विवेचन सारांश
ఆత్మసంయమయోగం నిజ దర్శనం యెక్క వివరణ

ID: 3617
Telugu - తెలుగు
శనివారం, 09 సెప్టెంబర్ 2023
అధ్యాయము 6: ఆత్మ సంయమ యోగము
3/4 (శ్లోకము 24-36)
వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/


గీతా పరివార్ పరంపరానుసారముగా ఈనాటి వివేచన కార్యక్రమం ఆరంభ ప్రార్థనతో మొదలైనది. ఆరవ అధ్యాయము వివేచన మధ్యాంశము (3వ భాగము) చెప్పడానికి స్వామీజీ గారి శిష్యులు గీతా విశారదులు శ్రీ శ్రీనివాస్ జీ వార్నేకర్ గారిని స్వాగతించారు. శ్రీ వార్నేకర్ గారు గురు ప్రార్థన, కృష్ణ ప్రార్థన, సద్గురు ప్రార్థన, భారతమాతకు వందనములు, గీతా మాహాత్యము, సద్గురు శ్రీ గోవిందేవ్ జీ గిరి మహారాజ్ చరణములకు వందనములతో, గీతా ప్రేమికులు, గీతాసాధకులందరికీ హృదయాభివాదములతో ఈనాటి వివేచన కార్యక్రమమును ప్రారంభించారు. ఐదవ అధ్యాయం మొదటిలో అర్జునుడు భగవంతున్ని అడిగిన ప్రశ్నకు వివరముగా సమాధానమిస్తూ కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఎవరైతే తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తారో వారే సన్యాసులు, యోగులు అని చెబుతాడు. సన్యాసి, యోగి బయటకు వేరువేరుగా కనిపించినా వారి అంతరంగ స్థితి మాత్రము ఒకేలా ఉంటుంది. వ్యక్తులు యోగారూఢులు ఎలా అవుతారు, వారు ఎలా ఉంటారో భగవంతుడు చెబుతాడు. యోగారూఢులైనవారు కర్మయోగాన్ని ఆశ్రయించడము ఆవశ్యకము. కర్మయోగ ఆచరణ తోటే మనిషి యోగ శిఖరమును చేరుకోగలుగుతాడు. కేవలం కర్మను త్యాగం చేయటం ద్వారా మనిషి యోగశిఖరమును చేరుకోలేడు.
ఆరురుక్షోర్మునేర్యోగం(ఙ్), కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ, శమః(ఖ్) కారణముచ్యతే ॥6.3॥
యోగారూఢులవడానికి కర్మయే సాధనము. తరువాత భగవంతుని ధ్యానములో ఉన్నప్పుడు, ఆ ధ్యానము ఎలా చేయాలి? దానికి తగిన స్థానము ఎలా ఏర్పరుచుకోవాలి? అక్కడ ఎలాంటి ఆసనంలో కూర్చోవాలి? ఏ విధముగా కూర్చోవాలి? లాంటి విషయాలన్నీ భగవంతుడు చెప్పాడు.
సమం(ఙ్) కాయశిరోగ్రీవం(న్), ధారయన్నచలం(మ్) స్థిరః ।
సమ్ప్రేక్ష్య నాసికాగ్రం(మ్) స్వం(న్), దిశశ్చానవలోకయన్ ॥6.13॥
అలానే భగవంతుడు ఈ స్థితిని చేరుకోవడానికి ఆహార వ్యవహారములు ఎలా నియంత్రించుకోవాలి అని చెప్పినది కూడా మనం విని ఉన్నాము.
యుక్తాహారవిహారస్య, యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య, యోగో భవతి దుఃఖహా ॥6.17॥
అటువంటి యోగి ధ్యానములో ఉన్నప్పుడు
యత్రోపరమతే చిత్తం(న్), నిరుద్ధం(మ్) యోగసేవయా ।
యత్ర చైవాత్మనాత్మానం(మ్), పశ్యన్నాత్మని తుష్యతి ॥6.20॥
వారిని వారు స్వయంగా దర్శించుకుంటారు, తెలుసుకోగలుగుతారు. వారి చిత్తము ఏ విధముగా స్థిరమై ఉంటుంది అన్నదానికి భగవంతుడు గాలి లేని చోట దీపము, గర్భగుడి వంటి స్థానములో దీపము యొక్క జ్యోతి ఏ విధముగా నిశ్చలముగా ఉంటుందో అలా ఉండి అత్యంతిక సుఖమును అనుభవిస్తారు. ఈ యోగము దుఃఖము యొక్క సంయోగము నుంచి వియోగము కల్పిస్తుంది. ఎంత పెద్ద దుఃఖము వచ్చినప్పటికీ అటువంటి మనుషులు విచళితులు కారు.
యస్మిన్స్థితో న దుఃఖేన, గురుణాపి విచాల్యతే ॥6.22॥
స నిశ్చయేన యోక్తవ్యో - దాన్ని నిశ్చయముగా చేయవలెను. యోగాభ్యాసము నిరంతరముగా చేయవలసిన ప్రక్రియ. యోగాభ్యాసాన్ని   ఎలా చేయాలో పూజ్య జనార్ధన్ మహరాజ్ మాటల్లో ముందు వారం చెప్పుకున్నాము. యోగమేవాభ్యసే ప్రాద్య యదాశక్తి నిరంతరం - ఎంత అధిక ప్రయాసతో చేయగలుగుతారో అంతా చేయవలెను. ఇక్కడ నిరంతరము అన్నది మహాత్వపూర్ణమైన పదము. ఎల్లవేళలా చేయడం ఆవశ్యకం. అనిర్విణ్ణచేతసా - ఉత్తేజితులు కాకుండా ఈ యోగాభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. అలా యోగాభ్యాసాన్ని చేస్తూ మనిషికి అన్ని సంకల్పములు త్యాగం అయినప్పుడు ...

6.24

సఙ్కల్పప్రభవాన్కామాంస్, త్యక్త్వా సర్వానశేషతః৷
మనసైవేన్ద్రియగ్రామం(వ్ఁ), వినియమ్య సమన్తతః৷৷24৷৷

సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి, ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను.

ఇక్కడ మన మనసులో కోరికలు ఎలా పుడతాయో భగవంతుడు చెబుతున్నాడు. మన మనసులో కోరిక ముందు పుడుతుందా? లేక సంకల్పము ముందు పుడుతుందా? సంకల్పము అంటే కోరికలను తీర్చమని కోరుకుంటూ చేతిలో నీటిని తీసుకుని తర్పణం చేయాలి అన్న అభిప్రాయంలో ఉంటాము. దీని కొరకై నేను ఈ యొక్క యజ్ఞం చేస్తున్నాను అని పూజకు ముందు మనం సంకల్పము తీసుకుంటాము. ఇక్కడ సంకల్పమునకు అర్థము అది కాదు. ఇక్కడ సంకల్పం అంటే సంయక్ కల్పతే - మనసులో మంచి జరగాలన్న కల్పన. ఏదైనా వస్తువు, మనిషి, పని మంచిదని భావించి దాన్ని తనకే కావాలని కోరుకోవడం. ఇది మనసులో కలిగే సంకల్పం. మంచివి కావాలన్న భావము. మనసులో ఇటువంటి సంకల్పం కలిగినప్పుడు వాటి వెనకే ఇది నాకు కావాలన్న కోరికలు పుడతాయి. సఙ్కల్పప్రభవాన్కామాంస్- సంకల్పము వల్ల పుట్టే కోరికలు అని భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు. త్యక్త్వా సర్వానశేషతః - ఆ భగవత్ ప్రాప్తి తప్ప మిగతా ఏ కోరిక మనసులో లేకుండా త్యాగం చేయవలెను. ఆ ధ్యేయ ప్రాప్తి తప్ప ఇంకే కోరిక మనసులో ఉండరాదు. కోరిక మరియు ధ్యేయము మధ్య తేడాని తెలుసుకోవాలి. వ్యక్తిగత రూపంలో సుఖాన్ని అభిలషించినప్పుడు అది కోరిక అవుతుంది. విశ్వహితానికై, విశాల హృదయములో కోరిక పుట్టినప్పుడు దాన్నే ధ్యేయము అంటారు. మనుషులు ఎప్పుడైతే అలాంటి తమ ధ్యేయముపై దృఢనిశ్చయముతో ఉంటారో, భగవత్ ప్రాప్తి తప్ప ఇంకేమి అవసరం లేదనుకుంటారో అటువంటప్పుడు మిగతా సంకల్పములన్ని వాటంతటవే తొలగిపోతాయి. ఆ కోరికలను మనం విడిచిపెట్టకుండానే వాటంతవే తొలగిపోతాయి. ధ్యేయముతో ప్రేరేపితులైన మనుషులకు వేరే ఏది బాగా అనిపించదు. స్వాతంత్ర సమర యోధుడు సావర్కర్ భారతమాతను స్వతంత్ర దేవిగా చూడాలనుకున్నాడు. స్వతంత్రాన్ని భగవత్ ప్రాప్తిగా భావించాడు. అదే అతని ధ్యేయం. ఆ ధ్యేయము వలన మిగతా కోరికలన్నీ అతని చరణములు పై త్యాగము అయిపోయినవి. చేసే పనులన్నీ ఆ ధ్యేయము కొరకే చేస్తాను. రాసే గీతములన్ని ఆ ధ్యేయం కొరకే రాస్తాను. ఏ పని చేసినా ఆ భారత మాత స్వతంత్రతకై చేస్తాను. వేరే ఏ విషయము ముందుకు రాదు, వేరే ఏ సంకల్పము కలుగదు. అప్పుడు కోరికలు వాటంతటవే త్యజించబడుతాయి. ఒక బాలుడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్న ధ్యేయంతో ఉన్నప్పుడు, అతనికి టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్లు ప్రభావితం చేయలేవు. ఇలా ధ్యేయముతో మనిషి ప్రేరేపితుడైనప్పుడు కోరికలు వాటంతటవే త్యజించబడుతాయి. అప్పుడు ఆ మనిషి మనసైవేన్ద్రియగ్రామం(మ్), వినియమ్య సమన్తతః - తన మనసు ద్వారానే ఇంద్రియ సమూహమును నియంత్రించ గలుగుతాడు. మనస్సు ద్యేయముపై పూర్తిగా ఉన్నప్పుడు, అది ఇంద్రియములను కూడా ఆ ధ్యేయం వైపు లాగుతుంది, అంతర్ముఖులను చేస్తుంది. బయటి విషయములు గుర్తుకు కూడా రావు. ఈ స్థితిని చేరుకున్న యోగి ధ్యానము ఎలా చేస్తాడో భగవంతుడు చెబుతున్నాడు ...

6.25

శనైః(శ్) శనైరుపరమేద్, బుద్ధ్యా ధృతిగృహీతయా৷
ఆత్మసంస్థం(మ్) మనః(ఖ్) కృత్వా, న కిఞ్చిదపి చిన్తయేత్৷৷25৷৷

క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమొనర్చి పరమాత్మను తప్ప మఱి ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతన చేయరాదు.

యోగాభ్యాసము ఒకటి రెండుసార్లు చేస్తే అయ్యేది కాదు, నెమ్మది నెమ్మదిగా పరివర్తన వస్తుంది. మనసు, ఇంద్రియములపై నియంత్రణ ఒక్కసారిగా రాదు. దీనికి సమయం పడుతుంది. మన చిత్తమును బాహ్యములోనికి రాకుండా లోపలే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన మనసును కేవలం ధ్యేయం పైనే ఉంచాలి. చిత్తమును ధ్యేయముపై ఎలా ఉంచగలుగుతాము? మనసు ధ్యేయంపై ఉంచటానికి బుద్ధి ఉంటుంది. బుద్ధి విచారణ, విశ్లేషణ చేయగలిగినదై మనసుకు ధ్యేయముపైనే ఉండమని చెప్పగలదు. మనసు నియంత్రణ చేయడానికి శిక్షణ ఎలా ఇవ్వాలన్నది సమర్థ రామదాసు మరాఠీలో ఒక అందమైన శ్లోకము ద్వారా చెప్పారు. ఓ సజ్జన మనసా నీవు ఈ మార్గంలో ప్రయాణించు, అన్న ఈ విషయాన్ని మనసుకి అర్థం అయ్యేలా బుద్ధి  ఎలా చెబుతుంది. ఆ బుద్ధి కూడా అల్పమైనదికాకుండా ధైర్యయుక్తమైనదై ఉండాలి. అటువంటి ధైర్యయుక్తమైన బుద్ధితో మనసును ధ్యేయముపై ఉంచవలెను. ధ్యేయము పరమాత్మ పైనే ఉంచాలి. మన ధ్యేయమునే పరమాత్మగా భావించాలి. మన ధ్యేయం ఎప్పుడూ కూడా ఎత్తులో ఉండాలి. ఇల్లు కట్టడం, కారు కొనడం ధ్యేయములు కాదు, కోరికలు మాత్రమే. విశాలమైన కోరికలే ధ్యేయము అవుతాయి. పరమాత్మ విరాటుడు, సర్వత్రుడు, విశ్వవ్యాపి అయినవాడు. పరమాత్మ ఎంత విశాలమైన వాడో మన ధ్యేయం కూడా అంత విశాలమైనది అయి ఉండాలి. "Not failure, but low aim is crime" అన్న ఆంగ్ల సామెత అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న ధ్యేయము నేరముగా చెప్పబడినది. ధ్యేయము ఎప్పుడూ విశాలమైనదై ఉండాలి. మనసును ఆ పరమాత్మపై ఉంచాలి మరియు అదే తన ధ్యేయమని ఉండాలి. ఇక వేరే ఏ చింతలు చేయరాదు. మనసుని ధ్యేయముపై, ఆ పరమాత్మపై లేదా మనకు నచ్చిన ఆ పరమాత్మ యొక్క రూపంపై ఉంచవలెను. రాముడు, కృష్ణుడు, వినాయకుడు వంటి ఆ పరమాత్మ యొక్క ఏ రూపం నచ్చుతుందో ఆ రూపంపై మన మనసును ఉంచాలి. ఆపై ఏ చింతలూ చేయరాదు అన్నది మనసుకి చాలా కఠినమైనది. సాధారణంగా మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, కాని భగవంతునిపై పూర్తిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి, మనసు అటు ఇటు పోకుండా హృదయంలో ఉండిపోతుంది. జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పినట్లుగా బుద్ధికి ధైర్యం యొక్క ఆశ్రయం దొరుకుతుంది, అప్పుడు మనసును బుద్ధి ఆ మార్గంలో పెట్టగలుగుతుంది. బుద్ధి మనసుని ఆ పరమాత్మలో స్థాపితం చేస్తుంది. జ్ఞానేశ్వర్ మౌళి దీనిపై ఒక సరళ ఉపాయాన్ని కూడా చెప్పారు. ఈ అభ్యాసము కష్టము అనిపిస్తే ఏమి చేయాలి? యోగాభ్యాసము యమ, నియమములతో మొదలవుతుంది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఏదో ఒక్క నియమాన్ని ఆచరించమని చెబుతారు. ప్రాణం పోయినా ఆ నియమాన్ని వదిలి పెట్టనని ఉండాలి. చిన్న నియమమైనా దాన్ని ఆచరించవలసినప్పుడు ఎంత కష్టమో తెలుస్తుంది. కాని పాలన చేయాలనుకున్నవారు ఆ నియమాన్ని మనసులో బుద్ధి, ధైర్యములతో పాటించవలెను. ఏది ఏమైనా సరే ఆ నియమాన్ని ఆచరించి తీరాలి. ఈ నిశ్చయము ఉన్నవారికి మనసు ఎటు పోయినా ఆ నియమం దాన్ని పట్టి వెనక్కి తీసుకువస్తుంది. మనసును ఒకచోట ఉంచే కార్యమును నియమం చేస్తుంది. అలా చిన్న నియమాన్ని తీసుకొని ఆచరించినప్పుడు వారి చిత్తము ఒకచోట స్థిరముగా ఉండటం ప్రారంభము అవుతుంది. మనసు అంత తేలికగా స్థిరత్వాన్ని సాధించదు, అది ఎవరి మాట వినదు. అది బుద్ధి మాట కూడా వినదు. బుద్ధి ఎప్పటికప్పుడు ఏది మంచో, ఏది చెడో చెబుతూనే ఉంటుంది కాని మనసు వినదు. అటువంటి మనసును ఎలా నియంత్రణలోకి తీసుకురావాలని భగవంతుడి చెబుతున్నాడు ...

6.26

యతో యతో నిశ్చరతి, మనశ్చఞ్చలమస్థిరమ్৷
తతస్తతో నియమ్యైతద్, ఆత్మన్యేవ వశం(న్) నయేత్৷৷26৷৷

సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి మఱల్చి, దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను.

ఈ మనసు అస్థిరము, చంచలము అయినదని భగవంతుడు చెబుతున్నాడు. మనసు ఒకచోట స్థిరముగా ఉండదు. భగవంతుని విగ్రహం ముందు కూర్చుని దాని వైపే చూస్తున్నా మనసు అటు ఇటు చెదిరిపోతుంది, మనసులో వివిధ రకములైన ఆలోచనలు వస్తుంటాయి. అటువంటి అస్థిరమైన, చంచలమైన మనసు ఇది. భగవంతుడు చెబుతున్నాడు యతో యతో నిశ్చరతి - మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అని. తతస్తతో నియమ్యైతద్ - దానిని అక్కడ నియంత్రించి తీసుకురావాలి, మరల మన ధ్యేయంపై ఉంచాలి. ధ్యానం నుంచి గతి తప్పిన మనసును నియంత్రించి మరలా ధ్యానముపై ఉంచాలి. ఎలా తీసుకురావాలి? ఇంట్లో చిలిపి పిల్లలు ఉన్నప్పుడు, వారికి నడక రాగానే ఇంట్లో నుంచి బయటకు మాట మాటకు పరుగులు పెడుతూ ఉంటారు. వారిని మనము ప్రేమతో పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాము. అలాగే భ్రమిస్తున్న మనసును ప్రేమతో తీసుకువచ్చి మరల ధ్యేయముపై ఉంచాలి. మనసును ఆ పరమాత్మతోనే బంధించి ఉంచాలి. మనసు మాట మాటకు భ్రమిస్తూనే ఉంటుంది. అలా భమిస్తున్న మనసును ప్రతిసారి వెనక్కి తీసుకొచ్చి ధ్యేయముపై ఉంచాలి. ఈ విధముగా అభ్యాసం చేయడం ద్వారా మనసు మూఢ, క్షిప్త, విక్షిప్త అవస్థలను దాటి ఏకాగ్ర అవస్థను చేరుకొని, నెమ్మది నెమ్మదిగా నిరుద్ధమైపోతుంది. ఆ పరమాత్మతో ఎల్లవేళలా ఉండటం జరుగుతుంది. ఆపై అటువంటి వ్యక్తి ఏ వ్యవహారం చేసినా మనసు మాత్రం పరమాత్మపైనే ఉంటుంది. ధ్యేయంపైనే ఉంటుంది. అది ఎప్పుడు తన ధ్యేయం నుంచి చెదిరిపోదు.

6.27

ప్రశాన్తమనసం(మ్) హ్యేనం(య్ఁ), యోగినం(మ్) సుఖముత్తమమ్৷
ఉపైతి శాన్తరజసం(మ్), బ్రహ్మభూతమకల్మషమ్৷৷27৷৷

ప్రశాంతమైనమనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును.

ప్రశాన్తమనసం - ఇక్కడ మనసుకు ఇచ్చిన ఉపమానము ప్రశాంతము అనగా ప్రకర్షేణ శాంతః ఇతి ప్రశాన్తః - అత్యంతిక శాంతి. మనిషి యొక్క మనసు అత్యంతిక శాంతితో స్థిరమైపోయినప్పుడు. అకల్మషం - మనసులో ఏ పాపములు లేవని ఉపమానం ఇచ్చారు. ఏ చెడు ఆలోచనలు కూడా మనసులో రావు. మూడవది శాంతరజసం - ఎవరిలో అయితే రజోగుణము శాంతించినదో. పంచేంద్రియములు, మనసు, బుద్ధి కూడా ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములను కలిగియున్నవి. ఇందులో మనసు ఎక్కువగా రజోగుణ ప్రభావంతో ఉంటుంది. రజోగుణము లక్షణము మన మనసును పరిగెత్తించడం. మనసు కల్మషరహితము, పాపరహితము అయినప్పుడు దానిలో ఉన్న రజోగుణము కూడా శాంతిస్తుంది. అత్యంతిక శాంతి పొందిన, పాపరహితుడైన, రజోగుణము శాంతించిన, సశ్చిదానంద పరమాత్మతో ఏకీకృతమైన యోగి మనసుకు వేరే ఏమీ కనిపించదు. మనసు వారి తోటి ఉండి వారిలాగే అయిపోతుంది. మన మనసు ఎక్కడ ఉంటుందో మనం అక్కడే ఉంటాము. మనసు బ్రహ్మభూతము అయినప్పుడు, పరబ్రహ్మతో కలిసిపోయినప్పుడు ఆ యోగి కూడా పరబ్రహ్మ తోటే ఉండిపోతాడు, పరబ్రహ్మలో లీనమైపోతాడు. హ్యేనం(మ్), యోగినం(మ్) ఉత్తమమ్ సుఖమ్ ఉప యతి - అత్యంతిక సుఖ అనుభవాన్ని వారు పొందుతారు. అటువంటి సుఖాన్ని సుఖము అని కాకుండా ఆనందము అంటారు. సుఖానికి ఆది, అంతము ఉంటాయి. ఉత్తమమ్ సుఖ - సర్వోశ్చమైన సుఖము అంటే సశ్చిదానంద ప్రాప్తి వారికి కలుగుతుంది. ఆ యోగి ఏమి అనుభవిస్తాడు, ఆ యోగి అవస్థ ఏమిటి, ఆ యోగి దృష్టి ఎలా ఉంటుంది లాంటి విషయాలను భగవంతుడు ముందు ముందు విశదీకరిస్తాడు.

6.28

యుఞ్జన్నేవం(మ్) సదాత్మానం(య్ఁ), యోగీ విగతకల్మషః৷
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్, అత్యన్తం(మ్) సుఖమశ్నుతే৷৷28৷৷

పాపరహితుడైన ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మపరమాత్మప్రాప్తిరూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును.

విగతకల్మషః - ఎవరికైతే పాపములు నశించిపోయినవో, ఎవరైతే పాప రహితులైనారో, పాపపు ఆలోచనలు కూడా వారి మనసులో రావు. అటువంటి యోగి యుఞ్జన్నేవం(మ్) సదాత్మానం(మ్) - ఏవంమ్ సదా ఆత్మానం యుఞ్జన్ - ఈ విధముగా ఎల్లవేళలా తమ చిత్తమును పరమాత్మపైనే ఉంచుతారు. అయితే అక్కడ వారు ఏమి అనుభవిస్తారు? సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ - బ్రహ్మ యొక్క మంచి స్పర్శ. ఇక్కడ స్పర్శ అంటే చర్మమునకు సంబంధించినది కాదు. భగవంతునితో ఏకరూపమైనప్పుడు అనుభవించే స్పర్శ. ఆ పరమాత్మతో లీనమైన అనుభవాన్ని వారు పొందుతారు. అత్యన్తం(మ్) సుఖమశ్నుతే - అత్యంతమైన సుఖమును అనుభవిస్తారు. అటువంటి అవస్థలో పరబ్రహ్మతో ఏకరూపమైన యోగి, వ్యక్తి కాకుండా పరమాత్మయే అయిపోతారు. వారి దృష్టి ఎలా ఉంటుంది?

6.29

సర్వభూతస్థమాత్మానం(మ్), సర్వభూతాని చాత్మని৷
ఈక్షతే యోగయుక్తాత్మా, సర్వత్ర సమదర్శనః৷৷29৷৷

సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితిరూప యోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్థితమై యున్నట్లుగను, ప్రాణులన్నింటిని ఆత్మయందు కల్పితములుగను భావించును (చూచును).

ఇక్కడ ఒక అత్యంత మహత్వపూర్ణమైన శ్లోకాన్ని భగవంతుడు చెబుతున్నాడు. సర్వభూతస్థమాత్మానం - అన్ని భూత మాత్రములలో, ఏదైతే నిర్మాణం అవుతుందో, పెరుగుతుందో అది భూతము. అన్ని భూతములలో అంటే అన్ని వస్తువులలో, వ్యక్తులలో, ప్రాణులలో ఆ ఆత్మ, ఆ పరమాత్మ ఉన్నది. సర్వభూతాని చాత్మని - అన్ని భూతమాత్రములను పరమాత్మలో చూస్తారు. ఈ సంసారమంతటిని పరమాత్మలో చూస్తారు మరియు పరమాత్మలో ఈ సంసారమంతటిని, అన్ని భూత మాతృలను, అన్ని ప్రాణమాత్రులను చూస్తారు. ఇది నిజమైన దర్శనము. సర్వత్ర సమదర్శనః - సమత్వ దృష్టి వారికి ప్రాప్తిస్తుంది. సమత్వమే యోగము, పరమాత్మతో ఏకరూపులవటం అని వేరే అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. అందరిలో, అన్నింటిలో స్థితుడైయున్న పరమాత్మ దర్శనం వారికి కలుగుతుంది. అలాగే పరమాత్మలో స్థితులైన అన్ని. అటువంటి వ్యక్తి గుడికి వెళతాడా? అతడు గుడిలోకి వెళ్తాడు, వెళ్లి ఏమి దర్శిస్తాడు? పూజ్య స్వామీజీ ఏమి చెబుతారంటే, మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్న మూర్తిని చూస్తాము. ఆ విగ్రహం యొక్క సుందర రూపాన్ని చూస్తాము. ఆ సుందర రూపాన్ని చూస్తూ సంసారమంతటిని అందులో చూడాలి. సంసారమంతా ఆ మూర్తిలోనే ఉన్నదనుకుంటూ ఆ మూర్తిని చూడాలి. దర్శించిన ఆ రూపాన్ని హృదయంలో పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు విశ్వమంతటా ఆ మూర్తిని చూడాలి. ఇది నిజమైన దర్శనము. మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుని విగ్రహాన్ని చూసి చేతులు జోడించి కళ్ళు మూసుకుంటాము. దర్శనం కోసం వచ్చి కళ్ళు మూసుకుంటాము. ఎందుకంటే మనం దర్శించిన ఆ మూర్తిని హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అదే మూర్తిని విశ్వంలో అన్నింటిలో దర్శించడం నిజమైన దర్శనము. సమదర్శనః - అన్నింటిపై సమభావముతో దర్శించాలి. దీనిని ఎవరు చేయగలరు? యోగయుక్తాత్మా - వీరి వర్ణన ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము. అటువంటి యోగి. ఈ విధముగా యోగాభ్యాసము చేసి, యోగారూఢులై, ధ్యానములో నిమగ్నులై, యోగముతో పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి యోగులకు ఈ దర్శనము. సంత్ ఏక్నాథ్ మహారాజ్ కాశీ నుంచి గంగా జలాన్ని కావిడిలో రామేశ్వరంలో అభిషేకం చేయడానికి తీసుకు వెళుతుండగా దారిలో ఎండలో దప్పికతో ఉన్న ఒక గాడిద కనిపించింది. ఎంతో దూరం నుంచి కావిడిలో తీసుకొచ్చిన గంగా జలాన్ని ఆ గాడిదకు తాగించారు. చూసినవారు, ఎంతో ప్రయాస కోర్చి గంగా జలాన్ని రామేశ్వరంలో అభిషేకం చేయడానికి పట్టుకెళ్తూ ఈ గాడిదకు ఎందుకు తాగించారని అడుగగా, ఏక్నాథ్ మహారాజ్ గాడిద ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది రామేశ్వరుడు అంటారు. వారికి రామేశ్వరుని దర్శనము అక్కడే అయిపోయినది. అన్ని భూత మాతృలలో పరమాత్మను చూడటం ఆ యోగికి ప్రాప్తించినది. అటువంటి దృష్టి ప్రాప్తించిన యోగులకు కళ్ళ ముందు ఆ పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. యోగి ఎప్పటికీ ఆ పరమాత్మ నుంచి వేరు కాలేడు అలాగే పరమాత్మ ఆ యోగి నుంచి వేరు కాలేడు. వారు ఎప్పటికీ ఏకరూపులు అయిపోయారు. భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు ...

6.30

యో మాం(మ్) పశ్యతి సర్వత్ర, సర్వం(ఞ్) చ మయి పశ్యతి৷
తస్యాహం(న్) న ప్రణశ్యామి, స చ మే న ప్రణశ్యతి৷৷30৷৷

సకల ప్రాణులయందును ఆత్మ రూపముననున్న నన్ను (వాసుదేవుని) చూచు పురుషునకు, అట్లే ప్రాణులన్నింటికి నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను. అతడును నాకు అదృశ్యుడు కాడు.

యో - ఏ వ్యక్తి, యోగి అయితే, మాం(మ్) పశ్యతి సర్వత్ర - నన్ను అన్నింటా చూస్తాడో, సర్వం(ఞ్) చ మయి పశ్యతి - అందరినీ నాలో చూస్తాడు. ఎవరైతే అన్నింటా నన్ను చూస్తాడో మరియు నాలో అన్నింటిని చూస్తాడో అది నిజమైన దర్శనము. తస్యాహం(న్) న ప్రణశ్యామి - అతని కళ్ళలో నేనెప్పుడు మరుగవను. అతని దృష్టికి దూరము కాలేను. అన్నింటా పరమాత్మ కనిపించే వారికి పరమాత్మ ఎలా దూరం కాగలడు? ప్రణశ్యామి - అతనికి నేనెప్పుడూ అదృశ్యం కాలేను. అతనికి నేను ఎల్లవేళలా, అన్నింటా కనిపిస్తూనే ఉంటాను. స చ మే న ప్రణశ్యతి - అతడు కూడా నా కళ్ళ ముందు నుంచి, నా దృష్టి నుంచి ఎప్పుడు దూరముగా పోడు. ఎందుకంటే అతనికి అన్నింటా, ఎల్లవేళలా పరమాత్మ కనిపిస్తుంటే, పరమాత్మకు అతను కూడా ఎల్లవేళలా కనిపిస్తూనే ఉంటాడు. నా కతడు అదృశ్యము కాడు అలాగే అతనికి నేను అదృశ్యము కాను. ఇది అతని అవస్థ అవుతుంది. సమత్వ దృష్టి ప్రాప్తిస్తుంది. అతని వ్యవహారం ఎలా ఉంటుంది అన్నది భగవంతుడు తరువాత శ్లోకాల్లో చెబుతున్నాడు ...

6.31

సర్వభూతస్థితం(య్ఁ) యో మాం(మ్), భజత్యేకత్వమాస్థితః৷
సర్వథా వర్తమానో౽పి, స యోగీ మయి వర్తతే৷৷31৷৷

భగవంతునియందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మ రూపముననున్న సచ్చిదానందఘన వాసుదేవుడనైయున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును.

ఇది భగవంతుడు చెప్పిన ఒక సుందర శ్లోకం. సర్వభూతస్థితం(మ్) యో మాం(మ్) - అన్ని భూతమాత్రులలో నన్ను అనగా పరమాత్మను, భజత్యేకత్వమాస్థితః - ఏకత్వ భావముతో, త్వ అంటే భావము అని అర్థం, వారు చూస్తారు. సర్వభూతస్థితం(మ్) మాం(మ్) భజతి - సర్వ భూతములలో స్థితుడైయున్న నన్ను భజిస్తారు. అతనికి ఏ ప్రాణి కళ్ళ ముందు కనిపించినా వాటిని భగవత్ రూపంలో చూస్తాడు. మహారాష్ట్రలో ఒక వార్కరి సంప్రదాయము ఉన్నది. ఇద్దరు వార్కరిలు కలసినప్పుడు, ఇద్దరూ ఒకరి కాళ్ళపై ఇంకొకరు పడతారు. ఇద్దరూ కూడా రెండవ వారిలో ఉన్న భగవంతుని చూస్తారు. వారు వ్యక్తిని కాకుండా వ్యక్తిలోని భగవంతుని చూస్తారు. ఇదే విధంగా వారు అన్ని భూతములను భగవంతుడిని చూస్తారు. 12 వ అధ్యాయంలో భక్తిని ఈ విధంగా ఆచరించాలో చెప్పే సమయంలో భగవంతుడు "సర్వభూత హితే రతాః" అందరి హితమునకై సిద్ధముగా ఉంటారు. ఈ విధముగా వారు భగవంతునికి పూజ చేస్తున్నారు. అందరి కల్యాణానికై కార్యరథులై ఉన్నవారు భగవంతునికి భజన చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఉన్న పరమాత్మ వారికి కనిపిస్తాడు.
తూ హీ హై సర్వత్ర వ్యాప్త హరి ! తుజ్ మే యహ సారా సంసార ।
ఇసీ భావనా సే అంతర్ భర, మిలూఁ సభీ సే తుఝే నిహార ।।
నీవే అన్నిచోట్ల వ్యాపించి ఉన్న హరివి. నీలోనే ఈ సంసారమంతయు ఉన్నది. ఇదే భావనని మీ అంతరంగములో నింపుకో. అందరిలోనూ అతడే నీకు కనిపిస్తాడు. ఈ దృష్టి యోగికి ప్రాప్తిస్తుంది. సర్వథా వర్తమాన అపి - వర్తమానంలో ఉన్న కార్యములన్ని అతడు ఎల్లప్పుడూ చేస్తాడు. చూడటానికి సామాన్య వ్యక్తీ లాగ కనిపిస్తాడు. తన పని తాను చేసుకుంటాడు. సన్యాసి, యోగి అన్నది ఆంతరిక అవస్థ అని భగవంతుడు మొదట్లోనే చెప్పాడు. సామాన్య రూపంలో సామాన్యంగా కనిపించే వ్యక్తి కూడా ఈ అవస్థను చేరుకోవచ్చును. మిగతా వారికి అతడు ఒక సామాన్యుడిగా తన పనులను తాను చేసుకుంటూ కనిపిస్తాడు. స యోగీ మయి వర్తతే - కాని నిజానికి ఆయోగి నాలో ఉంటాడు. నాలో ఉంటూనే, నాలా వ్యవహరిస్తూనే ఏమి చేసినా ఆ పరమాత్మ తప్ప వేరే ఏమి అతనికి కనిపించదు. కాయగూరలను అమ్మటానికి కూర్చున్నా వాటిలో కూడా భగవంతుణ్ణి చూస్తాడు. ఇది సంతుల దర్శనం, వారి దృష్టి. సంత్ మరియు యోగి వేరువేరు కాదు. భగవంతుని నుంచి ఎవరూ వేరు కాదు. అందరూ అతని రూపమే. అందుకే భగవంతుడు స యోగీ మయి వర్తతే - ఆ యోగి నాలోనే నివసిస్తాడు అని చెబుతాడు. జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పినట్లుగా ఏ వస్త్రాన్ని చూచినా అందులో ఉన్నది దారమే, అలాగే అన్ని ప్రాణులు వేరుగా కనిపించినప్పటికీ వాటిలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమే. యోగులకు ఆ పరమాత్మ తత్వము అందరిలోనూ కనిపిస్తుంది. వారి దృష్టి ఎలా ఉంటుంది ...

6.32

ఆత్మౌపమ్యేన సర్వత్ర, సమం(మ్) పశ్యతి యో౽ర్జున৷
సుఖం(వ్ఁ) వా యది వా దుఃఖం(మ్), స యోగీ పరమో మతః৷৷32৷৷

ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలె (తనతో) సమానముగా చూచువాడును, సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా (సమానముగ) చూచువాడును (ఇతరుల సుఖదుఃఖములులను తన సుఖదుఃఖములుగా భావించువాడును) అయిన యోగి పరమ శ్రేష్ఠుడు.

స యోగీ పరమో మతః - అతడు సర్వశ్రేష్ఠ యోగి. అతని దృష్టి ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం(మ్) పశ్యతి - తనలాగే అందరిని చూస్తాడు. వేరే వారి దుఃఖం చూసి అతని హృదయం ద్రవిస్తుంది. తనకు కలిగిన దుఃఖములాగే భావిస్తాడు. వేరే వారి సుఖాన్ని చూసి ఇతడు సుఖాన్ని అనుభవిస్తాడు. అతనికి తను, పరాయ అనిపించదు. ఇద్దరూ ఒకటి లాగే భావిస్తాడు. అన్ని చోట్ల కనిపించిన పరమాత్మయే అతనికి తనలో కూడా కనిపిస్తాడు. అందుకే అతనికి వేరే వారు అభిన్న హృదయులుగా అనిపిస్తారు. అటువంటి సజ్జనుని వర్ణన సంస్కృతంలో ఒక సుందర సుభాషితము ద్వారా చేయబడినది. సజ్జనుని హృదయము ఎలా ఉంటుంది?
సజ్జనస్య హృదయం నవనీతం
వర్ణయన్తి విబుధాః తదళీకమ్
అన్యదేహ విలసత్ పరితాపాత్
సజ్జనో ద్రవతి నో నవనీతమ్
నవనీతం అంటే వెన్న. వెన్నతో సజ్జనుని హృదయాన్ని కవిపోలుస్తున్నాడు. వెన్నను కరిగించటానికి దానిని వేడి చేయవలసి ఉంటుంది. కాని వేరే వారికి కలిగిన కష్టాన్ని చూసి సజ్జనుని హృదయము కరిగిపోతుంది. ఇదే ఆత్మౌపమ్యేన సర్వత్ర, సమం(మ్) పశ్యతి. వేరే వారి దుఃఖాన్ని చూసి దుఃఖించేవారు కనిపిస్తారు. కాని వేరే వారి సుఖాన్ని చూసి ఆనందించేవారు కనిపించడం చాలా కష్టం. ఈ మధ్యలో వచ్చిన చలనచిత్రంలో ఒక సంభాషణ ఇలా ఉంటుంది - "స్నేహితుడు పరీక్ష తప్పితే దుఃఖం కలుగుతుంది, అదే స్నేహితుడు ప్రథమ స్థానంలో వస్తే ఇంకా ఎక్కువ దుఃఖం కలుగుతుంది". స్నేహితుడి విజయాన్ని తనదిగా భావించి సుఖానుభూతిని చెందాలి కాని అలా జరగదు. మనసులో మంట మొదలవుతుంది. ఇది స్నేహం కాదు, ఇది ప్రేమ కాదు, ఇది భక్తి కాదు. వేరే వారి సుఖములో సుఖాన్ని అనుభవించటం చాలా కష్టతరం. సుఖం(మ్) వా యది వా దుఃఖం(మ్) - వేరేవారి సుఖంలో కానీ దుఃఖంలో కానీ తాము ఆ అనుభూతిని పొందిన వారు నిజమైన యోగులు. ఠాకూర్ శ్రీ రామకృష్ణ పరమహంస జీవనములో ఒక ప్రసంగము ఉంది. వారికి దేహ త్యాగము చేయవలసిన సమయము ఆసన్నమైనది. వారికి గొంతులో క్యాన్సర్ గుర్తించబడినది. ఏమీ తినవద్దని చెప్పారు. వారి శిష్య, భక్త గణం వారికి ఇష్టమైన మిఠాయిలు తీసుకొని వచ్చి గురువు గారు తినలేక పోవడం చూసి బాధపడేవారు. ఒక శిష్యుడు మీరు తినలేకపోవడం చూసి మాకు చాలా బాధాకరంగా ఉంది అంటాడు. అప్పుడు ఠాకూర్ మీ అందరి ముఖముల ద్వారా ఎవరు తింటున్నారు, ఇది వారి దృష్టి. వేరే వాళ్ళు తింటున్నప్పుడు సుఖాన్ని వీరు అనుభవిస్తున్నారు. ఇది వినడానికి కష్టంగా అనిపించవచ్చు. తల్లి తన పుత్రునికి అన్నం తినిపిస్తూ అతడు బాగా తింటే ఆ తల్లి ఆనందభరితురాలు అవుతుంది. అలాగే తన భక్త, శిష్యగణం తినడం చూసి ఠాకూర్ ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ఇది ఆత్మౌపమ్యేన దృష్టి. ఇది సంతుల యొక్క దృష్టి. అటువంటివారు పరమ యోగులు. అర్జునుడు ఈ మాటలన్నీ ధ్యానంగా వింటున్నాడు. ఈ పరమ యోగ అవస్థలో చేరుకోవాలి. అర్జునుని మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎంత కష్టమో అన్న ప్రశ్న మన మనసులో కూడా వస్తుంది. ఇది ఎలా సంభవం? మన హృదయం అలా ఉంటుందా? ఈ యోగ స్థితిని మనం పొందగలమా? మన మనసులో ఉదయించే ఇలాంటి ప్రశ్నలనే అక్కడ అర్జునుడు అడుగుతున్నాడు ...

6.33

అర్జున ఉవాచ
యో౽యం(య్ఁ)యోగస్త్వయా ప్రోక్తః(స్), సామ్యేన మధుసూదన৷
ఏతస్యాహం(న్) న పశ్యామి, చఞ్చలత్వాత్స్థితిం(మ్) స్థిరామ్৷৷33৷৷

అర్జునుడు పలికెను - ఓ మధుసూదనా! సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొన లేకున్నాను.

అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు. యో యహం యోగః - యోగాన్ని, యోగ స్థితిని నువ్వు నాకు చెప్పావు. సమత్వం గురించి చెప్పావు. యోగికి ఈ సమత్వాన్ని హృదయంలో స్థాపించ వలసిన అవసరం ఉంటుంది. మీరు చెప్పిన ఈ విషయాలు నాకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. చఞ్చలత్వాత్స్థితిం(మ్) స్థిరామ్ - మీరు చెబుతున్న ఈ మాటలు వినడానికి చాలా బాగున్నాయి కాని ఈ మనసు చంచలమైనది వెంటనే మరచిపోతుంది. ఎలాగంటే కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం సమాప్తం అవగానే మనం మన పనులలో పడి దెబ్బలాటలు మొదలైపోతాయి. ఈ సమత్వము క్షణికంగా మనకి బాగా అనిపించినా, ఈ మనసును, బుద్ధిని, చిత్తమును స్థిరముగా ఉంచడము ఈ చంచలత్వము కారణంగా నాకు సంభవము అని అనిపించుటలేదు. కొన్ని క్షణాలకు ఇవి స్థిరంగా ఉన్న, కొన్ని క్షణాల పాటు అన్నింటిలో ఆ భగవంతున్ని చూడగలిగినా ఎల్లప్పుడూ ఈ స్థితిలో ఉండగలగటం నాకు సంభవం అని అనిపించుటలేదు.

6.34

చఞ్చలం(మ్) హి మనః(ఖ్) కృష్ణ, ప్రమాథి బలవద్దృఢమ్৷
తస్యాహం(న్) నిగ్రహం(మ్) మన్యే, వాయోరివ సుదుష్కరమ్৷৷34৷৷

ఓ కృష్ణా ! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. ప్రమథనశీలమైనది (బాగుగా మథించు స్వభావము గలది). దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలె మిక్కిలి దుష్కరమని భావింతును.

 ఎందుకు సాధ్యం కాదో అర్జునుడు భగవంతునికి చెబుతున్నాడు. చఞ్చలం(మ్) హి మనః(ఖ్) కృష్ణ - హే కృష్ణా, అత్యంత చంచలమైన నా మనస్సు కారణంగా ఇది సాధ్యం కాదు. దాని లక్షణం ఎలా ఉంటుంది? ప్రమాథి - మనం కవ్వంతో మజ్జిగ చిలికినట్లు మనస్సు కదులుతూ ఉంటుంది. మంథనం చేసేస్తుంది. మనస్సు ఆలోచనలన్నిటిని మంథనం చేస్తూ ఒక్క క్షణం కూడా స్థిరముగా ఉండదు. బలవద్ - ఇది బలమైనది. అత్యంత శక్తివంతమైనది. శరీరం ఎంత అలసిపోయినా మనసు ఒక్కసారి నిశ్చయించుకుంటే మరలా లేచి ఎంత కష్టమైన పని అయినా మనిషి చేయగలుగుతాడు. మనస్సు చాలా బలమైనది. అందుకే దాన్ని జయించడం కూడా చాలా కష్టం. చంచలమైనది కాబట్టి దాన్ని ఆపడం కూడా చాలా కష్టం. ద్రుఢం - చాలా గట్టిది, తన మాటను వదిలిపెట్టదు. మనస్సులో ఏదైనా ఆలోచన ఒకసారి వస్తే, దాని గురించి ఆలోచించవద్దని మనస్సుకి చెప్పినా ఆ మనసు ఒప్పుకోదు. ఆ మనస్సు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తస్యాహం(న్) నిగ్రహం(మ్) మన్యే, వాయోరివ సుదుష్కరమ్ - దాన్ని నిగ్రహించడం, నియంత్రణలో ఉంచడం గాలిని మన పిడికిలిలో బంధించటం లాంటిది. మనం గాలిని పిడికిటిలో బంధించలేము కదా. సుదుష్కరమ్ - ఇది చాలా కఠినమైనది అని నాకు అనిపిస్తోంది అని అర్జునుడు చెబుతున్నాడు. దీని గురించి జ్ఞానేశ్వర్ మహారాజ్ ఈ విధంగా చెబుతున్నారు. మనస్సుని చూడాలనుకుంటే అది కనిపించదు. ఇది అత్యంత సూక్ష్మమైనది. కాని ఇది మూడు లోకాల్ని చుట్టి వస్తుంది. ఒకచోట కూర్చుని మనస్సు అమెరికా, సింగపూర్, ముంబై, చెన్నై తిరిగి రాగలదు. క్షణంలో ఎటో వెళ్లి పోతుంది. ఒక కోతి ఒకే చోట ధ్యానంతో ఎలా కూర్చో గలదు అని జ్ఞానేశ్వర్ మహారాజ్ చెబుతున్నారు. అటు ఇటు దూకటం, గంతులు వేయడం దాని స్వభావము. తుఫాన్ ని ఆగమంటే ఆగదు కదా. మనసు బుద్ధి మాట కూడా వినదు. స్వయంగా తెలివైనదిగా భావించే బుద్ధిని కూడా ఇరికించి మనస్సు ఎటోకటు వెళ్లిపోతుంటుంది. ఇది నేను చేయ్యను, ఆలోచించను అని మనిషి నిశ్చయము చేసుకోవచ్చు కాని ఆ నిశ్చయాన్ని మనస్సు చాలా తేలికగా ఉల్లంఘిస్తుంది. ధైర్యంతో చేసిన నిశ్చయాన్ని కూడా ఇరకటంలో వేసి మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది. మనకు మంచి చెడులను తెలియజేసే వివేకాన్ని కూడా మనస్సు ఇరికిస్తుంది. ఎంత బంధించాలని చూసినా అంతకన్నా ఎక్కువ బలంతో నియంత్రణ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏ విషయాన్ని ఆలోచించకూడదనుకుంటామో మనస్సు రోజంతా దాని గురించే ఆలోచిస్తుంది. అటువంటి మనసు దాని స్వభావాన్ని విడిచిపెడుతుందా? ఇది మనసు యొక్క గుణధర్మము. ఈ గుణధర్మాన్ని మనసు ఎలా విడిచి పెడుతుంది? భగవంతుడా ఏమి చేయాలో చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు. అర్జునుని ఈ ప్రశ్నకు భగవంతుడు ఒకే శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు ...

6.35

శ్రీ భగవానువాచ
అసంశయం(మ్)మహాబాహో, మనో దుర్నిగ్రహం(ఞ్) చలమ్৷
అభ్యాసేన తు కౌన్తేయ, వైరాగ్యేణ చ గృహ్యతే৷৷35৷৷

శ్రీ భగవానుడు పలికెను - హే మహాబాహో! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపఱచుకొనుట మిక్కిలి కష్టము. కాని కౌంతేయ ! అభ్యాసవైరాగ్యములద్వారా దానిని వశపఱచుకొనుట సాధ్యమే.

అసంశయం - నీవు చెబుతున్న దానిలో ఏ సంశయం లేదు అని భగవంతుడు చెబుతున్నాడు. మనో దుర్నిగ్రహం - మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. అర్జునుడు సుదుష్కరం అంటే చాలా కఠినమైనది అని అర్థం వచ్చే పదాన్ని వాడుతాడు. దానికి సమాధానంగా భగవంతుడు కష్టమే కాని అసాధ్యం కాదు అని చెబుతాడు. చలం - నీవు చెప్పినంత చంచలము అయినది కూడా కాదు, చలితమైనది. అది కూడా నియంత్రణలోకి రాగలదు. దానికి ఏమి చేయాలన్నది భగవంతుడు చెబుతున్నాడు. అభ్యాసేన - అభ్యాసం అన్నది ఇక్కడ చాలా మహత్వపూర్ణమైన విషయం. యోగాభ్యాసము ద్వారా మనస్సు స్థిరత పొందవచ్చును. యోగాభ్యాసాన్ని చేయాలి. ఆసన, ప్రాణాయామముల ద్వారా కూడా మనసులో వచ్చిన స్థిరత్వాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చును. రోజు ఒక గంట యోగాభ్యాసం చేసిన వారు స్వయంగా తమ మనస్సు చంచలత్వం ముందుకంటే తగ్గినదని తెలుసుకోగలుగుతారు. ఈ అభ్యాసమును చేస్తూ ఉండాలి, ఎప్పుడు వదిలి పెట్టకూడదు. చదువు పూర్తయిన తర్వాత స్నాతకోత్సవంలో స్వాధ్యాయము అనగా నీవు స్వయంగా చదివేది ఎప్పుడు వదిలి పెట్టకు అని చెబుతారు. అలాగే మనం యోగాభ్యాసాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అది నిజమైన అభ్యాసం. వైరాగ్యము రెండవ ఆవశ్యకము. వైరాగ్య శబ్దముతో మనుషులకు భయం పుడుతుంది. వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం అన్న భావన ఉంటుంది. వైరాగ్య శబ్దానికి అర్థం మనం తెలుసుకోవాలి. వి + రాగ, రాగ అంటే ఆసక్తి, కర్మపై ఆసక్తి, ఏదైనా విషయముపై ఆసక్తి, ఏ వ్యక్తిపై నైనా ఆసక్తి. ఈ ఆసక్తులన్నిటిని త్యాగం చేయడాన్ని వైరాగ్యం అంటారు. దీని అర్థం విషయాలతో ఉండకూడదు అని కాదు. విషయాలతో ఉండి కూడా వాటిపై ఆసక్తిని వీడటం. మనస్సుని ఆ విషయం పైనే ఉంచితే అది రాగము అవుతుంది. మనస్సు ఆ విషయంతో అతుక్కోకుండా ఉంచగలిగితే అది వైరాగ్యం అవుతుంది. మనసు ద్వారా విషయముల గురించి ఆలోచిస్తే అది రాగం, ఆసక్తి. విషయములపై మనస్సు ఆలోచించకపోతే అది వైరాగ్యం. మనస్సు ధ్యేయంపై ఉన్నప్పుడు మిగతా విషయాలపై ఆసక్తి దానంతటదే పోతుంది, మనం వదలి పెట్టవలసిన అవసరం ఉండదు. అభ్యాసం చేస్తుంటే ఈ ఆసక్తి దానంతటదే పోతుంది మరియు మనస్సు దానంతటదే స్థిరము అవుతుంది. దీనిని అనుభవం ద్వారానే తెలుసుకోగలరు. శ్రీమద్భగవద్గీత యోగ శాస్త్రం. శాస్త్ర శబ్దానికి అర్థము విజ్ఞానము. శాస్త్రం కాబట్టి దీన్ని ప్రయోగించవలసి ఉంటుంది. ప్రయోగం చేయడానికి ప్రయోగశాల మన శరీరం. యమ, నియమములు, ఆసనములు, ప్రాణాయామము మొదలైన వాటి అభ్యాసము మనం చేస్తుంటే మన చంచల మనస్సు స్థిరము అవుతున్న అనుభూతి మనకు కలుగుతుంది. మనస్సు క్షిప్త, విక్షిప్త అవస్థలను దాటి ఏకాగ్రతను కూడా సాధిస్తుంది. దీన్ని మనిషి అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాడు. ఈ ఏకాగ్ర మనసును పరమాత్మపై ఉంచినప్పుడు నెమ్మది నెమ్మదిగా అది నిరుద్ధమైపోతుంది. ఇది యోగమునకు సర్వోశ్ఛ అవస్థ. కఠినమైనప్పటికీ అభ్యాసము, వైరాగ్యము ద్వారా దీని ప్రాప్తి మనకు కలుగుతుంది.

6.36

అసంయతాత్మనా యోగో, దుష్ప్రాప ఇతి మే మతిః৷
వశ్యాత్మనా తు యతతా, శక్యో౽వాప్తుముపాయతః৷৷36৷৷

మనస్సును వశపఱచుకొనని పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము. మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభప్రాయము.

అసంయతాత్మనా - మనసును వశపరచుకోవడానికి ప్రయత్నమే చేయని వారికి అది ఎలా అవుతుంది? ప్రయాస చేయకుండా మనసు వశమవదు. మనసును నియంత్రించడానికి ప్రయత్నం చేయకుండా ఇంద్రియములకు వదిలివేసినా, కేవలం ఇంద్రియ సుఖముల కోసమే అన్న భావనతో ఉన్నవారికి మనసు ఎప్పటికీ ఏకాగ్ర అవస్థను చేరుకోలేదు. వారికి ఈ యోగము దుష్ప్రాప అవుతుంది. వారు ఎప్పటికీ ఈ యోగమును ప్రాప్తించుకోలేరు. వశ్యాత్మనా తు యతతా, శక్యో౽వాప్తుముపాయతః - కాని ప్రయాస చేసే వ్యక్తులకు ఉపాయముల ద్వారా, యోగము యొక్క సాధనముల ద్వారా, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యహారముల మెట్లనెక్కి దీనిని సాధించుకోవచ్చు. అవాప్తుం శక్యః - ప్రాప్తించుకోవడం సాధ్యమే. ఇతి మే మతిః - ఇదే నా అభిప్రాయము. జ్ఞానేశ్వర్ మహారాజ్ కూడా చెబుతారు మనసును నియంత్రణలో పెట్టుకోవాలంటే దాని ఒక స్వభావము చంచలం అని మనకు తెలుసు. దాని రెండవ స్వభావము కూడా తెలుసుకో. ఏది బాగా అనిపిస్తుందో దానిపై మనసు ఆసక్తితో ఉంటుంది. ఆ పరమాత్మపై ఆ మనసును ఉంచితే, అక్కడ అది ఆసక్తి పెంచుకుంటుంటే మిగతా వాటి నుంచి దాని ఆసక్తి దానంతటదే తగ్గిపోతుంది. తనంతటతానే అక్కడ స్థిరమవుతుంది. మనసు యొక్క శక్తినే మనసును నియంత్రణలోకి తేవడానికి ఉపయోగించాలి. మనసును అక్కడే ఉంచటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలని జ్ఞానేశ్వర్ మౌళి చెబుతారు. ఒకసారి మనసుకు అక్కడ మక్కువ పెరిగితే అది ఇంకెక్కడికీ పోవడానికి ప్రయత్నించదు. మనసు ఆ పరమాత్మనే మాటిమాటికి తలుచుకుంటూ ఉంటుంది. దీనికి అభ్యాసం చేయడం ఆవశ్యకము. యోగాభ్యాసమును విడిచి పరమాత్మను ప్రాప్తించుకోవడం సాధ్యం కాదు. అందుకే యోగమేవాభ్యసే ప్రాద్య యదాశక్తి నిరంతరం - ఇది పరమ పూజ్య జనార్ధన్ స్వామి వారి మంత్రము, ఈ మంత్రమును గుర్తుంచుకోవాలి. జీవితంలో సుఖం, నిరుద్ధ అవస్థ ప్రాప్తించాలంటే అత్యంత అధికమైన శక్తితో యోగాభ్యాసమును చేస్తుండాలి. ఈ సందేశాన్ని భగవంతుడు మనకు ఇక్కడ ఇస్తున్నాడు. ఈ అభ్యాసము చేస్తూనే ఉండాలి. గీతను నేర్చుకున్న తర్వాత మనకి వచ్చేసిందని వదిలివేయకూడదు. గీతార్థం అంతా నాకు తెలిసిపోయింది అన్నది ఎప్పటికీ జరగదు. ఎంత లోతులోకి వెళితే అంత సుందరమైన రత్నముల వంటి అర్థములు దొరుకుతాయి. ఎన్నిసార్లు చింతన చేసినా మనకు గీతలోని నిగూఢార్ధములు దొరుకుతూనే ఉంటాయి. దీన్ని చేస్తూ ఉండటమే అభ్యాసము, స్వాధ్యాయము. ఇలా ఏదో ఒక రోజు మన మనసు నిశ్చిత రూపంలో మన ఆధీనంలోకి రావచ్చును. ఆత్మసంయమయోగము ఏదో ఒక రోజు మనకు కూడా ప్రాప్తించవచ్చును. దీనికై యోగాభ్యాసమునకు కావలసిన శక్తిని భగవంతుడు మనకి అందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈనాటి వివేచన కార్యక్రమానికి విరామమును ప్రకటించారు.
ఓం తత్ సత్ శ్రీ కృష్ణార్పణమస్తు.
ప్రశ్నోత్తరాలు

ప్రశ్న - మీరు ముందు వారం మనసు యొక్క ఐదు అవస్థల గురించి చెప్పారు. అందులో నిరుద్ధ ఒకటి. నిరుద్ధ అంటే ఏమిటో కొంచెం విస్తారంగా చెబుతారా?
సమాధానము - మనసు పరమాత్మలో ఏకాకారము అయిపోయిన తర్వాత, దానికి దాని రూపం కాని, దాని యొక్క స్వభావము కాని లేనప్పుడు, తానే పరమాత్మ స్వరూపము అయిపోయినప్పుడు అది నిరుద్ధము అయిపోయిందని చెప్పవచ్చును. ఇది యోగము యొక్క సర్వోశ్చ అవస్థ. నిరుద్ధ అవస్థలో మనసు మనసు కాకుండా పరమాత్మ స్వరూపము అయిపోతుంది.

ప్రశ్న - ఐదవ అధ్యాయములో నాలుగు, ఐదు శ్లోకాలు ఒకే గమ్యాన్ని చేరుకోవడానికి చెప్పిన రెండు విభిన్నమైన మార్గాలా?
సమాధానము - కర్మయోగము, సాంఖ్య యోగము రెండు వేరువేరని అజ్ఞానులు చెబుతారు. సాంఖ్య యోగము, కర్మయోగము ఒక్కటేనని తెలుసుకున్నవారు నిజముగా తెలుసుకున్నట్లు. నాలుగవ శ్లోకంలో చెప్పినదే భగవంతుడు అయిదవ శ్లోకంలో కూడా వేరే విధంగా చెబుతాడు. ఒకే సత్యాన్ని వేరువేరు విధములుగా ప్రస్తుతించబడుతుంది.

ప్రశ్న - ఏమి చేసినా మనసు ఆధీనములో ఉండదు. దీనిని ఏ విధంగా నియంత్రించవలెను? యోగ స్థితిని మనం ఎలా పొందగలం?
సమాధానము - రేపటి నుంచి ఆసన ప్రాణాయాములను అభ్యాసం చేయడం మొదలు పెట్టండి. వీటిని మనసుపెట్టి అభ్యాసం చేయండి. ఆసనములు వేసినప్పుడు శరీరంలో ఏ భాగంపై ఎక్కువ ఒత్తిడి పడుతుందో దానిపై మనసును ఉంచాలి. ఈ విధంగా క్రమక్రమంగా మనసు మన శరీర అంగములతో ఏకమవుతూ ఉంటుంది. ప్రణాయామం చేసినప్పుడు మనసును ఆ వాయు తత్వంతో జోడించాలి. వాయువు పరమాత్మలానే విశ్వవ్యాప్తి అయినది. మనసును వాయుతత్వంతో జోడించడం వల్ల అది విశాలమవుతుంది. మనసు ఏకాగ్రం అవుతుంది.

ప్రశ్న - తొమ్మిదవ అధ్యాయములో 20, 21 శ్లోకములలో భగవంతుడు ఇచ్చిన సందేశము, 15వ అధ్యాయంలోని ఆరవ శ్లోకంలో ఇచ్చిన సందేశముతో పోల్చినప్పుడు గందరగోళంగా ఉంటుంది. దీనిని కొంచెం విడమర్చి చెప్పండి.
సమాధానము - వేదములు చెప్పిన కర్మలను జనులు ఆచరిస్తారు. దానికోసం యజ్ఞ యాగాలు చేస్తారు. స్వర్గ సుఖం కావాలని ఇక వేరే అవసరం లేదని ప్రార్థిస్తూ చేస్తారు. మనకి స్వర్గం కావాలా భగవంతుడు కావాలా అన్నది ముందు నిశ్చయించుకోవాలి. మంచి కర్మల ద్వారా స్వర్గ ప్రాప్తిని పొంది అచ్చటి భోగములను అనుభవించి పుణ్యములు సమాప్తి అయిన తరువాత తిరిగి మానవలోకానికి రావలసి ఉంటుంది. ఇటువంటి తప్పు చేయకూడదు. 15వ అధ్యాయంలో భగవంతుడు స్వర్గము గురించి కాకుండా బాగా పరమధామమును గురించి చెబుతాడు. నా పరంధామమును సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశింప చేయలేరు. వారి ప్రకాశమే నా నుంచి వచ్చినది. అక్కడికి వెళ్లిన వారికి వెనక్కి రావలసి ఉండదు. అంటే ఆ మనుషుడు పరమాత్మతో ఏకరూపుడైపోతాడు. యజ్ఞ యాగాదులు స్వర్గ ప్రాప్తికై కాకుండా పరమాత్మ ప్రాప్తికై చేయాలి.

ప్రశ్న - ఉల్లి, వెల్లుల్లి మనసును నియంత్రించడానికి వ్యతిరేకముగా పనిచేస్తాయా?
సమాధానము - ఆయుర్వేదము ప్రకారము మనసును విచలితము చేసే పదార్థాలు ఏమీ తినరాదు. అన్ని ఉపాయములలో ఇది కూడా ఒక ఉపాయము. ఆయుర్వేదము దేనిని మందులా తీసుకోమని చెబుతుందో దాన్ని మందు మాత్రలో మాత్రమే తీసుకోవాలి. అప్పుడు అది బాగానే ఉంటుంది. చిత్తమును విచలితము చేసే పదార్ధములను త్యాగము చేయవలెను. ఇది క్షత్రియలకు వర్జితము కాదు కాని యోగాభ్యాసం చేస్తూ ధ్యానము చేసుకునే వారికి వర్జితము. స్వయాన్ని ఇతర భూత మాత్రులలో చూసినప్పుడు ఇతర భూతమాత్రుల మాంసాన్ని తింటారా? తమని తాము చంపుకోలేరు కదా. మన ధ్యేయాన్ని అనుసరించి మన కార్యములు, వ్యవహారము, ఆహారము మారిపోతాయి. అందుకే భగవంతుడు యుక్తాహార విహారస్య అనే శబ్దాన్ని ప్రయోగించాడు. ప్రతి వ్యక్తికి యుక్తమైన ఆహారము వేరువేరుగా ఉంటుంది. వ్యాయామము చేసే యువకుడి ఆహారము, ఒక వృద్ధుడి ఆహారము, ఒక బాలుని ఆహారము వేరువేరుగా ఉంటాయి.

ప్రశ్న - నేను ఉదయాన్నే లేచి స్నానం అయిన తర్వాత చాలాసేపు శివనామస్మరణం చేస్తాను. ఆ తరువాత ధ్యానంలో కూర్చున్నప్పుడు చతుర్భుజుడైన విష్ణు ఆకారము కనిపిస్తుంది. జన్మాష్టమికి శ్రీకృష్ణుని దయ నాపై కలిగింది అనిపిస్తుంది. ఈ గంధరగోల పరిస్థితికి కారణం ఏమిటి? మార్గదర్శనము చేయండి.
సమాధానము - పరమాత్మ ఒక్కడే. నామాలు వేరైనా, రూపాలు వేరైనా ఆ పరమాత్మ ఒక్కడే. ఈ భావన వచ్చిన తరువాత కాసేపు శివుని రూపాన్ని మరి కాసేపు విష్ణు రూపాన్ని భజిస్తే దానిలో తేడా ఉండదు కదా. అంతా ఒక్కటే కదా. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఎంతో అద్భుతంగా దీన్ని వివరించారు. మనది ఒకటే శరీరం. దానికి కుడి చేయి, ఎడమ చేయి, కళ్ళు, ముక్కు, నోరు, కాళ్లు అన్నీ వేరు వేరు. కాని అన్ని ఒక శరీరంలోని భాగమే. వేరువేరుగా కనిపిస్తాయి, వేరువేరు కానీ ఒక్కటే. అలాగే భగవంతుని కూడా వేరువేరుగా భావించరాదు. చూడటానికి వేరువేరు రూపములు ఉండవచ్చును. పరమాత్మ ఒక్కడే అన్న భావన ఉంటే మీ మనసు గందరగోళానికి గురికాదు. బేధ దృష్టి మన అజ్ఞానము. అబేధ దృష్టి మన జ్ఞానము.

ప్రశ్న - గరుడ పురాణంలో మన శరీరము నశించిన తర్వాత మన పాపములకు దండన లభిస్తుందని చెబుతారు. ఆత్మకు అస్థిత్వము లేదు కదా మరి ఎలా దండిస్తారు?
సమాధానము - శరీరము మూడు రకములుగా ఉంటుంది. ఒకటి భౌతికమైన మన ఈ జఢ శరీరము. రెండవది సూక్ష్మ శరీరము. ఇందులో మనసు, అహంకారము, బుద్ధి ఉంటాయి. మూడవది కారణ శరీరము. ఆ పరమాత్మతో మన సూక్ష్మ శరీరము కలసిపోయినప్పుడు మనం జీవిస్తాము. జడ శరీరము ఆ పరమాత్మతో కలవలేదు. సూక్ష్మ శరీరము పరమాత్మ నుంచి విడిపోయినప్పుడు మనం మరణిస్తాం. 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన వాసనలు, కోరికలు ఈ సూక్ష్మ శరీరం తనతో తీసుకు వెళుతుంది. అది వేరే ఒక శరీరంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి మరల దాని ప్రయాణం మొదలవుతుంది. దీని అంతటిని భగవంతుడు వివరంగా తరువాతి శ్లోకాలలో చెబుతాడు.

ప్రార్థన, సామూహిక హనుమాన్ చాలీసా పఠనముతో ఈ కార్యక్రమము సంపన్నము అయినది.