వివేచకులు: గీత విశారద శ్రీ శ్రీనివాస వర్ణేకర్ గారు/
జయశ్రీకృష్ణ! జయ భరతమాత! జయ గీతాపరివార్!
భగవద్గీతా యందలి పదవ అధ్యాయమైన విభూతి యోగము యొక్క ఉత్తరార్థ వివేచన సత్రమును మన భారతీయ సంస్కృతికి ఆధారమైన భగవత్ప్రార్థన, గురువందన మరియు దీపప్రజ్వలనతో ఆరంభించడము జరిగినది. జ్ఞానముతో తపస్సు వృద్ధి పొందును. కర్మతో ఫలము ప్రాప్తించును. కష్టముల వలన సాహసము వృద్ధి పొందును. భక్తి ద్వారా మనసు శాంతపడును. అందువలన భక్తి, జ్ఞానములను పెంపొందించుట కొరకు ఈ వివేచనా సత్రములు సహాయపడును. విభూతియోగము యొక్క ఉత్తరార్థ వివేచనా సత్రమును పరమ ఆదరణీయ శ్రీనివాస్ వర్ణేకర్ కాకాజీ గారు ప్రారంభించారు. వీరు పరమపూజ్య సద్గురు స్వామి గోవింద్ దేవ్ గిరిజీమహారాజ్ గారి పరమ స్నేహితులు. గీతావిశారదులు మరియు కంఠమునందు సరస్వతీ మాతనునిలుపుకున్న మహారాష్ట్ర నివాసులు. వీరు సివిల్ ఇంజనీరుగా పనిచేశారు. బహుముఖ ప్రతిభాధనులు. గురువుగారి శ్రీ చరణములందువందనము సమర్పిస్తూ గీతా ప్రేమీ సాధకులు అందరికీ హృదయపూర్వక అభివాదములు తెలుపుతూ, శ్రీ వర్ణేకర్ గారు 10వ అధ్యాయమైన విభూతి యోగము యొక్క ఉత్తరార్థ వివేచనమును ఈవిధముగా ప్రారంభించారు. కణ కణమునందు అనగా సర్వత్రావిరాజితులై యున్న పరమాత్మను వారి యొక్క ఉనికిని,అనుభూతిని విశేష రూపముగా ఎలా, ఎక్కడ, ఎవరిలో మనము చూడగలమో తెలిపే అధ్యాయము ఈ విభూతి యోగము. పూర్వము తెలియజేసిన శ్లోకములలో కొన్ని విభూతులను తెలుసుకున్నాము. ఆ పరమాత్మ యొక్క స్వరూపముగా వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడుగా, రుద్రులలో శంకర భగవానులుగా, యక్ష రాక్షసులలో కుబేరుడుగా, శిఖరములలో మేరు శిఖరముగా మనము తెలుసుకున్నాము. ఇంకనూ ఆ పరమాత్మ యొక్క విభూతులను వారి మఖారవిందము ద్వారానే మనము తెలుసుకుందాము.
10.28 . శస్త్రములు అనగా ఆయుధములు. ఇట్టి ఆయుధములన్నింటిలోకి శ్రేష్ఠమైనది దేవేంద్రుడి యొక్క వజ్రాయుధము. అట్టి వజ్రాయుధము నా యొక్క స్వరూపము అని పరమాత్మ, అర్జునునికి తెలిపారు . దధీచి ఋషి త్యాగానికి చిహ్నముగా వజ్రాయుధము తయారుచేయబడినది. వజ్రాయుధము యొక్క మహిమ ఎంతటిదంటే ఇప్పటికీ ఈరోజు వరకు మన భారత జవానులు ఎవరైనా పరమగతిని పొందితే వారికి గౌరవ సూచకముగా లభించే పరమవీరచక్రముపై భారతదేశ చిహ్నముతో పాటు నాలుగు వజ్రపు నమూనాలు కలిగిన పతకము అంకితము చేయబడును. అలాగే ధేనువులన్నింటిలోకి క్షీరసాగరము నుండి ఉద్భవించిన కామధేనువు పరమాత్మ స్వరూపము. ఇంకనూ విశ్వకార్యము జరుగుతూ ఉండాలంటే ప్రజల ఉత్పత్తి జరుగుతూనే ఉండాలి.అట్టి ఉత్పత్తికి కారణము అయిన కామ దేవుడు అనగా మన్మథుడు కూడా పరమాత్మ స్వరూపమే. అలాగే సర్పములన్నింటిలోకి వాసుకి అనే సర్పము పరమాత్మ స్వరూపము.
10.29 'నాగానామ్ 'సర్పములలోని రకములలో నాగులు ఒక రకము. నాగులకు శిరస్సులనేకములు ఉండును. కాని విషము ఉండదు. సర్పములకు ఒకే శిరస్సు ఉండును. కాని విషము ఉండును. నాగులకు, సర్పములకు ఇదియే భేదము. ఇలాంటి నాగులలో అనంతుడను. జల దేవతలలో వరుణుడను. అలాగే పితృదేవతలలో ఆర్యమయు మరియు ఏ యమరాజు ఆజ్ఞ వలన మనకు మృత్యువు ప్రాప్తిస్తుందో అట్టి ప్రజలందరినీ శాసించే యముడు కూడా పరమాత్మ స్వరూపమే. యముడే భగవాన్ విభూతి అయితే భగవంతుడిని పొందినట్టే కదా! అందువలన బాధపడాల్సిన అవసరం లేదు. భగవద్గీతా మృత్యువు అనే భయము నుండి ముక్తిని కలిగిస్తుంది. ఈ సంసారములో ఎన్నో రకాల భయాలు కలవు. వాటినుండి మరియు మృత్యువు నుండి ముక్తిని కలిగించేది భగవద్గీతా. యమరాజు దర్శనము కలిగితే భగవాన్ దర్శనము కలిగినట్లే అని భావించవలెను.
దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే.
10.30 ధైత్యులకులము నందు పరమాత్మ ఉపస్థితి కలదు. భగవంతుని నుండి వేరు కాని వాడు భక్తుడు. నిర్మల భక్తి కలిగిన భక్తుడు, భగవంతుడు ఒక్కరే. అట్టి భక్త ప్రహల్లాద రూపములో ప్రకటితమైన వాడు పరమాత్మ స్వరూపమే. మనము ప్రతీరోజు చేసే పూజలో చెప్పుకునే సంకల్పములో వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అని చదువుతాము. ఇప్పటివరకు ఆరు మన్వంతరాలు గడిచినవి. ఈ కాలజ్ఞానము గురించి మనము 8వ అధ్యాయములో తెలుసుకున్నాము. సృష్టికర్త బ్రహ్మ గారి ఒక రోజు 864,00,00,000 సంవత్సరములుగా తెలుసుకున్నాము. ఈ కాలగణనమును జ్యోతిష్య శాస్త్రము లెక్కించి చెప్పింది. దేనినైతే గణన చేస్తున్నారో దాని యందు గల కాలము పరమాత్మ అయి ఉన్నారు. గతము, వర్తమానము, భవిష్యత్తు ఇదంతా భగవంతుని స్థితే! మనకు లభించినది చాలా చిన్న జీవితము. దీనిలో ఒక్క క్షణము కూడా వ్యర్థము కాకూడదు అని అనుకుంటే, ఒక్కొక్క క్షణము జరిగిపోతూ ఉంటే మనము భగవంతునికి దూరము అవుతున్నాము అనే భావనను కలిగి ఉంటే భగవద్దర్శనము అక్కడే కలుగును. ఇంకనూ వనచరములన్నింటిలోకి రాజైన సింహము యొక్క గర్జనను విని ఉన్మత్త ఏనుగు కూడా శాంతపడును. అట్టి వనరాజు సింహము దర్శనము కలిగితే ప్రత్యక్ష భగవంతుడి దర్శనము కలిగినట్టే. పక్షులన్నింటిలోకి సర్వశక్తిమంతుడైన, భగవంతుని వాహనమైన గరుడపక్షి కూడా పరమాత్మ స్వరూపమే.
10.31 పవిత్రమొనర్చు వారిలో లేక వేగవంతులలో వాయువు పరమాత్మ అయి ఉన్నాడు. పవిత్రము చేసే వాటన్నింటిలోకి వాయువు సర్వ శ్రేష్టమైనది. మనము వాయువును ఎంతగా కాలుష్యము చేసినా కూడా ఆ కాలుష్యమును సమాప్తము చేస్తూ స్వచ్ఛమైన గాలిని మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా పొందినప్పుడు అది ఆ పరమాత్మ యొక్క సంస్పర్శానుభవమే. క్షత్రియుల యొక్క ఉనికి వారి శస్త్రము ద్వారానే తెలియబడును.ఇక శస్త్రధారులందరిలోకి కోదండదారి అయిన శ్రీరామచంద్రుడు పరమాత్మ స్వరూపము. "రామో విగ్రహవాన్ ధర్మః" ధర్మము అంటే ఏమిటి? ధర్మమును ఆచరించడం అంటే ఏమిటి? అని తెలుసుకోవాలంటే రామచంద్రుల జీవితాన్ని తెలుసుకోవాలి. వనమునకు బయలుదేరినప్పుడు సకల భోగములను వదిలి నారవస్త్రములు ధరించారు, కాని కోదండమును మాత్రము త్యజించలేదు. అలాంటి ధర్మమూర్తులు శస్త్రములను ధరిస్తే వారిలో శ్రీరాముల వారు పరమాత్మ స్వరూపము. జలచరములన్నింటిలోకి నీటిలో ఉన్న మకరము యొక్క శక్తి అధికమైనది. అందువలన నీటిలో గల మొసలి పరమాత్మ స్వరూపము. ఈ జగత్తులో ఎన్నో రకాల నదులు, సరస్సులు, సముద్రములు కలవు. కాని వాటన్నింటిలోకి పవిత్రమైన గంగాజలము పరమాత్మ స్వరూపము. గంగాజలము ఎంత పవిత్రమైనదంటే అది అందరినీ, అంతటినీ పవిత్రము చేయగలదు. గంగా స్నానము చేసిన తర్వాత పొందే ఆనందము మాటలలో వ్యక్తపరచలేము. రిషీకేష్ లో గంగా నది చూడగానే సాక్షాత్ భగవంతుని దర్శనము కలిగిన అనుభూతి లభించును, అని వివేచన కర్త శ్రీనివాస్ వర్ణేకర్ గారు తన అనుభూతిని తెలియజేశారు. గంగానది, ఆ భాగీరథి పరమాత్మ స్వరూపమే.
ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను. (సృష్టి స్థితిలయ కారకుడను నేనే). విద్యలలో అధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. పరస్పరవాదవివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు 'వాదము'ను నేను.
10.32 పరమాత్మ సంకల్పంతోనే ఈ సృష్టి జరిగినది. అది యగయుగాలుగా నడుస్తూనే ఉంది. మన పుట్టుక, జీవనము, చావులు అన్ని అందులోనే ఇమిడి ఉన్నాయి. వీటన్నింటికీ ఆధారము, కారణము తానే అయి ఉన్నారు. అలాగే ప్రళయములో ఈ సృష్టి అంతమగును. దానికి సాక్షిగా తానే అయి ఉన్నారు. అందువలన ఈ చరాచర సృష్టి యొక్క ఆది మధ్య అంతముల యొక్క స్వరూపము ఆ పరమాత్మనే. 13వ అధ్యాయములోని 12వ శ్లోకము నందు అధ్యాత్మ జ్ఞానము, దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడో ఒకానొకవేళ ఉండుట చాలదనియు, నిరంతరము అట్టి జ్ఞానము హృదయమున వెలుగొందుచుండ వలెననియు బోధింపబడినది. తత్త్వ జ్ఞానమును మాటలచే చెప్పుట చాలదనియు, ప్రత్యక్షముగా దర్శించి అనుభూతమొనర్చు కొనవలెనని ఆదేశింపబడినది. అందువలన జగత్తు నందు గల జ్ఞానములలో, విద్యలలో సర్వశ్రేష్ఠ విద్య అధ్యాత్మవిద్య అనగా ఆత్మజ్ఞానము. నేను ఎవరిని? అని తెలియజేసే విద్య సర్వోత్తమమైన విద్య. దీనిని తెలుసుకోవడము కష్టసాధ్యము, కాని తెలుసుకున్న వాడికి ఇక మాట్లాడవలసిన అవసరమే లేదు. పరమాత్మను తన స్వరూపముగా తెలుసుకున్న వాడు చిదానంద రూప శివోహం శివోహం అంటూ స్వయముగా శివుడే అయిపోతాడు. ఆత్మజ్ఞానము పొందిన సంత్ మహాత్ముల ముందు మనకు తెలియకుండానే శరణాగతి పొందుతాము. దానికి కారణము వారు పరమాత్మ స్వరూపులు. విద్యలలో కెల్ల ఇట్టి ఆధ్యాత్మ విద్య పరమాత్మ స్వరూపమే.
ఏ వాదన ద్వారా తత్త్వ జ్ఞానము నిర్మాణమగునో, అట్టి సమగ్ర జ్ఞానమును అందించే సంవాదము పరమాత్మ స్వరూపము. కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతా పరమాత్మ యొక్క విభూతియే. గీతా లో తెలిపిన విషయాల ఆచరణ ద్వారా మనుష్యుడు సంపూర్ణ ఆత్మజ్ఞాన ప్రాప్తి పొందగలడు. అందువలన గీతా పఠనం, గీతాను పఠింప చేయడము, జీవితములో ఆచరించడము అనేది పూజ్య స్వామీజీ ఎల్లప్పుడూ సాధకులందరికీ సూచిస్తూ ఉంటారు.
10.33 ప్రణవము అనగా ఓంకారము . ఇది మూడు అక్షరములు అ,ఉ,మ తో కూడియుండును. వీటిలో అక్షరమాలలోని మొదటి అక్షరమైన అకారము అనేది పరమాత్మ యొక్క స్వరూపము. అకారము ఎక్కడెక్కడ పలకబడునో అది పరమాత్మ స్వరూపము అనే భావన కలిగి ఉండాలి. అలాగే వ్యాకరణములలో ఉన్న విషయములన్నింటిలోకి సమాసములలోని ద్వంద్వ సమాసము పరమాత్మ స్వరూపము. ప్రతి మానవుని యొక్క వర్తమాన జీవితములో కలిగే ద్వంద్వములన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. జీవరాశులన్నింటినీ ధారణచేసేది పృథ్వి మాత. ఆకాశములో ఈ పృథ్విని సూర్య భగవానుని గురుత్వాకర్షణ శక్తి ధారణ చేసి ఉంటుంది. అందువల్ల సూర్య కక్ష్యలో భూమి భ్రమిస్తూ ఉంటుంది. ఈ సూర్యుడిని మరియు అంతరిక్షములో అలాంటి ఎన్నో రకాల సూర్యులు మరియు లెక్కలేని ఆకాశగంగలన్నింటినీ అనగా సంపూర్ణ విశ్వమును ధారణ చేసే శక్తి ఎవరు? అని చింతన చేస్తే అతడు పరమాత్మనే అని అవగతము అవుతుంది. జీవులన్నింటియందు ఉన్న ప్రాణములను ధారణ చేసేవారు వారే. అందువలన మన అంతరంగము నందు వారే ఉన్నారు. అలాగే ఈ విరాట విశ్వమును ధారణ చేసేవారు వారే. సూక్ష్మాతి సూక్ష్మజీవిని కూడా ధారణ చేసేది ఆ పరమాత్మనే. ఈ విధమైన చింతన చేస్తే పరమాత్మ దర్శనము కలుగును.
అన్నిప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్తప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందఱును నేనే.
10.34 ఒక దొంగ ఇంటిలోని వస్తువులన్నింటినీ ఏవిధముగా దొంగిలించుకుని తీసుకొని వెళ్ళిపోతాడో, అలాగే జీవితములో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు, మంచి చెడులు, పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు, జ్ఞానము అన్నింటినీ మృత్యువు తీసుకొని వెళ్ళిపోతుంది. సర్వాన్ని హరించేది మృత్యువు. దానికోసము భయము పెట్టుకోవద్దు. అలాంటి మృత్యువు పరమాత్మ స్వరూపము. అలాగే ఈ సంసారములో ఏదైతే నూతనముగా ఉత్పత్తి జరుగునో దానికి కూడా కారణము పరమాత్మ. అలాగే స్త్రీవాచక సంఙ్ఞలలో కీర్తి, శ్రీః అనగా లక్ష్మీదేవి, వాణీ అనగా సరస్వతీమాత, స్మృతిః అనగా స్మరణ శక్తి, విస్మరణ శక్తి, మేధా (అనగా బుద్ధి దాటిన తర్వాత కలిగే స్థితి, ఈ మేధాశక్తి ఆత్మజ్ఞాన ప్రాప్తిని పొందడానికి సహకారిగా ఉండును) అలాగే ధృతిః అనగా ధారణ శక్తి, ధైర్యము శౌర్యము మరియు క్షమా గుణములు ఇవన్నీయూ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపములు. ఏవైనా సంకటాలు వస్తున్నాయి అంటే క్రోధము కలిగినా అనుకూలమైన సమయము వరకు సంయమనం పాటించి ఓపికతో ఆ సంకటాన్ని ఎదుర్కోవడమే ధైర్యము. ఉదాహరణగా శివాజీ మహారాజు గారు అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని ఓడించే విధానము. అలాగే ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఎదురుగా వెళ్లి దానితో తలపడి జీవించగలగడము శౌర్యము. సంత్ మహాత్ముల దగ్గరికి వెళ్లి వారికి నమస్కరించినప్పుడు, మనము చేసిన పాపపుణ్యముల నుండి బయట పడవేయగల క్షమాశీలత వారికి ఉండును. ఇట్టి ధైర్య, శౌర్య, క్షమాశీలత అనే గుణములు పరమాత్ముని స్వరూపములు.
10.35 సామవేద గానములలో బృహత్సామమును, ఛందస్సులన్నింటిలో వేద గాయత్రియును, ఋతువులన్నింటిలోకి వసంత ఋతువును, మాసములలో మార్గశీర్షమును నేనే అయి ఉన్నానని పరమాత్మ తెలియజేస్తున్నారు. పూర్వము మార్గశీర్ష మాసము నుండి కాలగణన జరిగేదని లోకమాన్య తిలక్ గారు సిద్ధి చేసి చూపించారు. అలాగే శ్రీమద్ భగవద్గీతా జన్మించినది మార్గశీర్ష ఏకాదశి రోజు. మనము ఈ రోజును గీతా జయంతిగా జరుపుకుంటాము. విశ్వములో ఇలాంటిది ఒకే ఒక పుస్తకము కలదు. దాని యొక్క జయంతి 5000 సంవత్సరాల తర్వాత కూడా మనము జరుపుకోగలుగుతున్నాము. అలాంటి మార్గశిర మాసము పరమాత్మ స్వరూపము. అలాగే కనులవిందుగా ఉండే వసంత ఋతువులో మనకు లభించే ఆనందములో, ఆ పరమాత్మ యొక్క సాన్నిద్యము మనము పొందగలము. అట్టి వసంత ఋతువు కూడా పరమాత్మ స్వరూపమే.
వంచక వ్యాపారములలో నేను జూదమును అయి ఉన్నాను. అందరి ముందు కపటముగా ఆడబడేది జూదము. దేని కారణముగా పాండవులు కష్టములలో మునిగిపోయారో ఆ జూదమును కూడా నేనే అయి ఉన్నానని పరమాత్మ తెలియజేస్తున్నారు. కొందరు దొంగలించడములో ప్రావీణ్యతను కలిగి ఉంటారు. సందేహము కలగకుండా మన దగ్గర గల ధనమును, వస్తువులను అతి సులభముగా దొంగిలిస్తారు. ఇలాంటి హస్తకళలను భగవంతుడు తప్పా ఎవరు ప్రదర్శించలేరు. కాబట్టి చలకపటములలో కూడా నా దర్శనము కలుగును అని పరమాత్మ తెలియజేస్తున్నారు. దేవాలయములో ఉన్న సకారాత్మక దైవశక్తి, ఆ దేవాలయంలోకి వెళ్ళిన భక్తుల మనుసులలో గల నకారాత్మక అసుర శక్తిని సన్నగిల్లేలా చేస్తుంది. ఇలాంటి సకారాత్మక తేజ శక్తులన్నింటిలో ఉన్నది పరమాత్మనే. పాపఆలోచనలతో కూడిన మనుజుడు సంత్ మహర్షుల దగ్గరకు వెళితే వారి యొక్క తేజస్సు కారణముగా ఆ మనుజుని పాప ఆలోచనలు నష్టమగును. ఏ తేజస్సు యొక్క ప్రభావము ముందు మిగిలినవన్నీ కూడా వెలవెల పోవునో అట్టి తేజస్ శక్తి పరమాత్మ స్వరూపము .
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతి ర్ధ్రువా నీతిర్మతిర్మమ|
ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు, ఎచట ధనుర్ధారి అగు అర్జునుడు ఉందురో అచట సంపదయు, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతి ఉండునని పరమాత్మ తెలియజేస్తున్నారు. జీవితములో ఎవరైనా విజయము పొందవలెననినా వారు భగవంతున్ని విడవరాదు. వాఙ్ఞయరూపి శ్రీకృష్ణుడు భగవాన్ స్వరూపమే, వారి చేయి పట్టుకొని నడిచినచో మనకు అపజయము ఎన్నడూ కలుగదు. రెండవ అధ్యాయంలోని 41వ శ్లోకములో చెప్పిన విధముగా, నిశ్చయబుద్ధి లేని వారికి అనేక కారణములు లభించును. కాని నిశ్చయబుద్ధి కలవానికి ఒకటే సమాధానము. పరమాత్మను సాక్షిగా కాక, వారిని ఆశ్రయించి నిశ్చయించిన పని ఎల్లప్పుడూ జయమునే పొందును. ఎప్పుడైతే మనము భగవంతుని ఆశ్రయించి ఒక పనిని నిశ్చయించుకుంటామో దానిని సాధించడానికి పరమాత్మ మనతో పాటు ప్రయత్నము చేయును. అందువలన ప్రయత్నము అనేది ఆ పరమాత్మ యొక్క స్వరూపము అని భగవాన్ తెలియజేస్తున్నారు. అలాగే సాత్విక గుణములు గల వ్యక్తిలోని ఆ సాత్వికత్వమును నేనే అని, నా కారణముగానే అతడు సాత్వికతను పొందుతాడు అని పరమాత్మ తెలియజేస్తున్నారు.
10.37 వృష్ణివంశస్థులగు యాదవులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను, శ్రీకృష్ణుడను అయిన నేనే, నా ప్రకటరూపమును అని పరమాత్మ తెలియజేస్తున్నారు.16 వ అధ్యాయములో దైవీ సంపద గురించి వర్ణించినప్పుడు ఆ సంపద అంతా అర్జునుని వద్ద కలదని అందువలన అర్జునుడు కూడా పరమాత్మ యొక్క విభూతులలో ఒకరు అని, పాండవులలో అర్జునా! నీవే నా యొక్క రూపము అని పరమాత్మ తెలియజేశారు. అలాగే వేదములన్నింటినీ మనుషులకు పఠించుటకు యోగ్యముగా రచించిన, అలాగే పంచమవేదమైన మహాభారతాన్ని రచించిన మరియు శ్రీ మహాభారతము యొక్క అంశ మరియు సారము అయిన భగవద్గీతా అనగా శ్రీకృష్ణార్జున సంవాదమును భగవద్గీతా రూపములో శబ్దబద్ధము చేసి మనకు అందించిన భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు కూడా నా యొక్క స్వరూపమే. ఇంకనూ కవులలో సర్వశ్రేష్ఠ కవి శుక్రాచార్యులు కూడా నా స్వరూపమే అని పరమాత్మ తన విభూతులను తెలియజేస్తున్నారు.
10.38 దండించే శక్తులు నా స్వరూపమే. రాజు పట్టాభిషిక్తుడైన తర్వాత ఎవరు నన్ను దండించలేరు అనే అహంకారమును కలిగి ఉంటే, రాజ పురోహితుల వారు వచ్చి ధర్మము అనే దండమును చూపించి, రాజు ధర్మము తప్పితే వారికి కూడా దండన తప్పదు అని తెలియజేస్తారు. అందువలన దండించు వారి యొక్క దండనమును అనగా శిక్షయు నేనే అయి ఉన్నాను అని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఎవరైతే విజయము కోరుకుంటారో వారు నిజాయితీగా యోగ్యమైన మార్గము ద్వారా విజయమును పొందవలెను. విజయమునకు కారణమైన 'నీతి' నేనే అయి ఉన్నానని పరమాత్మ తెలియజేస్తున్నారు. మౌనముగా ఉన్నంతవరకు ఏ విషయము అయినా గోపనీయమైనదే. అందువలన అన్ని రహస్యములలో మౌన శక్తి కలదు. మౌనమునందు సర్వాధిక శక్తి కలదు. జ్ఞానముతో మనుషులు పరిపూర్ణమైతే వారంతటవారే మౌనంగా మారతారు. మౌనము అనేది జ్ఞాన లక్షణము. జ్ఞానిలో గల జ్ఞానము ఆ పరమాత్మవిభుతియే.
ఓ అర్జునా! సర్వప్రాణులఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేనులేని చరాచరప్రాణియేదియును లేదు.
10.39 ఈ జగత్తునకు బీజము పరమాత్మ అయి ఉన్నారు. నిర్మించబడి ఉన్న సర్వభూతములందు బీజము పరమాత్మ అయి ఉన్నారు. చరాచరములందు పరమాత్మ యొక్క స్వరూపములకు, మహిమలకు అంతము లేదు. ఈ సంసారము యొక్క అంతము ఎప్పుడో తెలుసుకోలేని మానవులు పరమాత్మ యొక్క ఆద్యంతములు ఎలా తెలుసుకొనగలరు.
ఓ పరంతపా! నా దివ్యవిభూతులకు అంతమే లేదు. నా విభూతులవిస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని.
10.40 పరమాత్మ యొక్క దివ్య మహిమలకు అంతము లేదు. అవి అనంతములు. మంచిలో మంచి అనగా విశేషములే భగవంతుని యొక్క రూపము. ద్రోణాచార్యుల వారు ఒకసారి దుర్యోధనుడితో ఒక్క చెడు లక్షణము కూడా లేని వాడిని తీసుకొని రమ్మనగా, వెదకటానికి వెళ్ళి తిరిగి వచ్చిన దుర్యోధనుడు అలాంటివారు నాకు ఒక్కరు కూడా కనపడలేదు అని తెలియజేశాడు. తరువాత యుధిష్టిరుడిని, కొంత చెడు లక్షణములు కలిగినా సరే అలాంటి వ్యక్తిని తీసుకుని రమ్మని పంపాడు. వెదకటానికి వెళ్ళి తిరిగి వచ్చిన యుధిష్టిరుడు, అలాంటి వ్యక్తులు నాకు కనబడలేదు. ఎవరిని చూసిన నాకు ఎంతో కొంత మంచే కనపడింది అని తెలియజేశారు. అంటే మంచి, చెడులు ఎక్కడైనా ఉంటాయి కాని మనము చూసే విధానమును బట్టి మన అభిప్రాయము ఏర్పడును. భగవద్గీతా మంచిలో కూడా మంచిని చూసే దృష్టి కోణమును ప్రసాదిస్తుంది. ఇప్పటివరకు తెలిపిన పరమాత్మ యొక్క మహిమలు చాలా స్వల్పము. కాని పరమాత్మ మహిమలు అనంతములు.
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సుయొక్క అంశమునుండియే కలిగినదిగా తెలిసికొనుము.
10.41 ఈ జగత్తున ఐశ్వర్యయుక్తమైనది, నిర్మలమైనది, కాంతివంతమైనది, ఉత్సాహంతో కూడినది, మొదలైన విశేషములు అన్ని కూడా పరమాత్మ తేజస్సులోని ఒక్క అంశ ద్వారానే ప్రకటించబడినవి.
ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తియొక్క ఒక్క అంశతోడనే ధరించు చున్నాను.
10.42 పరమాత్మ అర్జునునితో ఇంకనూ బాగుగా నా గురించి తెలుసుకొని ఏమి చేయగలవు? ఈ సంపూర్ణ విశ్వమును నేను నా యొక్క ఒక్క అంశతో ధారణ చేసి ఉన్నాను. అంటే వారి యొక్క సమగ్ర శక్తి గురించి మనము కల్పన కూడా చేయలేము. అందువలన మన చుట్టూ ఉన్న వివిధ రకములు అనగా భేదముల వెనుక గల ఏకత్వమును చూడగలగాలి. ప్రతి వారిలో గల విశేషములను గుర్తించి అవి పరమాత్మ కారణమూగానే కలిగినవని అంగీకరించి ఆ పరమాత్మను మనసు నందు నమస్కరించుకుంటే, ఆ మనుషులపై మత్సరము కలుగదు. ఇతరులలో గల శ్రేష్టత్వమును పరమాత్మ స్వరూపముగా చూడగలగాలి. అప్పుడప్పుడు స్వయం లో కూడా విశేషములు కనబడితే అది పరమాత్మ యొక్క స్వరూపము అని భావించి మౌనముగా ఉంటే అహంకారము సమాప్తమగును. ఒకరి యొక్క విశేష బుద్ధి, శక్తి, తేజము లేక తపస్సు ఇవన్నీ భగవంతుని కారణంగానే కలవు అని భగవంతుని మహిమ అని వారికి నమస్కరిస్తే మనలో మత్సరము జాగృతి కాదు. ఇంతటితో భగవద్గీతా యందలి పదవ అధ్యాయమైన విభూతి యోగము అనే అధ్యాయము యొక్క ఉత్తరార్ధ వివేచన సత్రము పూర్తయినది. ప్రశ్నోత్తరములు ప్రారంభమైనవి.
ప్రశ్న పరమాత్మ తాను కణ కణమునందు, జడ, చిత్తము లందు ప్రతీ ప్రాణిలోనూ ఉన్నానని తెలిపారు. కాని మరల ధేనువులలో కామధేనువును, పాములలో వాసుకిని, గిరులలో మేరును అని ఎందుకు ఒక విశేష వస్తువునకు మహత్వమును ఆపాదిస్తున్నారు?
సమాధానం అర్జునుడు పదవ అధ్యాయము లోని 17వ శ్లోకము నందు పరమాత్మని ఈ విధముగా అడిగారు. ఈ జగత్తునకు ఆధారము పరమాత్మ అని నాకు అవగతమే. కాని అలా అనుకోవడం వల్ల మనకు వారి యొక్క దర్శనం కలుగుతుందా అని ప్రశ్నించడము వలన పరమాత్మ వారి యొక్క కొన్ని విశేషములను మాత్రమే మన ముందుకు తీసుకువచ్చారు. ఉదాహరణకు వరల్డ్ వైడ్ వెబ్ (www)అనగా ఇంటర్నెట్ అంతటా ఉంటుంది కాని దానిని ఉపయోగించాలి అంటే కంప్యూటర్ ముందు మనము కూర్చోవాలి. అలాగే అంతటా ఉన్న నిన్ను విశేషముగా ఎక్కడ దర్శించగలము అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సమాధానము గా భగవానుడు తన విభూతలను కొన్ని మాత్రము మనకు తెలియజేశారు. మంచిలో కూడా మంచిని చూడగలగడమే శ్రేష్ఠత్వము. అట్టి శ్రేష్ఠత్వము తన యొక్క విభూతిగా పరమాత్మ తెలియజేస్తున్నారు. ఒక ఆటగాడు చాలా అద్భుతముగా ఆడుతాడు అనుకుందాము. ఆ అద్భుతమైన ఆటను చూసి మనకు ఆనందము కలుగును. ఆ ఆనందమునకు కారణమైన ఆ విశేషత్వము భగవానుని యొక్క విభూతి అనబడును. ఎక్కడెక్కడ అయితే విశేషము ఉంటుందో అచట భగవానుల ఉనికి తెలియబడును. సర్వత్రా భగవానుడు కలడు. కాని మనము వారిని కొలుచుటకు దేవాలయమునకు వెళ్తాము. విశేష రూపములో భగవంతున్ని మనము అక్కడ చూడగలము. మంచిలో కూడా మంచిని ఎలా చూడగలమో భగవానులు 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శనంలో తెలియజేస్తారు.
ప్రశ్న. భగవద్గీతా ను చదువుతూ చదువుతూ ఆ పరమాత్మ యొక్క మహిమను మనము పొందగలమా? తద్వారా పొందిన భక్తి ద్వారా ఇతరుల చెడు అలవాట్లను మాన్పించగలమా?
సమాధానం. పరమాత్మను ఆశ్రయించి నిశ్చయముగా అంతఃకరణ శుద్ధితో దీనిని సరి చేయండి అని ప్రార్థిస్తే తప్పక పరమాత్మ మన వెంబడి ఉండి మనల్ని దృఢపరుస్తారు. నిరంతర చంచల మనసును క్రమశిక్షణతో ఉంచుతూ మార్గదర్శనం చూపించు అని నిర్మల నిశ్చయమనసుతో ప్రార్థిస్తే తప్పక భగవంతుడు విశేషముగా ప్రయత్న రూపములో మనతో ఉండి మనల్ని నడిపించును..
ప్రశ్న. కర్మ, కర్మ ఫలితము గురించి ఆలోచిస్తే ఎన్నో మంచి పనులు చేసిన వారు కష్టాలను అనుభవించారు కదా! దీనిని ఎలా అర్థం చేసుకోగలం?
సమాధానం. ప్రస్తుతం ఉన్న జీవితము పూర్వజన్మ కర్మ ఫలితమే. ప్రపంచములో ఘోర తప్పులు చేసేవారు బాహ్య జీవితములో భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తారు. కాని అంతరంగములో వారు దుఃఖమును కలిగే ఉంటారు. వీరు ఎల్లప్పుడూ భయముతోనే జీవిస్తారు. కాని ఎవరైతే భగవద్భక్తులు ఉంటారో వారు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడ వారు ఆనందముతో జీవిస్తారు. బహిరంగముగా విభిన్నములు అనేకములు కలవు. కాని మనము కేవలము అంతరంగమును చూడాలి అప్పుడు మాత్రమే ఏకత్వము కనబడును.
ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతియోగము సమాప్తమైనది