట్టిన వారి పరిస్థితి కూడా అంతే. రత్నాల్లాంటి భగవంతుని మాటలను పాటించిన వారికి విజయం తథ్యం. భగవద్గీత విజయ శాస్త్రం. మనకి విజయాన్నందించే శాస్త్రం. ఆనందమై జీవన గమనానికి ఇది శాస్త్రం. ఈ శ్లోకాలను ఆచరించడం ద్వారా, అన్నిటినీ భగవంతునికి అర్పించడం ద్వారా మనకు ఎంత మంచి నిద్ర పడుతుందో స్వయంగా అనుభవించవచ్చును. నేను మంచి కార్యము చేశాను, అది భగవంతునికి అర్పించాను, ఇక అది నాది కాదు అన్న భావనలో ఉండాలి. మిగిలిన శ్లోకాల గురించి తరువాత వారం చెప్పుకుందాం. భగవంతుడు చెప్పినట్లుగా ఇంతవరకు చెప్పిన ఈ వివేచనను కేవలం మాటలతోనే కాకుండా భావంతో పాటుగా ఆయన పాదపద్మములకు అర్పిస్తూ ఈరోజుకి విరామం తీసుకుందాము. ఓం తత్ సత్ శ్రీకృష్ణార్పణమస్తు.
ప్రశ్నోత్తరాలు
 
ప్రశ్న - కేశవ శబ్దానికి అర్థం ఏమిటి? 
సమాధానము - ఎవరికైతే అందమైన జుట్టు ఉంటుందో వారిని కేశవ అని పిలుస్తారు. భగవంతుడు శ్రీకృష్ణునికి అందమైన జుట్టు ఉండటం వల్ల ఆయనను కేశవుడు అంటారు. 
ప్రశ్న- న్యగ్రోధోదుంబరో శ్వస్థాః (न्यग्रोधोदुंबरो श्वस्थाः) అంటే అర్థం ఏమిటి? 
సమాధానము - ఇది మూడు వృక్షాల పేర్లు. న్యగ్రోధః అంటే వటవృక్షము. ఔదుంబరః అంటే శమీ వృక్షము. అశ్వత్థః అంటే రావి చెట్టు. ఈ మూడు చెట్లను పూజిస్తారు. అశ్వత్థ అంటే ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదని. ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. 15వ అధ్యాయంలో ఈ విశ్వాన్ని వర్ణించడానికి భగవంతుడు అశ్వత్థ వృక్షాన్ని ఉపమానంగా చెప్పాడు. పదవ అధ్యాయంలో భగవంతుడు తన విభూతుల గురించి చెబుతూ “అశ్వత్థః(స్) సర్వవృక్షాణాం(న్)” అంటాడు. ఈ మూడు వృక్షాలు కూడా భగవంతుని రూపం గానే భావిస్తారు. విష్ణు సహస్రనామంలో వీటి ప్రస్తావన ఉంటుంది. 

ప్రశ్న - 30 వ శ్లోకంలో "యుధ్యస్వ విగతజ్వరః" అంటే అర్థం ఏమిటి? 
సమాధానము - జ్వరము అంటే తాపము అని అర్థం. ఇక్కడ కోపాన్ని విడిచిపెట్టి కర్తవ్యంగా భావించి యుద్ధం చేయమని అర్థం. అర్జునుడు యోధుడు, యుద్ధం జరగబోతోంది అందుకే భగవంతుడు యుద్ద్యస్వ అని చెప్పాడు. మన కర్తవ్యకర్మ ఏది అయితే అది మనం చేయాలి. అది కూడా సంతాపం లేకుండా, కోపం లేకుండా చేయాలి. ఈ పని చేయవలసి వస్తోంది అన్న బాధతో కాకుండా భగవంతుడు ఈ పనికై నన్ను ఎంచుకున్నాడు అన్న భావనతో చేయాలి. పని అదే చేసినా భావనలో మాత్రం తేడా ఉంది. భగవద్గీత మన దృష్టి కోణాన్ని మారుస్తుంది. దీనివల్ల మనం కర్మలను మరింత అంకితభావంతో చేయగలము. 

ప్రశ్న - ఆరవ శ్లోకంలో కేవలం కర్మేంద్రియాలు మాత్రమే నిగ్రహించాలని ఎందుకు చెప్పారు? 
సమాధానము - ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏమిటంటే కర్మేంద్రియాలను నిగ్రహించి మనసులో వాటి గురించి ఆలోచించేవారు మిధ్యాచారులు అని. ఏకాదశి ఉపవాసం చేస్తూ, తరువాత రోజు తినబోయే ఆహారాల గురించి మనసులో ఆలోచించేవారు మిథ్యాచారులు అని భగవంతుడు చెబుతున్నాడు. శరీరం ఉపవాసం చేస్తోంది కాని మనసు మాత్రం రుచుల గురించి ఆలోచిస్తోంది. మన చర్మం జ్ఞానేంద్రియం అయినప్పటికీ దాని ద్వారా కూడా కర్మలు జరుగుతాయి, అందువల్ల అది కర్మేంద్రియం కూడా. ఇక్కడ కర్మేంద్రియములు అనే శబ్దం ఉపయోగించినప్పటికీ అది అన్ని ఇంద్రియములకు వర్తిస్తుంది. శబ్ద జ్ఞానం కలిగినది జ్ఞానేంద్రియం అయినప్పుడు చెవులు వినే ప్రక్రియ కర్మేంద్రియముల ద్వారా చేయబడే కర్మ. చూసిన దానిని గ్రహించడం జ్ఞానేంద్రియముల వల్ల అయినప్పటికీ కనుల ద్వారా చూడటం కర్మ చేయడం కాబట్టి అవి కర్మేంద్రియాలు అవుతాయి. కాళ్లు, చేతులు కేవలం కర్మేంద్రియాలు మాత్రమే.

హనుమాన్ చాలీసాతో ఈ కార్యక్రమం ముగిసినది.